కమ్మర్పల్లి, మే 20: వరికోత యంత్రాల వినియోగంతో రైతుకు సౌకర్యం పెరిగినా..మరో పక్క వరి కొయ్యల కాల్చివేతలు పెరిగి పోతున్నాయి. ఫలితంగా యేటా రైతు తన భూ సారాన్ని తానే బుగ్గి చేసుకుంటున్నాడు. వానకాలం వరి సాగు సమీపిస్తున్నందున పల్లెల్లో ఇప్పుడు ఎటు చూసినా వరి దుబ్బుల (వరి కొయ్యలు) కాల్చివేతలు, ఎకరాల కొద్ది మడుల్లో చెలరేగుతున్న మంటలు, కారు మబ్బుల్లా వ్యాపిస్తున్న పొగ కనిపిస్తున్నది. కాల్చివేత సందర్భంలో రైతులు అస్వస్థతకు గురి కావడం, మృత్యువాత పడుతున్న సందర్భాలూ ఉన్నాయి. వరి కొయ్యలను కాల్చివేయడానికి బదులు ప్రత్యామ్నాయ పద్ధతులను పాటించాలని వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కల్పిస్తున్నా ఫలితం కనిపించడం లేదనే చెప్పాలి. ఈ నేపథ్యంలో వరి దుబ్బుల కాల్చివేతతో కలిగే నష్టాలు.. కాల్చివేతకు ప్రత్యామ్నాయ పద్ధతులను గూర్చి వ్యవసాయాధికారులు వివరిస్తున్నారు. అవేమిటో పరిశీలిద్దాం..
వ్యవసాయ యాంత్రీకరణ ఫలితంగా వరి కోతలు కొడవళ్లతో చేపట్టే రోజులు పోయాయి. మిషన్లతో గంటల్లోనే ఎకరాల కొద్ది వరి కోతలు జరిగిపోతున్నాయి. సంప్రదాయ వరికోత పద్ధతిలో కొడవళ్లతో వరి దుబ్బులను మొదళ్ల వరకు కోసే వారు. దీంతో తరువాయి పంట కు ఈ చిన్న దుబ్బుల మొదళ్లను కలియ దున్నేసే వారు. వరి కోత యంత్రంతో దు బ్బుల మొదళ్ల నుంచి సుమారు 30 సెంటీమీటర్ల ఎత్తులో పంటను కోస్తున్నా రు. దీంతో కోతల అనంతరం గడ్డి దుబ్బుల రూపం లో ఎక్కువ మొత్తంలో పంట అవశేషాలు మడుల్లో మిగిలిపోతున్నాయి.
ప్రత్యామ్నాయాలు..
వరి దుబ్బులను కాల్చివేయడానికి బదులు ప్రత్యామ్నాయ పద్ధతులను పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. వరి దబ్బులను కోసే యంత్రాలను వినియోగించడం అలవాటు చేసుకోవాలి. పంట అవశేషాలను కాల్చకుండా శక్తి వనరుగా ఉపయోగించుకోవాలి. తద్వారా గ్రీన్హౌస్ ప్రభావాన్ని తగ్గించవచ్చు. వరి కొయ్యలను నేలలో కలియదున్ని, కలియబెట్టి నేల సారాన్ని పెంచుకోవచ్చు. పచ్చిరొట్ట విత్తనాలైన పిల్లిపెసర, జీలుగ, జనుము వేసి 45 నుంచి 55 రోజులు తర్వాత కలియదున్నాలి. తదుపరి పంటలో వేరు వ్యవస్థ బలోపేతానికి ఇది దోహదం చేస్తుంది. పశువులను మేపడం ద్వారా ఈ సమస్యను కొంతవరకు అధిగమించవచ్చు. నాట్లు వేయడానికి ముందు, మొదటి దమ్ము వేసేటప్పుడు ఎకరానికి 50 కిలోల సూపర్ఫాస్పేట్ వేస్తే కొయ్యలు తొందరగా కుళ్లి సేంద్రియ పదార్థంగా మారుతుంది. పంట వ్యర్థాలను ముడి పదార్థాలుగా వాడుకొని కంపోస్ట్ పద్ధతి ద్వారా సేంద్రియ ఎరువును తయారు చేసుకోవచ్చు
నష్టాలు..
దబ్బులను కాల్చివేయడంతో పంట నేలకు, పర్యావరణానికి నష్టం కలుగుతున్నది.
నేలలో సేంద్రియ కర్బన విలువలు తగ్గిపోతాయి.
పంటకు మేలు చేసే లక్షలాది మైక్రోబియాన్ బ్యాక్టీరియాలు తగ్గిపోయి, వాటి జీవనశైలిలో అసమతుల్యత ఏర్పడి పంట మేలు చర్యలు తగ్గిపోతాయి.
ఎరలు, నత్తలు చనిపోయి తదుపరి పంటలో చీడపీడలు పెరుగుతాయి. పర్యావరణ కాలుష్యం ఏర్పడి మనుషులు, ఇతర జీవకోటి పై ప్రభావం చూపుతుంది.
దుబ్బుల నుంచి భారీగా వెలువడే పొగ వాతావరణంలో నల్లని పొగ లాంటి మంచు బిందువులు ఏర్పడి గాలిలో కలిసి జీవనక్రియపై ప్రభావం పడుతుంది.
ఈ పొగలోని మీథేన్, కార్బన్మోనాక్సైడ్లాంటి విషవాయువులు వాతావరణంలో కలుస్తాయి.
వరి దుబ్బుల కాల్చివేతతో దిగుబడులు తగ్గుతాయి.
ప్రత్యామ్నాయ పద్ధతులు పాటించాలి..
వరికొయ్యల కాల్చివేతతో నేలకు, పర్యావరణానికి కలిగే నష్టాలను గుర్తించి రైతులు ప్రత్యామ్నాయ పద్ధతులు పాటించడాన్ని అలవాటు చేసుకోవాలి. ప్రతామ్నాయ పద్ధతులు పాటిస్తే పంటకు, నేలకు మేలు కలుగుతుంది. కాల్చివేయడం ద్వారా నష్టకారకాలు పూర్తిగా నాశనమవుతాయనేది నిజం కాదు.
-కాంపాటి మల్లయ్య, సహాయ వ్యవసాయ ,సంచాలకుడు, భీమ్గల్