కామారెడ్డి, మే 25: వానకాలం పంటల సాగుకు వ్యవసాయశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. కామారెడ్డి జిల్లాలో గతేడాది కన్నా ఈసారి సాగు విస్తీర్ణం పెరుగనున్నది. దీంతో రైతులకు అవసరమయ్యే విత్తనాలు, ఎరువుల కోసం వ్యవసాయ అధికారులు ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించారు. కామారెడ్డి జిల్లాలో గతేడాది వానకాలంలో 5.16లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటల సాగు చేశారు. ఈసారి ఉద్యాన పంటలను కలుపుకొని సాగు విస్తీర్ణం మరింత పెరిగే అవకాశం ఉన్నది. దీంతో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని 104 క్లస్టర్లలో రైతులకు పంటల సాగుపై అవగాహన కల్పిస్తున్నారు. వానకాలంలో పంటల సాగు, యాజమాన్య పద్ధతులు అవలంబించేలా ప్రోత్సాహం కల్పిస్తున్నారు.
కామారెడ్డి జిల్లాలో గతేడాది వానకాలంలో 5,16,066 ఎకరాల్లో పంటలు సాగు చేశారు. ఈసారి వానకాలంలో 5,36,941 ఎకరాల్లో పంటల సాగుకు అవకాశం ఉన్నదని జిల్లా వ్యవసాయశాఖ అంచనా వేసింది. జిల్లాలో సాగునీటి వనరులు ముఖ్యంగా నిజాంసాగర్, పోచారం ప్రాజెక్టులతోపాటు చిన్నతరహా ప్రాజెక్టులు, చెరువులు, బోరుబావుల కింద వరి సాగు చేయనున్నారు. 2,48,150 ఎకరాల్లో వరి సాగుతోపాటు మరో 7,104 ఎకరాల్లో వరి మొలకెత్తే వెరైటీని సాగు చేస్తారని వ్యవసాయశాఖ అంచనా వేసింది. వీటిలో 1,68,742ఎకరాల్లో సన్న రకం వరి, 79,408 ఎకరాల్లో దొడ్డు రకం వడ్లను సాగు చేసే పరిస్థితి ఉన్నది. గత వానకాలంలో 2,18,300 ఎకరాల్లో వరి సాగు చేస్తారని అంచనా వేయగా, 2,78,877 ఎకరాల్లో వరి పంట సాగైంది.
వానకాలం పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ ఆదేశించారు. దీంతో జిల్లా పరిధిలోని 104 క్లస్టర్లలో రైతు వేదికలు కేంద్రంగా గ్రామాల్లో ఉన్న రైతులతో వానకాలం పంటల సాగుపై సమావేశం నిర్వహిస్తున్నారు. రైతులు పంట దిగుబడులు సాధించే లక్ష్యంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. పంటల మార్పిడికి రైతులను ప్రోత్సహిస్తున్నారు. తక్కువ పెట్టుబడులతో అధిక లాభాలు సాధించేలా సలహాలు, సూచనలు అందిస్తున్నారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పిస్తుండడంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం ఇతర పంటల సాగును ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో సాగుకు పెరిగే అవకాశం కనిపిస్తున్నది.
వానకాలం పంటల సాగు ప్రణాళికను కామారెడ్డి జిల్లా వ్యవసాయ శాఖ సిద్ధం చేసింది. రైతులకు ఇబ్బందిలేకుండా ఏర్పాట్లలో నిమగ్నమైంది. వానకాలంలో ఏ పంటలు ఎన్ని ఎకరాల్లో సాగవుతాయో అంచనా వేసింది. గతేడాది జిల్లాలో 5.16లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగుకాగా ఈ ఏడాది 5.36లక్షల ఎకరాలకు పెరుగవచ్చని భావిస్తున్నది. ప్రధానంగా వరి 2.50లక్షల ఎకరాల్లో సాగయ్యే అవకాశం ఉన్నది. ఈ నేపథ్యంలో మక్కజొన్న, జొన్న, కంది, మినుము, పత్తి, సోయాబీన్ తదితర విత్తనాలతోపాటు ఎరువులను అందుబాటులో ఉంచేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
వానకాలం పంటల సాగుపై క్లస్టర్లు, గ్రామాల వారీగా రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. అధిక దిగుబడులు సాధించేలా రైతు వేదికల్లో సమావేశాలు నిర్వహిస్తున్నాం. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేసేలా ప్రోత్సహిస్తున్నాం. జిల్లాకు సరిపడా విత్తనాలు, ఎరువులు సకాలంలో వచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం. మరోవారం రోజుల్లో ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉండే అవకాశం ఉన్నది. వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు, సూచనలతో రైతులు పంటలను సాగు చేసుకోవాలి.
– భాగ్యలక్ష్మి, జిల్లా వ్యవసాయ అధికారిణి, కామారెడ్డి జిల్లా
వానకాలం పంటల సాగు నేపథ్యంలో కామారెడ్డి జిల్లాకు అవసరమయ్యే విత్తనాలు, ఎరువులను వ్యవసాయశాఖ సిద్ధం చేస్తున్నది. విత్తనాలను జిల్లా పరిధిలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, రైతు ఆగ్రో సేవా కేంద్రాలను కలుపుకొని 401 విత్తన లైసెన్స్ కలిగిన డీలర్లు, ఇద్దరు సెంట్రలైజ్డ్ డీలర్ల ద్వారా విత్తనాల సరఫరాకు చర్యలు చేపడుతున్నారు.
60,313 క్వింటాళ్ల వరి విత్తనాలు,
18,083 క్వింటాళ్ల సోయాబీన్ విత్తనాలు,
4,667 క్వింటాళ్ల మక్కజొన్న విత్తనాలు,
70,254 క్వింటాళ్ల పత్తి విత్తనాలు,
1,054 క్వింటాళ్ల కంది విత్తనాలు జిల్లాకు అవసరం ఉన్నట్లు వ్యవసాయ శాఖ గుర్తించింది.
యూరియా ఎరువు 67,044 మెట్రిక్ టన్నులగాను 8,122 మెట్రిక్ టన్నులు, డీఏపీ 8,716 మెట్రిక్ టన్నులకు గాను అందుబాటులో 1,767 మెట్రిక్ టన్నులు, మమ్యూరెట్ ఆప్ పోటాష్ (ఎంవోపీ) ఎరువు 6,537 మెట్రిక్ టన్నులగాను 260 మెట్రిక్ టన్నుల, కాంప్లెక్స్ ఎరువు 26,371 మెట్రిక్ టన్నులకు గాను 4,969 మెట్రిక్ టన్నుల ఎరువులు సిద్ధంగా ఉన్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు వెల్లడించారు.
మక్కజొన్న 86,205ఎకరాలు,
జొన్నలు 300 ఎకరాలు
కందులు 22,151 ఎకరాలు,
మినుములు 10,500 ఎకరాలు,
పత్తి 73,545 ఎకరాలు,
బబ్బెర్లు 108 ఎకరాలు,
సోయాబీన్ 72,878 ఎకరాలు,
చెరుకు 4,100 ఎకరాలు,
ఇతర పంటలు 1000 ఎకరాలు
మక్కజొన్న 92,716
జొన్నలు 54 ఎకరాలు,
కందులు 18,537 ఎకరాలు,
పెసర్లు10,810 ఎకరాలు,
మినుములు 10,345 ఎకరాలు,
బబ్బెర్లు 108 ఎకరాలు,
పత్తి 27,591 ఎకరాలు,
సోయాబీన్ 71,130 ఎకరాలు,
చెరుకు 5,629 ఎకరాలు