బోధన్, మే 1: ప్రజా సమస్యలను పరిష్కరించాలని, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు ఎంపీ అర్వింద్ ఇంటి ఎదుట ధర్నా నిర్వహించాలని టీఆర్ఎస్ బోధన్ పట్టణ కమిటీ నాయకులు సూచించారు. బోధన్లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గాండ్ల రవీందర్ యాదవ్ మాట్లాడారు. గతనెల 30న కొందరు బీజేపీ నాయకులు పట్టణంలోని డబుల్బెడ్ రూం ఇండ్ల వద్ద మాట్లాడిన మాటలను ఖండిస్తున్నామన్నారు.
ఎలాంటి అర్హత లేని వ్యక్తులు ధర్నా చేయడం సిగ్గుచేటన్నారు. ఎంపీ అర్వింద్ నియోజకవర్గానికి ఒక్క రూపాయి కేటాయించలేదనే విషయాన్ని గుర్తించాలన్నారు. 2019లో ఎన్నికల్లో బోధన్ నియోజకవర్గానికి రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా లక్ష ఇండ్లు నిర్మించి ఇస్తామని వాగ్దానం చేశారని, నేటి వరకు ఒక్క ఇల్లు కట్టిచ్చిన పాపాన పోలేదని విమర్శించారు. కౌన్సిలర్ తూము శరత్రెడ్డి మాట్లాడుతూ బీజేపీ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడడం సరి కాదన్నారు. సమావేశంలో టీఆర్ఎస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కొత్తపల్లి రాధాకృష్ణ, కౌన్సిలర్లు డేగావత్ ధూప్సింగ్ నాయక్, అబ్దుల్లా, జావిద్, శ్రీకాంత్ గౌడ్, పిట్ల సత్యనారాయణ నాయకులు తోకల గంగారెడ్డి, పి. గంగాధర్ గౌడ్, గుమ్ముల అశోక్ రెడ్డి, నక్క లింగారెడ్డి, శంకర్ గౌడ్, రవి శంకర్గౌడ్, లోకం శ్రీనివాస్ పాల్గొన్నారు.