ఇందూరు, జూన్ 23 : వారం రోజుల వ్యవధిలో విద్యుత్ సంబంధిత పనులన్నీ పూర్తి కావాలని కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. నిర్ణీత గడువు ముగిసిన తరువాత ఏ ఒక్క పని పెండింగ్లో ఉండకూడదని సూచించారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమంలో విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన పనుల ప్రగతిపై కలెక్టర్ గురువారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులతో సమీక్షించారు. వంగిన విద్యుత్ స్తంభాలను సరిచేయడంతోపాటు శిథిలావస్థకు చేరిన వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాలని, ఎక్కడ కూడా వేలాడుతున్న విద్యుత్ తీగలు ఉండకూడదన్నారు.
జిల్లాలో విద్యుత్ వసతి లేని 279 వైకుంఠధామాలకు సంబంధించి డీడీలు చెల్లించిన 135 వైకుంఠధామాలకు తక్షణమే కనెక్షన్లు ఇవ్వాలని ఆదేశించారు. ఇందుకు మండల పంచాయతీ అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని, ట్రాన్స్కో ఏఈలు పూర్తి సహకారమందించాలన్నారు. జిల్లాలోని అన్ని విద్యుత్ సబ్స్టేషన్ల ఆవరణలోని ఖాళీ ప్రదేశాల్లో ఈసారి హరితహారం కింద పెద్ద ఎత్తున మొక్కలు నాటుతూ పచ్చదనాన్ని పెంపొందించాలని సూచించారు.
ప్రతి చదరపు మీటర్కు ఒక మొక్కను నాటాలన్నారు. సబ్స్టేషన్ల వారీగా పూర్తి వివరాలతో సమగ్ర ప్రణాళికను రూపొందించుకోవాలని, వచ్చే వారం ఈ అంశంపై సమీక్షిస్తానని అన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా పంచాయతీ అధికారిణి డాక్టర్ జయసుధ, ట్రాన్స్కో డీఈ (టెక్నికల్) డి.వెంకటరమణ, ఏడీఈలు తోట రాజశేఖర్, రఘు, ఆయా మండలాల ఎంపీడీవోలు, ఎంపీవోలు ట్రాన్స్కో ఏఈలు తదితరులు పాల్గొన్నారు.