ఎడపల్లి (శక్కర్నగర్), మే11 : రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని యువత ప్రభుత్వ ఉద్యోగాలను సాధించాలని రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ కమిషనర్ యోగితారాణా అన్నారు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జాన్కంపేట్ శివారులో ఏర్పాటుచేసిన డీటీసీలో ఎస్సీ సంక్షేమశాఖ, పోలీస్శాఖ ఆధ్వర్యంలో ఎస్సై, పోలీస్ కానిస్టేబుళ్ల పోటీపరీక్షలకు సిద్ధమవుతున్న ఉద్యోగార్థులకు అందజేస్తున్న ఉచిత శిక్షణ శిబిరాన్ని ఆమె బుధవారం సాయంత్రం పరిశీలించారు.
ఈ సందర్భంగా ఉద్యోగార్థులకు పలు సూచనలు చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని 15 ప్రాంతాల్లో ఎస్సీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో షెడ్యూల్డ్ కులాల అభ్యర్థులకు శిక్షణ అందిస్తున్నామని చెప్పారు. ఒక్కో అభ్యర్థికి రూ.1500 విలువ చేసే స్టడీ మెటీరియల్ను అందజేయడంతోపాటు భోజనవసతి, ఇతర సదుపాయాలను కల్పిస్తున్నామని చెప్పారు.
సమయాన్ని వృథాచేయకుండా పట్టుదలతో చదవాలని సూచించారు. కలెక్టర్ నారాయణరెడ్డి మాట్లాడుతూ.. మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సహకారంతో హైదరాబాద్లోని కోచింగ్ సెంటర్లకు దీటుగా నిష్ణాతులైన అధ్యాపకులతో తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. సీపీ నాగరాజు మాట్లాడుతూ.. ఉద్యోగార్థులకు జీవితంలో స్థిరపడేందుకు ఇది మంచి అవకాశమని, సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. శిక్షణ పొందుతున్న వారికి తమశాఖ తరఫున ట్రాక్సూట్, టీషర్ట్లను అందజేస్తామని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారిణి శశికళ, పోలీస్ ట్రైనింగ్ కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ శ్రావణ్ కుమార్, అధికారులు పాల్గొన్నారు.
ఖలీల్వాడి, మే 11 : సాంఘిక సంక్షేమ వసతిగృహాల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు అధికారులు కృషిచేయాలని రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ కమిషనర్ యోగితారాణా అన్నారు. ప్రగతిభవన్లో కలెక్టర్ నారాయణరెడ్డితో కలిసి ప్రభుత్వ షెడ్యూల్డ్ కులాల వసతిగృహాల సంక్షేమాధికారులతో ఆమె బుధవారం సమావేశం నిర్వహించి మాట్లాడారు. కొవిడ్ నేపథ్యంలో గత రెండేండ్ల నుంచి హాస్టళ్లల్లో ఆశించిన స్థాయిలో విద్యార్థులు చేరలేకపోయారన్నారు. ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో విద్యార్థుల ప్రవేశాలపై ప్రత్యేకదృష్టి సారించాలని సూచించారు.
హాస్టళ్లల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం పెద్దఎత్తున నిధులు ఖర్చు చేస్తున్నదని చెప్పారు. బాత్రూములు, సింటెక్స్ వాటర్ట్యాంకులు, మెష్ డోర్లు, డ్రైనేజీ వ్యవస్థను చక్కదిద్దడంతో పాటు కారిడార్లో కూడా సీలింగ్ ఫ్యాన్లు, ట్యూబ్లైట్లను ఏర్పాటు చేయనున్నామని వివరించారు. హాస్టళ్లలో కల్పిస్తున్న వసతులపై అవగాహన కల్పించి పేద పిల్లలు వసతి గృహాల్లో చేరేలా చూడాలన్నారు.
బయోమెట్రిక్ హాజరు, పరీక్షల్లో విద్యార్థులు సాధించిన మార్కుల నిర్వహణ పరమైన ఖర్చులు, బిల్లులను ఈ-పోర్టల్ ద్వారానే కొనసాగించాలని ఆదేశించారు. విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించేందుకు ఉపకారవేతనం కోసం చేసుకున్న దరఖాస్తులు పెండింగ్లో ఉండకుండా చూడాలన్నారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, జిల్లా సాంఘిక సంక్షేమాభివృద్ధి అధికారిణి శశికళ, ఎస్సీ వసతి గృహాల సంక్షేమాధికారులు పాల్గొన్నారు.