విద్యానగర్, మే 14 : మన ఊరు – మన బడి కార్యక్రమంలో భాగంగా ఎంపికైన పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని డ్రైవర్స్కాలనీలో ఉన్న ఉర్దూ మీడియం ప్రాథమిక పాఠశాలను ఆయన శనివారం పరిశీలించారు. పాఠశాలలోని తరగతి గదులు, వసతుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. మౌలిక వసతుల కల్పన కోసం ప్రతిపాదనలను సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట ఎంఈవో ఎల్లయ్య, ప్రధానోపాధ్యాయుడు, ఇంజినీరింగ్ అధికారులు, ఉపాధ్యాయులు ఉన్నారు.
మహిళల్లో రక్తహీనత లేకుండా చూడాలి
మహిళల్లో రక్తహీనత లేకుండా చూడాలని ఇండియన్ రెడ్క్రాస్ ప్రతినిధులకు కలెక్టర్ జితేశ్ పాటిల్ సూచించారు. జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులతో ఆయన శనివారం సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. జిల్లాలో అత్యధిక రెడ్ క్రాస్ సభ్యత్వాలు చేయించాలన్నారు. రక్తదానంపై అవగాహన కల్పించాలని సూచించారు. రెడ్క్రాస్ జిల్లా చైర్మన్ రాజన్న మాట్లాడుతూ.. కలెక్టర్ సూచనలను అమలు చేస్తామని అన్నారు. సమావేశంలో రెడ్క్రాస్ జిల్లా వైస్ చైర్మన్ నాగరాజ్ గౌడ్, కార్యదర్శి రఘుకుమార్, కోశాధికారి దస్తీరాం, కరస్పాండెంట్ డాక్టర్ నరసింహం, డివిజన్ చైర్మన్ రమేశ్రెడ్డి, వేణుగోపాల్, డివిజన్ వైస్ చైర్మన్ డాక్టర్ విక్రమ్, ఈసీ మెంబర్లు విఠల్రెడ్డి, డాక్టర్ కృష్ణ, బుచ్చిరెడ్డి, భూమయ్య పాల్గొన్నారు.