నిజామాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): దేశానికి పట్టుగొమ్మలైన పల్లెల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ‘ప్రగతి’బాట వేస్తున్నది. పల్లెప్రగతి కార్యక్రమం గ్రామ సీమల రూపురేఖలు మార్చేసింది. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత పల్లెలు అభివృద్ధికి నోచుకుంటున్నాయి. ఉమ్మడి రాష్ట్రం లో గ్రామాల అభివృద్ధిని పాలకులు పట్టించుకోలేదు. తద్వారా పల్లెలు అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచాయి. నిధులు లేక అభివృద్ధి కుంటుపడింది. అయితే, తెలంగాణ వచ్చాక టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో ప్రజల భాగస్వామ్యం పెరిగి ఊర్లన్నీ బాగు పడుతున్నాయి. ప్రభుత్వం అనుకున్న లక్ష్యం నెరవేరడంతో పాటు గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత నెలకొనేలా ఉండేందుకు కేంద్ర ఫైనాన్స్ కమిషన్ నిధులతో పాటు స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నిధులు సమాన వాటాగా పంచాయతీలకు చేరుతున్నాయి. ఈ నెల 20 నుంచి జూన్ 5 వరకు నిర్వహించనున్న ఐదో విడుత పల్లె ప్రగతి కార్యక్రమంలో చేపట్టనున్న పనుల వివరాలను సేకరించనున్నారు.
చేపట్టిన పనులు..
గ్రామాలను అభివృద్ధి చేయడంతో పాటు సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం 2019 సెప్టెంబర్లో పల్లెప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించింది. 2020 జనవరిలో రెండో విడుత, జూన్ 2020లో మూడో విడుత, 2021 జూలై 1 నుంచి నాలుగో విడుత నిర్వహించారు. నాలుగు విడుతల్లో నిజామాబాద్ జిల్లాలో 526 వైకుంఠధామాలు పూర్తి చేశారు. 530 గ్రామ పంచాయతీల్లో 660 పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేశారు. హరిత వైకుంఠధామాలుగా 261 మార్చారు. 529 డంపింగ్ యార్డుల్లో హరిత డంపింగ్ యార్డులుగా 252 గుర్తించారు. 530 పంచాయతీలకు ట్రాక్టర్లు, ట్రాలీలు, ట్యాంకర్లు అందించారు. ఇప్పటి వరకు చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమాలతో ఊహించని అభివృద్ధి జరిగింది. ముఖ్యంగా పాత ఇండ్ల కూల్చివేత, అపరిశుభ్రంగా ఉన్న ప్రాంతాలు బాగు చేయడం, రోడ్లపై గుంతలు పూడ్చడం వంటి పనులతో పాటుగా ఇతరత్రా సౌకర్యాల కల్పనకు పెద్ద పీట దక్కింది. గత పల్లెప్రగతిలో నిజామాబాద్ జిల్లాలో 1,023 పాత ఇండ్లను కూల్చివేశారు. 1,887 ఖాళీ స్థలాలను పరిశుభ్రంగా మార్చారు. రోడ్లపై 1,728 గుంతలను పూడ్చారు. 827 లోతట్టు ప్రాంతాలను బాగు చేశారు. 1,977 నీటి ట్యాంకులను శుభ్రం చేశారు. 1,071 పైప్లైన్ లీకేజీలు గుర్తించి సరిచేశారు. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలో లక్షా 79వేల 205 నివాసాల్లో తడి, పొడి చెత్తను వేర్వేరు చేస్తున్నారు. 1,254 విద్యుత్ లైన్లు, 1,196 విద్యుత్ స్తంభాలను సరి చేశారు.
రూపురేఖలు మారుతున్నాయి..
