నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ మాటల్లోని డొల్లతనం మరోసారి బయట పడింది. ఆయన చెప్పేవన్నీ అబద్ధ్ధాలేనని తేలిపోయింది. చెక్డ్యామ్ల నిర్మాణానికి కేంద్రం నిధులు ఇచ్చిందన్న ధర్మపురి వ్యాఖ్యల్లో నిజం లేదని వెల్లడైంది. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు నాబార్డు రుణాలతోనే నిజామాబాద్ జిల్లాలో నిర్మాణాలు కొనసాగుతున్నాయని జలవనరుల శాఖ తేల్చి చెప్పింది. చెక్డ్యామ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని జలవనరుల శాఖ సీఈ మధుసూదన్రావు వెల్లడించారు. మూడేండ్లలో ఇది చేశామని చెప్పుకోవడానికి ఏమీ లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వంపై తప్పుడు కూతలు కూయడం అర్వింద్కు అలవాటుగా మారింది. బాండ్ పేపర్ మీద రాసిచ్చిన హామీని సైతం నిలబెట్టుకోలేని ఎంపీపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పసలేని ఆరోపణలతో మరోమారు మోసగించేందుకు యత్నిస్తున్నారని మండిపడుతున్నారు.
నిజామాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): నిజామాబాద్ జిల్లాలో నిర్మించిన చెక్డ్యామ్లకు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు మంజూరయ్యాయని చెప్పిన పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అర్వింద్ మాటలు నిజం కాదని తేటతెల్లమైంది. జల వనరుల శాఖ చీఫ్ ఇంజినీర్ అధికారికంగా విడుదల చేసిన ప్రకటనలో ఈ వివరాలు స్పష్టంగా ఉన్నాయి. వేల్పూర్ ఎక్స్రోడ్డు వద్ద రైతుల పేరిట ఇటీవల నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో నిజామాబాద్ ఎంపీ నోటికొచ్చినట్లు మాట్లాడారు. కేంద్ర సర్కారు నుంచి నయాపైసా వాటా లేకపోయినప్పటికీ ప్రజల్లోకి అవాస్తవాలను తీసుకుపోయేందుకు ప్రయత్నించారు.
ఈ విషయంపై స్థానిక శాసనసభ్యుడు, రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ఎంపీ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. కేంద్రం నుంచి రూపాయి కూడా రాలేదని ఖరాకండీగా చెప్పారు. ఇందుకు బదులుగా పాత పల్లవినే ఎత్తుకున్న ఎంపీ అర్వింద్.. మరో వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసి ప్రజలను అయోమయానికి గురిచేసే ప్రయత్నం చేశారు. దీంతో జల వనరుల శాఖ ఉన్నతాధికారులు ఈ వ్యవహారంపై స్పష్టతను ఇచ్చారు. చెక్డ్యామ్లకు కేంద్రం నుంచి నయాపైసా విడుదల కాలేదని తేలిపోవడంతో అర్వింద్ డొల్లతనం మరోమారు ప్రజల ముందు బయటపడింది.
భూగర్భ జల వనరులను పెంపొందించడంతోపాటు సాగు భూములకు నీటి వసతిని కల్పించే ఉద్దేశంతో వాగులపై రాష్ట్ర ప్రభుత్వం చెక్డ్యామ్లను నిర్మిస్తున్నది. రైతు ప్రయోజనాల దృష్ట్యా ప్రతిష్టాత్మకంగా ఆనకట్టల నిర్మాణాన్ని ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం నుంచే చేపడుతున్నది. కేంద్ర సర్కారుపై ఆధారపడకుండా సొంతంగా మొత్తం నిధులను వెచ్చిస్తోంది. 2014 తర్వాత నిజామాబాద్ జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో 68 చెక్ డ్యామ్ల నిర్మాణానికి పరిపాలనా అనుమతులు మంజూరయ్యాయి.
ఇందుకోసం మొత్తం రూ.370.90 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు వివిధ ఉత్తర్వులు సైతం జారీ అయ్యాయి. ఈ పనుల్లో జీవో నంబర్ 8 ద్వారా మంజూరైన 30 చెక్డ్యామ్ల పనుల్లో 24 చెక్డ్యామ్ల నిర్మాణానికి నాబార్డు నుంచి రాష్ట్ర ప్రభుత్వం రూ.116.84 కోట్ల నిధులను రుణంగా తీసుకున్నది. మిగిలిన 44 చెక్డ్యామ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా రూ.251.06కోట్లు మంజూరు చేసింది. ఇందులో 14 పనులు పూర్తిచేయగా, మిగితావి వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయి. గత సెప్టెంబర్లో వచ్చిన గులాబ్ తుఫాన్ ప్రభావం, ఈ మధ్య జూలైలో కురిసిన భారీ వర్షాల కారణంగా కొన్ని చెక్డ్యామ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. వీటన్నింటినీ యథాస్థితికి తీసుకురావడానికి ఇరిగేషన్ శాఖ మరమ్మతులు చేపట్టింది.
వాస్తవాలు ఈ విధంగా ఉంటే నిజామాబాద్ లోక్సభ సభ్యుడు ధర్మపురి అర్వింద్ మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తుండడంపై ప్రజలు మండిపడుతున్నారు. నోరు తెరిస్తే అబద్ధాలతో పూట గడపడం తప్ప జిల్లా అభివృద్ధికి ఎంపీగా చేసిందేమిటని ప్రశ్నిస్తున్నారు. కేంద్రం నుంచి చెప్పుకోదగ్గ ఒక్కపని కూడా చేయని అర్వింద్కు.. జిల్లాలో పర్యటించే నైతిక అర్హత లేదంటూ విమర్శిస్తున్నారు.
చెక్డ్యామ్ల నిర్మాణం విషయంలోనూ ప్రజలను గందరగోళానికి గురిచేయడంతోపాటు తప్పుడు సమాచారంతో అందరినీ అయోమయానికి గురిచేయడం సరికాదంటూ హితవు పలుకుతున్నారు. నాబార్డు నుంచి తీసుకున్న రుణాన్ని కేంద్ర నిధులుగా పేర్కొనడం సబబు కాదని జిల్లా వాసులు అంటున్నారు. ఎంపీ హోదాలో ఉన్న అర్వింద్.. ఇకనైనా బుద్ధిగా మసులుకోవాలని సూచిస్తున్నారు.
రాష్ట్రం ఏర్పడిన నాటినుంచి ఇప్పటివరకు నిజామాబాద్ జిల్లాలోని 5 నియోజకవర్గాల పరిధిలో 68 చెక్ డ్యామ్ల నిర్మాణానికి ప్రభు త్వం పరిపాలనా అనుమతు లు మంజూరు చేసింది. ఇందుకోసం రూ.370.90 కోట్ల నిధులను విడుదలకు ఉత్తర్వులు వచ్చా యి. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ నిధులు రూ. 251.06 కోట్లు. మిగిలిన రూ.116.84కోట్లు నాబార్డు నుంచి రుణంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది. ఇందులో నేరుగా కేంద్ర సర్కారు నుంచి వచ్చిన నిధులు లేవు.
– మధుసూదన్రావు, సీఈ, జలవనరుల శాఖ