పాలనలో పారదర్శకతకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. ఎక్కడా అక్రమాలకు తావు లేకుండా చర్యలు చేపడుతున్నది. అభివృద్ధి ఫలాలు అందరికీ అందేలా పటిష్ట విధానాలను రూపొందిస్తున్నది. విద్యారంగాన్ని బలోపేతం చేస్తున్న కేసీఆర్ సర్కారు.. బడులు, వసతి గృహాల్లో వసతులను మెరుగు పరుస్తున్నది. సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు అన్ని సౌకర్యాలు అందుబాటులోకి తీసుకొచ్చింది. అదే సమయంలో అక్రమాలకు తావు లేకుండా బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో విద్యార్థులు లేకున్నా ఉన్నట్లు చూపి కొందరు వార్డెన్లు అక్రమాలకు పాల్పడ్డారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలని ప్రభుత్వం బయోమెట్రిక్ హాజరు నమోదుకు నిర్ణయించింది. నిజామాబాద్ జిల్లాలోని ఎస్సీ వసతి గృహాల్లో ఇప్పటికే ఈ ప్రక్రియ అమలులోకి వచ్చింది. అయితే, సాంకేతిక కారణాలు చూపి బయోమెట్రిక్ మిషన్లను పక్కన పడవేసేందుకు యత్నిస్తున్నట్లు తెలిసింది.
నిజామాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): పారదర్శక పాలనకు పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అక్రమాలకు తావు లేకుండా పటిష్ట చర్యలు చేపడుతున్నది. ఎస్సీ వసతి గృహాల్లో పలు కారణాలతో నిలిచిన బయోమెట్రిక్ను తిరిగి అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నది. నిజామాబాద్ జిల్లాలో ఈ ప్రక్రియ ఇప్పటికే అమల్లోకి వచ్చింది. కొంత మంది వార్డెన్లు విద్యార్థులు లేకున్నా ఉన్నట్లుగా చూపి వారి పేరిట సొమ్ములు జేబులు వేసుకున్న తంతు గతంలో వెలుగు చూసింది.
ఇలాంటి అక్రమాలను నివారించి, హాజరు నమోదు ప్రక్రియలో పారదర్శకతను పెంచేందుకు ప్రభుత్వం వసతి గృహాల్లో బయోమెట్రిక్ విధానాన్ని తీసుకొచ్చింది. కరోనా కారణంగా 2020 మార్చి నుంచి బయోమెట్రిక్ విధానం నిలిచి పోయింది. అయితే, ఈ విద్యా సంవత్సరం నుంచి తప్పనిసరిగా అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. జిల్లాలోని అన్ని ఎస్సీ వసతి గృహాల వార్డెన్లకు ఆదేశాలు రావడంతో నమోదు ప్రక్రియను పునః ప్రారంభించారు.
దీంతో హాజరు నమోదులో కచ్చితత్వం, సరుకులు, నిధులు పక్కదారి పట్టకుండా చర్యలు చేపట్టేందుకు అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. బయోమెట్రిక్ హాజరు నమోదు ద్వారా విద్యార్థుల సంఖ్య కచ్చితంగా తెలుసుకునే వీలుంటుంది. ప్రతి రోజూ విద్యార్థులు, సిబ్బంది రెండు సార్లు బయోమెట్రిక్ హాజరు నమోదు చేయాల్సి ఉంటుంది. అయితే, జిల్లాలో సాంకేతిక కారణాలు తెర మీదికి తీసుకొచ్చి బయోమెట్రిక్ను పక్కన పెట్టేందుకు యత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తున్నది.
నిజామాబాద్ జిల్లాలో 32 ప్రీ మెట్రిక్ ఎస్సీ వసతి గృహాలున్నాయి. ఇందులో 25 బాలురు, 7 బాలికల హాస్టళ్లు ఉన్నాయి. ప్రభుత్వ భవనాల్లోనే వీటి కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. 2022-23 విద్యా సంవత్సరంలో 1,160 మంది విద్యార్థులకు వసతి కల్పించారు. ఇక కళాశాల వసతి గృహాలు(పోస్ట్ మె ట్రిక్) 10 ఉన్నాయి. ఇందులో 4 బాలురకు, 6 బాలికల కోసం కేటాయించారు.
