రెంజల్/నవీపేట, మే 16 : అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని అరబెట్టి తీసుకువస్తే మద్దతు ధరతో కొనుగోలు చేస్తామని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ హామీ ఇచ్చారు. రెంజల్ మండలం దూపల్లి, కళ్యాపూర్, తాడ్బిలోలి గ్రామాలతోపాటు నవీపేట మండలం బినోలా సొసైటీ వద్ద తడిసిన ధాన్యాన్ని సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి ఆందోళన చెందొద్దని సూచించారు. కొనుగోళ్లను వేగవంతం చేసి ధాన్యం తరలించేందుకు లారీల కొరత లేకుండా, మిల్లర్ల నుంచి సమస్యలు ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. వర్షానికి తడిసిన ధాన్యం వివరాలను తహసీల్దార్లు రాంచందర్, లతను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట దూపల్లి, బినోలా సొసైటీల చైర్మన్లు భూమారెడ్డి, మగ్గరి హన్మాండ్లు, నాయకులు ఉన్నారు.
పలుచోట్ల రైతుల ఆందోళన
ఆర్మూర్/నందిపేట్/మాక్లూర్, మే 16 : వర్షానికి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ రైతులు పలుచోట్ల ఆందోళన చేశారు. ఆర్మూర్ పట్టణంలో రైతులు రాస్తారోకో చేయగా, ఎస్సైలు యాదగిరిగౌడ్, శ్రీకాంత్, తహసీల్దార్ వేణుగోపాల్గౌడ్ అక్కడికి చేరుకొని న్యాయం జరిగేలా చూస్తామని శాంతింపజేశారు. కొనుగోళ్లు వేగవంతం చేయాలంటూ నందిపేట్లో తల్వేద రైతులు రాస్తారోకో చేశారు. మాక్లూర్ మండలం అమ్రాద్ సహకార సంఘం పరిధిలోని రైతులు సొసైటీకి తాళం వేసి నిరసన తెలిపారు.