ఖలీల్వాడి, మే 20 : ప్రతిష్టాత్మక అంతర్జాతీ య మహిళా బాక్సింగ్ చాంపియన్ షిప్లో నిజామాబాద్ ముద్దుబిడ్డ నిఖత్ జరీన్ బంగారు పతకం సాధించడం జిల్లా ప్రజలు గర్వించదగ్గ విషయమని జిల్లా యువజన క్రీడల అధికారి ముత్తన్న అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్గ్రౌండ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2011 నుంచి 2022 వరకు జరీన్ బాక్సింగ్లో కోచ్ శంషొద్దీన్ వద్ద శిక్షణ తీసుకొని అంచలంచెలుగా ఎదుగుతూ దేశం గర్వించేలా బంగారు పతకం సాధించడం అభినందనీయమన్నారు. ఎన్నో ఆటంకాలను ఎదుర్కొని, పట్టుదలతో ముందుకెళ్లిందన్నారు. కష్టనష్టాలను భరించి ప్రపంచంలోనే నంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకుందన్నారు. జిల్లాలో చాలా మంది క్రీడాకారులు రాష్ట్ర, అంతర్జాతీయ స్థాయిల్లో ఆడుతున్నారని తెలిపారు.
ఇంటర్నేషనల్ ప్లేయర్ అవుతుందని ముందేచెప్పా: కోచ్ శంషొద్దీన్
బాక్సింగ్ శిక్షణ మొదలు పెట్టినప్పుడు జిల్లా నుంచి నిఖత్ జరీన్ను ఇంటర్నేషనల్ ప్లేయర్ను తయారుచేస్తానని ముందే చెప్పానని కోచ్ శంషొద్దీన్ తెలిపారు. అనుకున్న మాదిరిగానే తయారుచేసినట్లు చెప్పారు. పట్టుదల, కృషి ఉంటేనే ఆస్థాయికి ఎదుగుతారని అన్నారు. ముందునుంచి బాయ్స్తో పోటీపడి నైపుణ్యం సాధించింద న్నారు. సమయపాలన తప్పనిసరిగా పాటించాలని సూచించగా, దానికి తగ్గట్లుగా ఎంతో కష్టపడేదని గుర్తుచేశారు. బాక్సింగ్పైనే దృష్టి సారించిందని, దాని ఫలితమే బంగారు పతకం సాధించిందని తెలిపారు.