ఖలీల్వాడి/డిచ్పల్లి, మే 15 : జిల్లాలో డెంగీ కేసుల సంఖ్య తగ్గుతూ వస్తున్నది. ఈ ఏడాది ఇప్పటి వరకు 17 కేసులు నమోదయ్యాయి. వైద్యారోగ్యశాఖ సిబ్బంది ఇంటింటికీ తిరుగుతూ దోమల నివారణ చర్యలు, పరిశుభ్రత ఆవశ్యకతపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పింస్తుండడం సత్ఫలితాలను ఇస్తున్నది. పూల కుండీలు, ఎయిర్కూలర్లు, పాతటైర్లు, పాత ఖాళీ డబ్బాల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి శుక్రవారం డ్రై డేను పాటిస్తున్నారు. డెంగీ నివారణ చర్యలపై అవగాహన కల్పించేందుకు ఇంటింటికీ స్టిక్కర్లను అతికిస్తున్నారు. మురికి కుంటల్లో ఆయిల్బాల్స్ వేసి దోమ లార్వ వృద్ధి చెందకుండా చర్యలు తీసుకుంటున్నారు.
డెంగీ లక్షణాలు
హఠాత్తుగా 101 నుంచి 105 డిగ్రీల జ్వ రం వస్తుంది. తీవ్రమైన తలనొప్పి, నొప్పులు, కండ్లు మండటం వంటి లక్షణాలు ఉంటాయి. కడుపులో తిప్పడం, వాంతులు, నీరసం, తలతిరగడం, మలవిసర్జన సమయంలో రక్తస్రావం తదితర లక్షణాలు ఉంటాయి.
పరోక్ష పద్ధతిలో చికిత్స
డెంగీకి ప్రత్యేకంగా మందులు లేకపోవడం కారణంగా, చికిత్సా విధానం పరోక్ష పద్ధతిలో ఉంటుంది. రోగులకు నోటి ద్వారా లేదా రక్తనాళాల ద్వారా ద్రవాలను పంపిస్తారు. అప్పుడప్పుడు ప్లేట్లెట్లను ఎక్కిస్తారు. చాలా కేసుల్లో ప్లేట్లెట్లు 10 వేల స్థాయికి పడిపోయినా, తీవ్రమైన రక్తస్రావం ఉన్నా ఇచ్చే సింగిల్ డోనార్ ప్లేట్లెట్లు లేదా యాంటీఆర్హెచ్డీ ఇంజక్షన్లు మాత్రం ఖరీదైనవి ఇస్తారు. 95 శాతం మందికి రక్తపోటు, ప్లేట్లేట్లు, హిమోగ్లోబిన్ను గమనిస్తూ ఉండడం, ఇంట్రావీసన్ ఫ్లూయిడ్స్ ఇవ్వడం చేస్తా రు. అవసరం లేకున్నా ప్లేట్లెట్స్ ఎక్కించడం, పీఆర్పీలు రోగికి నష్టం కలిగిస్తాయి.
నివారణ ఎలా ?
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని దోమలు చేరకుండా చూసుకోవడం ద్వారా నివారించవచ్చు. జ్వర లక్షణాలు కనిపిస్తే వీలైనంత త్వరగా వైద్య పరీక్ష చేయించుకోవాలి. ద్రవ పదార్థాలు అధికంగా తీసుకోవాలి. పండ్లరసాలు లేదా కొబ్బరినీళ్లలో గ్లూకోజ్ కలుపుకుని తాగాలి, పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి. రాత్రిపూట బాగా నిద్రపోవాలి. దోమతెరలు, దోమలను పారదోలే రసాయనాలను వాడాలి, నిలువ నీరు లేకుండా చూసుకోవాలి. ముఖ్యంగా ఇంటి చుట్టూ పరిశుభ్రంగా ఉంచాలి.
దవాఖానలో ఎప్పుడు చేరాలి
రక్తపోటు పడిపోవడం, వాంతులు, నోటి ద్వా రా ద్రవాలు తీసుకోవడం కష్టంగా ఉండడం, ప్లేట్లెట్ల సంఖ్య 50 వేల కన్నా తక్కువ స్థాయికి పడిపోయినా దవాఖానలో చేరాలి. జ్వరం తగ్గిన తర్వాత 48 నుంచి 72 గంటలు రోగిని పరిశీలనలో ఉంచి, ప్లేట్లెట్ల సంఖ్య క్రమంగా 50 వేలకు పెరిగే వరకు దవాఖానలోనే ఉండాలి. ప్లేట్లేట్ల సంఖ్య 30వేల కన్నా తగ్గినా, తీవ్రమైన రక్తస్రావం అవుతున్నా, ఏదైనా శరీర భాగం సరిగ్గా పని చేయకపోయినా రోగిని ఐసీయూలో చేర్చాల్సి వస్తుంది.
డెంగీ కేసులు అదుపులో ఉన్నాయి..
జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక బృందాలతో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. ఇంటింటికీ తిరుగుతూ పరిశుభ్రతపై అవగాహన కల్పిస్త్తూ కరపత్రాలను పంచుతున్నాం. ప్రతి శుక్రవారం డ్రై డే స్పెషల్ ప్రోగ్రాం చేస్తున్నాం. ఈ ఏడాది 17 కేసులు నమోదయ్యాయి. వైద్య సిబ్బంది జిల్లా వ్యాప్తంగా తిరుగుతున్నారు. డెంగీ నివారణకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
– తుకారాం రాథోడ్, జిల్లా మలేరియా అధికారి
సంవత్సరం : కేసులు
2015 : 357
2016 : 235
2017 : 212
2018 : 155
2019 : 590
2020: 66
2021 : 396
2022 : 17