ప్రపంచ బాక్సింగ్ వేదికపై ఇందూరు బిడ్డలు దూసుకు పోతున్నారు. రింగ్లో సత్తా చాటి నిజామాబాద్ జిల్లా ఖ్యాతిని విశ్వవ్యాపితం చేస్తున్నారు. వారే మన యువ బాక్సర్లు నిఖత్ జరీన్, హుసాముద్దీన్. ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్లో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న జరీన్, హుసాముద్దీన్ ఇప్పటికే పతకాలు ఖాయం చేసుకున్నారు. శనివారం జరగనున్న సెమీస్లో సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతున్నారు.
నిజామాబాద్ స్పోర్ట్స్, ఆగస్టు 4: ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్లో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్లో మన జిల్లా బాక్సర్లు చెలరేగుతున్నారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన నిఖత్ జరీన్, హుస్సాముద్దీన్ ఇప్పటికే సెమీస్కు చేరి పతకాలు ఖాయం చేశారు. మరో రెండు విజయాలు సాధించి పసిడి పతకాలతో రికార్డు సృష్టించాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఇందూరు బిడ్డ, ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ నిఖత్ జరీన్ కామన్వెల్త్ పోటీల్లోనూ సత్తా చాటుతున్నది.
క్వార్టర్స్లో ప్రత్యర్థి జోనస్ హెలెన్ను 5-0తో ఓడించిన నిఖత్ పతకాన్ని ఖాయం చేసుకుంది. తొలిసారి కామన్వెల్త్ పోటీల్లో తల పడుతున్న ఈ యువ బాక్సర్ పసిడి పతకాన్ని ఒడిసి పడతానని ముందే ప్రతిన బూనింది. అందుకు తగ్గట్టుగానే వరుస విజయాలతో దూసుకుపోతున్న నిఖత్ ప్రపంచ చాంపియన్ సత్తా ఏమిటో చూపిస్తున్నది.
శనివారం జరిగే సెమీ ఫైనల్ విజయం సాధించేందుకు సన్నద్ధమవుతున్నది. ఇక, మన జిల్లాకే చెందిన బాక్సర్ హుసాముద్దీన్ కూడా విజయ పరంపరతో సెమీస్కు చేరాడు. గత కామన్వెల్త్ గేమ్స్లో కాంస్యం గెలుచుకున్న హుసామ్.. ఈసారి పసిడి పతకమే లక్ష్యంగా ప్రత్యర్థులపై పంచ్లు విసురుతున్నాడు. ఇప్పటికే పతకం ఖాయం చేసుకున్న అతడు.. శనివారం జరిగే సెమీస్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. ఆల్ ది బెస్ట్ జరీన్, హుసాముద్దీన్.