శక్కర్నగర్/ ఖలీల్వాడి, ఆగస్టు 14: ఆర్టీసీ ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు చేపడుతున్నామని సంస్థ ఎండీ సజ్జనార్ అన్నారు.ఆదివారం ఆయన నిజామాబాద్, బోధన్ ఆర్టీసీ డిపోలతోపాటు బస్టాండ్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డిపోల్లోని పలు విభాగాలు, రికార్డులను పరిశీలించారు. డిపోలో కార్మికులు, కండక్టర్లతో మాట్లాడారు. వారు అందిస్తున్న సేవలను అభినందించారు. వారికి రావాల్సిన బకాయిలు, డీఏలను చెల్లించేందుకు హామీ ఇచ్చారు.
ఇప్పటి వరకు ఆర్టీసీ ద్వారా పలు రకాల సేవలు అందిస్తున్నామని, ప్రయాణికులు సైతం వాటిని వినియోగించుకుంటున్నారని తెలిపారు. రాఖీ పౌర్ణిమ సందర్భంగా ఆర్టీసీ బస్సుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 45 లక్షల మంది ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకున్నారని చెప్పారు. ఆర్టీసీ ప్రయాణికులకు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తుందన్నారు. రాబోయే రోజుల్లో నూతనంగా బస్సులు కొనుగోలు చేసి డిపోల వారీగా అందజేస్తామని తెలిపారు.
బస్సుల్లో నగదు రహిత సేవలు అందించేందుకు హైదరాబాద్లో పైలట్గా ప్రారంభించామన్నారు. బోధన్ డిపో రూ.23లక్షల ఆదాయాన్ని సాధించిన సందర్భంగా ఆయన అభినందించారు. కండక్టర్ విఠల్ రెడ్డిని అభినందించడంతో పాటు, నగదు పారితోషికం అందచేశారు. అనంతరం బోధన్లోని బస్టాండ్, నూతనంగా నిర్మించిన ప్లాట్ఫారాలను పరిశీలించారు. డిపో అభివృద్ధి, ప్రయాణికులకు అందించే సౌకర్యాలు, సేవలపై డీఎం టీఎన్ స్వామికి ఎండీ పలు సూచనలు చేశారు.
ఆయన వెంట డిపో మేనేజర్ టీఎన్ స్వామి, విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్, కరీంనగర్ జోన్ ఎం. రవీందర్, బోధన్ ఏసీపీ రామారావుతో పాటు ఆర్టీసీ అధికారులు, కార్మికులు ఉన్నారు. నిజామాబాద్ డిపో -1కు వెళ్లి పరిశీలించారు. ఆర్టీసీ సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకుని ఆర్ఎంతో సమావేశమై మాట్లాడారు. సమావేశంలో ఆర్టీసీ ఆర్ఎం ఉషాదేవి, డిప్యూటీ ఆర్ఎం శంకర్, కృష్ణారెడ్డి, వెంకటేశం పాల్గొన్నారు.