ఇందూరు, ఆగస్టు 18 : సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ పరాక్రమానికి ప్రతీక అని వక్తలు పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని న్యూ అంబేద్కర్ భవన్లో బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో గురువారం సర్వాయి పాపన్నగౌడ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. అంతకుముందు.. వినాయక్నగర్లో ఏర్పాటు చేసిన పాపన్నగౌడ్ విగ్రహాన్ని జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు, కలెక్టర్ నారాయణరెడ్డి, ఎమ్మెల్సీ వీజీ గౌడ్, మేయర్ దండూ నీతూకిరణ్ ఆవిష్కరించారు.
జడ్పీ చైర్మన్ విఠల్రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని కులవృత్తులు, చేతివృత్తుల వారిని సీఎం కేసీఆర్ అన్నివిధాలా ఆదుకునేందుకు కృషి చేస్తున్నారని అన్నారు. ఎమ్మెల్సీ వీజీగౌడ్ మాట్లాడుతూ నాటి సమాజంలో దౌర్జన్యాలు, అణిచివేతకు వ్యతిరేకంగా సమరశంఖం పూరించిన ధీశాలి సర్వాయి పాపన్న అని కొనియాడారు. అనంతరం విగ్రహదాత ఎస్సెస్సార్ విద్యా సంస్థల చైర్మన్ మారయ్యగౌడ్ను గౌడ సంఘం ఆధ్వర్యంలో సన్మానించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, ఐడీసీఎంఎస్ చైర్మన్ మోహన్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి, విద్యావేత్తలు, బీసీ, గౌడ సంఘాల ప్రతినిధులు, గీత వృత్తిదారులు పాల్గొన్నారు.
విద్యానగర్,ఆగస్టు 18: కామారెడ్డి కలెక్టరేట్లో అధికారికంగా నిర్వహించిన కార్యక్రమంలో పాపన్నగౌడ్ చిత్రపటానికి కలెక్టర్ జితేశ్పాటిల్, జుక్కల్ ఎమ్మెల్యే షిండే పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గౌడ సంఘం ప్రతినిధులు లింగాగౌడ్, సంపత్ గౌడ్, నాగరాజు గౌడ్, గోపీగౌడ్ తదితరులు పాల్గొన్నారు.