ఖలీల్వాడి/నిజామాబాద్రూరల్/డిచ్పల్లి/ రెంజల్/ బోధన్/ఆర్మూర్, ఏప్రిల్ 10: శ్రీరామనవమి వేడుకలను జిల్లావ్యాప్తంగా ఆదివారం వైభవంగా నిర్వహించారు. జిల్లాలోని ప్రసిద్ధ రామాలయాల్లో కల్యాణోత్సవాన్ని కన్నులపండువగా నిర్వహించగా, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని ఖిల్లా రఘునాథ ఆలయం, బడారాం మందిరం, సుభాష్నగర్ రామాలయంలో ఉత్సవాలు వైభవంగా కొనసాగాయి. ఖిల్లా రఘునాథ ఆలయంలో మేయర్ నీతూకిరణ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. నగరంలోని జెండా బాలాజీలో ఆలయంలో సీతారాముల కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.
హమాల్వాడి, మాధవనగర్, తేనెసాయిబాబా ఆలయాల్లో బాబా జన్మదిన వేడుకలు నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నిజామాబాద్ రూరల్ మండలం సారంగాపూర్ కోదండరామాలయం భక్తులతో కిటకిటలాడింది. డిచ్పల్లి మండలంలోని ఖిల్లా రామాలయంలో ఉదయం 11గంటలకు శ్రీరామ జననం, 12గంటలకు సీతారాముల కల్యాణోత్సవ వేడుకను వైభవంగా నిర్వహించారు. ధర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ స్వామివారికి పట్టువస్ర్తాలు, పుస్తెమెట్టెలు, తలంబ్రాలు సమర్పించారు. జిల్లా కేంద్రంలో శ్రీరామనవమి శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. దుబ్బ నుంచి ప్రారంభమైన శోభాయాత్ర నగరంలోని పలుప్రాంతాల మీదుగా కొనసాగింది.
రెంజల్ మండలంలోని కందకుర్తిలో ఆనవాయితీ ప్రకారం నిర్వహించే నామకరణోత్సవ సంబురాలు అంబరాన్నంటాయి. రెండేండ్ల అనంతరం భక్తుల మధ్య ఉత్సవాలను నిర్వహించారు. శనివారం అర్ధరాత్రి దాటాక ఉత్సవ మూర్తులకు శోభాయాత్రను నిర్వహించారు.
బోధన్ పట్టణంలోని శ్రీ కోదండ రామాలయంలో సీతారాముల కల్యాణోత్సవం వైభవోపేతంగా, కనుల పండువగా జరిగింది. రాములోరికి ఎదుర్కోలు నుంచి తలంబ్రాల సన్నివేశం వరకు వేద మంత్రోచ్ఛారణల మధ్య వేద పండితుడు ప్రవీణ్ మహరాజ్ ఆధ్వర్యంలో పలువురు పండితులు నిర్వహించారు. కల్యాణోత్సవంలో కన్యాదాతలుగా రామాలయ కమిటీ కార్యదర్శి మల్లాది వెంకటేశ్వర శర్మ, సుబ్బలక్ష్మి దంపతులు వ్యవహరించారు. రాత్రి శక్కర్నగర్ కాలనీ వీధుల్లో రాములోరి రథోత్సవం ఘనంగా జరిగింది. నేడు పట్టాభిషేకం నిర్వహించనున్నారు.
సిద్ధులగుట్టపై నిర్వహించిన రాములోరి కల్యాణానికి టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆశన్నగారి రాజేశ్వర్రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ చంద్రశేఖర్రెడ్డి దంపతులు పట్టువస్ర్తాలను సమర్పించారు. ఈ సందర్భంగా 50వేల మందికి అన్నదానం నిర్వహించారు.