డిచ్పల్లి, మే 16 : ప్రభుత్వం ప్రతి ధాన్యపు గింజనూ కొనుగోలు చేస్తుందని, రైతులు ఆందోళన చెందవద్దని ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. ఆదివారం అర్ధరాత్రి కురిసిన వర్షంతో పెద్ద మొత్తంలో వరి ధాన్యం తడిసి ముద్దయ్యింది. విషయం తెలుసుకున్న ఆర్టీసీ చైర్మన్.. సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి నిజామాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డితో ఫోన్లో మాట్లాడారు. వర్షానికి తడిసిన ధాన్యాన్ని బాయిల్డ్ రైస్మిల్లులకు తరలించేలా చూడాలని కలెక్టర్ను కోరారు. రూరల్నియోజకవర్గంలో 30 శాతం వరకు ధాన్యం తడిసిందని, రైతులు ఆందోళన చెందుతున్న దృష్ట్యా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ప్రతి గింజనూ కొనుగోలు చేయాలన్నారు. లారీల కొరతతో ధాన్యం తరలింపులో కొంత జాప్యం జరిగిందని, ట్రాన్స్పోర్ట్ యజమానులపై తగిన చర్యలు చేపట్టాలని కలెక్టర్కు సూచించారు. ఇందల్వాయి సహకార సంఘం పరిధిలో సుమారు 25 వేల బస్తాల ధాన్యం తడిసిందని రైతులు ఆర్టీసీ చైర్మన్ దృష్టికి తీసుకు వచ్చారు.
ఆర్టీసీ చైర్మన్ ఆదేశాల మేరకు తడిసిన ధాన్యం పరిశీలన
ఆర్టీసీ చైర్మన్ ఆదేశాలతో ఉదయం ఆర్డీవో రవి, డీసీవో సింహాచలం ఇందల్వాయి సహకార సంఘం పరిధిలోని ఇందల్వాయి, గన్నారం కొనుగోలు కేంద్రాలు, తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. రైతులు అధైర్యపడొద్దని హామీనిచ్చారు. వారి వెంట ఎంపీపీ రమేశ్ నాయక్, విండో చైర్మన్ గోవర్ధన్రెడ్డి, వైస్చైర్మన్ మారుతి, సీఈవో రతన్, సొసైటీ డైరెక్టర్లు నామాల గంగాధర్, చిలువేరి దాసు, గంగారెడ్డి, రాంరెడ్డి, మల్లారెడ్డి, సుధాకర్, రాజు, రైతులు ఉన్నారు.