అన్ని కళాశాల వసతి గృహా ల్లో ఇంటర్ నుంచి పీజీ వరకు విద్యను అభ్యసిస్తున్న వారు వసతి పొందుతున్నారు. జిల్లాలో పది కాలేజీ హాస్టళ్లలో 1,060 మంది విద్యార్థులకు వసతి లభిస్తున్నది. షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రీ, పోస్ట్మెట్రిక్ వసతి గృహాలు మొత్తం 42 ఉండగా, 2,220 మంది వసతి పొందుతున్నారు. ప్రభుత్వమే భోజన సౌకర్యం కల్పించడంతో పాటుగా ఇతరత్రా సౌకర్యాలను సైతం అందిస్తున్నది.
సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థుల హాజరు శాతాన్ని మెరుగు పరుస్తూ వారికి నాణ్యమైన విద్యను అందించాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బయోమెట్రిక్ విధానం మూణ్ణాళ్ల ముచ్చటగా మారకుండా చూడాల్సిన బాధ్యత జిల్లా స్థాయి అధికారులపై ఉంది. నిరంతర తనిఖీలతో పర్యవేక్షణ చేస్తే కానీ బయోమెట్రిక్ విజయవంతంగా అమలయ్యే అవకాశం లేదు.
రాష్ట్ర స్థాయి నుంచి ఆదేశాలు రాగానే హడావిడి చేయడం, కొద్ది రోజులకే సాంకేతిక కారణాలను చూపి మిషిన్లను మూలకు పెడుతుండటం గతంలో జరిగింది. ఈ తంతుకు శాఖాధికారులు సైతం సహకరిస్తుండడంతో గందరగోళం ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో వ్యయప్రయాసాలకోర్చి వీటిని అమల్లోకి తీసుకు వస్తుండగా.. వసతి గృహాల నిర్వాహకులు నామమాత్రంగానే అమలు చేస్తున్నట్లుగా తెలుస్తున్నది. దీని వల్ల ప్రభుత్వ లక్ష్యం నెరవేరకుండా పోయే అవకాశమున్నది.
వసతి గృహాల్లోని విద్యార్థుల హాజరు నమోదుకు బయోమెట్రిక్ విధానం అమలు చేస్తుండడంతో నిర్వాహకుల్లో వణుకు మొదలైంది. ఇష్టారాజ్యానికి చెక్ పడి, పారదర్శకత పాటించాల్సి రావడం మూలంగా కొంత మందికి ఈ విధానం కొరకరాని కొయ్యలా మారింది. కరోనా విజృంభణ నేపథ్యంలో బయోమెట్రిక్ హాజరు ప్రక్రియను మూడేళ్ల పాటు నిలిపి వేశారు. అప్పటి నుంచి ఆ పరికరాలు మూలకు చేరాయి.
సుమారు మూడేళ్ల పాటు వినియోగించక పోవడంతో దుమ్ము పట్టిన మిషిన్లను సరి చేశారు. ఉపయోగించని కారణంగా పలు చోట్ల బయోమెట్రిక్ యంత్రాలు పని చేయడం లేదంటూ పలువురు వార్డెన్లు ఫిర్యాదులు చేయడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరికొన్ని చోట్ల సాంకేతిక సమస్యలు ఉన్నట్లు తెలుస్తున్నది. దీనిపై జిల్లా సంక్షేమ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.
నిజామాబాద్ జిల్లాల్లో గ్రామీణ నేపథ్యం, ఆర్థిక ఇబ్బందులున్న కుటుంబాలు అధికంగా ఉన్నాయి. ముఖ్యంగా ఎస్సీల్లోని విద్యార్థులు ఉన్నత చదువులు చదివేందుకు ఆర్థిక సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ప్రభుత్వ వసతి గృహాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన వేలాది మందికి సర్కారు హాస్టళ్లు అండగా నిలుస్తున్నాయి.