పల్లెప్రగతితో పల్లెల రూపురేఖలు మారుతున్నాయి. అభివృద్ధే లక్ష్యంగా చేపట్టిన పల్లె ప్రగతి పనులు గ్రామాలకు వరంగా మారాయి. ప్రజలకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు సమకూరడంతో గ్రామ పంచాయతీలు అద్దంలా మెరుస్తున్నాయి. విరివిగా మొక్కలు పెంచి జీవ వైవిధ్యం పెంపొందించేందుకు ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రకృతి వనాల లక్ష్యం నెరవేరింది. ప్రకృతి వనంలో తిరగడానికి వీలుగా రోడ్లు, కూర్చోవడానికి సిమెంట్ బల్లలు, విద్యుత్ దీపాలు, నీటి వసతి ఏర్పాటు చేశారు. గతంలో గ్రామాల్లో ఎవరైనా చనిపోతే దహన సంస్కారాలు నిర్వహించేందుకు తీవ్ర ఇబ్బందులు పడేవారు. ప్రభుత్వ స్థలాల్లో శ్మశానవాటికల నిర్మాణాలతో కాటి కష్టాలు తీరాయి. దహన సంస్కారాల ప్లాట్ ఫారం, స్నానాల గదులు, నీటి సౌకర్యం, పురుషులకు, స్త్రీలకు వేర్వేరుగా మరుగుదొడ్లు, దుస్తులు మార్చుకునే గదులు వంటి సదుపాయం కల్పించారు. పల్లె ప్రగతి పక్కాగా ఫలాలను అందిస్తోంది. ప్రారంభ ఆర్భాటాలకే పరిమితం కాకుండా… ఆదర్శవంతంగా కార్యక్రమాలు అమలవుతున్నాయి. ఆదర్శ బాటలో గ్రామాలు నడవడంతో అంతటా ఫలితాలు కనిపిస్తున్నాయి. పంచాయతీ పాలక వర్గంతో పాటు ప్రభుత్వ పరంగా పరిపాలన పరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు జూనియర్ పంచాయతీ సెక్రటరీ పోస్టులను భర్తీ చేసి గ్రామాలకు పెద్ద ఎత్తున వారిని కేటాయించింది.
చెత్తపై యుద్ధం..
పల్లెల్లో గతంలో ఎక్కడ పడితే అక్కడ చెత్త వేసే వారు. ఇప్పుడు సేకరించిన చెత్తను ట్రాక్టర్ల ద్వారా తీసుకెళ్లి డంపింగ్ యార్డులో వేయడంతో వీధులు శుభ్రంగా మారుతున్నాయి. కంపోస్టు షెడ్లు నిర్మించి ఎరువుల తయారీకి సన్నాహాలు చేస్తున్నారు. చెత్త తొలగింపునకు ఇతర అవసరాలకు ప్రతి గ్రామానికీ ఒక ట్రాక్టర్ను, నీటి ట్యాంకర్ను కొనుగోలు చేశారు. హరితహారంలో మొక్కలను తీసుకెళ్లడానికి, నాటిన వాటికి నీళ్లు పెట్టడానికి వీటిని వినియోగిస్తున్నారు. ట్రాక్టర్ల కొనుగోలుతో గ్రామాల్లో అనేక సమస్యలు తొలగిపోయాయి. గ్రామానికి ఒక ట్రాక్టర్ ఉంటే చెత్త సేకరణతో పాటు, మొక్కలకు నీళ్లను పట్టించేందుకు ఉంటుందని జిల్లా వ్యాప్తంగా ప్రతి జీపీకి ట్రాక్టర్, ట్యాంకర్, ట్రాలీని సమకూర్చారు. ఇంటింటి నుంచి వచ్చిన చెత్తను ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా చెత్తను సేకరించడంతో పాటు సేకరించిన చెత్తను వర్మి కంపోస్టు మార్చేందుకు 529 గ్రామాల్లో డంపింగ్ యార్డులు సైతం నిర్మాణాలు చేపట్టారు. కంపోస్టు షెడ్లు నిర్మించారు.
ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు చర్యలు..
పల్లె ప్రగతి కార్యక్రమానికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. పంచాయతీ రాజ్ శాఖ మార్గదర్శకాల మేరకు ఈ నెల 20 నుంచి వచ్చే నెల 5 వరకు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటికే గ్రామ పంచాయతీ పాలకవర్గాలకు, సిబ్బందికి ఆదేశాలు జారీ చేశాం. గ్రామాల్లో చేపట్టాల్సిన పనుల వివరాలను సేకరించడంతో పాటు పల్లె ప్రగతిలో వీటిని పరిష్కరించేందుకు కృషి చేయబోతున్నాం.
– జయసుధ, డీపీవో, నిజామాబాద్