బీర్కూర్ జనవరి 25: తమ పిల్లలు మంచి విద్యను అభ్యసిస్తే వారి భవిష్యత్తు బంగారుమయమవుతుందని తల్లిదండ్రులందరూ కలగంటారు. అందుకోసం ఎంత ఖర్చు అయినా భరిస్తారు. అప్పోసొప్పో చేసి పిల్లలకు నాణ్యమైన విద్య అందేలా కృషి చేస్తారు. బీర్కూర్ మండల కేంద్రంలోని చాలా మంది తల్లిదండ్రులు ప్రభుత్వ బడిని కాదనుకొని ప్రైవేటులో పిల్లలను చేర్పించారు. సరిగ్గా నాలుగేండ్ల కింద అదే ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్లమాధ్యమంలో బోధన ప్రారంభించడంతో తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేవు. అప్పు చేయకుండానే వారి పిల్లలు నాణ్యమైన ఇంగ్లిష్ మీడియం పాఠాలు వింటున్నారు. నాడు తక్కువ మంది విద్యార్థులతో వెలవెలబోయిన ఈ పాఠశాల.. ప్రస్తుతం చిన్నారుల సందడితో కిటకిటలాడుతున్నది.
ఆంగ్లమాధ్యమంతో..
కామారెడ్డి జిల్లాలోని బీర్కూర్ మండల కేంద్రంలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక బాలికల పాఠశాలలో 2017లో 75మంది విద్యార్థులు మాత్రమే విద్యనభ్యసించారు. తెలుగు మీడియం బోధనతో ఈ పాఠశాల వైపు కన్నెత్తి కూడా చూసేవారు కాదు. పీఆర్టీయూ దత్తత తీసుకున్న తర్వాత పాఠశాల మొత్తం మారిపోయింది. ఆంగ్ల మాధ్యమంలో చదువు చెబుతుండడంతో 75గా ఉన్న విద్యార్థుల సంఖ్య 326 మందికి పెరిగింది. నాడు ఈ పాఠశాలకు పిల్లలను పంపించని తల్లిదండ్రులు ప్రస్తుతం పోటీ పడి మరీ పిల్లలను జాయిన్ చేస్తున్నారు.
దాతల సహకారం..
2017 సంవత్సరంలో కామారెడ్డి జిల్లా కలెక్టర్గా ఉన్న సత్యనారాయణ పిలుపుతో పీఆర్టీయూ ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేసుకొని, ఆ బడుల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రారంభించారు. పీఆర్టీయూ ఉపాధ్యాయుల సంకల్పానికి గ్రామస్తులు, దాతల సహకారం తోడైంది. పాఠశాలకు సుమారు నాలుగైదు లక్షల వరకు నిధులను సమీకరించి సుందరంగా తీర్చిదిద్దారు. అప్పటి కలెక్టర్ సత్యనారాయణ సుమారు లక్ష రూపాయలతో విద్యార్థులకు డ్యుయల్ బెంచీలను ఏర్పాటు చేసి వెన్నుదన్నుగా నిలిచారు. విద్యార్థులకు అవసరమైన అన్నిరకాల వసతులను కల్పించడంతో ఇంగ్లిష్ మాధ్యమంలో చదువు చెప్పడంతో మండల కేం ద్రంలో ఉన్న ప్రైవేటు పాఠశాలలు కంగుతిన్నాయి. ప్రస్తు తం ఈ పాఠశాల ప్రైవేటుకు దీటుగా కొనసాగుతున్నది.
సమాజంలో ఉపాధ్యాయులదే కీలక పాత్ర
సమాజంలో ఉపాధ్యాయులదే కీలకపాత్ర కావడం చాలా గ ర్వంగా ఉంది. విద్యార్థుల భవిష్యత్తు బాగుపడుతుందన్న ఉద్దేశంతో పీఆర్టీయూ తరఫున ఈ పాఠశాలను దత్తత తీసుకున్నాం. మెరుగైన విద్యను అందిస్తూ ప్రైమరీ నుంచే ఇంగ్లిష్ మీడియంలో బోధించేలా చర్యలు తీసుకున్నాం. సీఎం కేసీఆర్ నిర్ణయంతో అందరి పిల్లలూ ప్రభుత్వ బడిలోనే చేరుతారు.