నందిపేట్, మే 20: మండలంలోని ఆంధ్రనగర్ గ్రామంలో ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ, గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ అండ్ తానా ఫౌండేషన్ (ఉత్తర అమెరికా తెలుగు సంఘం) ఆధ్వర్యంలో శుక్రవారం ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరం నిర్వహించారు. శిబిరాన్ని కలెక్టర్ నారాయణరెడ్డి సందర్శించి గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ అందిస్తున్న సేవలను ప్రశంసించారు. ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో నిర్వహించాలని కోరా రు. ప్రజలను క్యాన్సర్ బారి నుంచి కాపాడుకోవడానికి ఇటువంటి వైద్యశిబిరాలు ఎంతగానో ఉపకరిస్తాయన్నారు. జిల్లా రెడ్క్రాస్ ప్రతినిధి బూస ఆంజనేయులు మాట్లాడుతూ.. ప్రతి గ్రామానికి మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ బస్సుల ద్వారా ఉచిత నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తూ, అవసరమైన వారికి ఉచిత మందుల పంపిణీకి ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. శిబిరంలో సుమారు 100 మంది క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయించుకుని మందులు పొందారన్నారు. శిబిరంలో గ్రేస్క్యాన్సర్ ఫౌండేషన్ సభ్యులు, ఎంపీడీవో నాగవర్ధన్, డాక్టర్ రవీంద్రనాథ్ సూరి పాల్గొన్నారు.