బాన్సువాడ టౌన్, ఆగస్టు 14: స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఆదివారం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. నిజామాబాద్, కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడలో మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా నిర్వహించిన జానపద కళాకారుల ప్రదర్శనలు అలరించాయి. హాజరైన ప్రజాప్రతినిధులు ఈ సందర్భంగా జానపద కళాకారులను సన్మానించారు.
బాన్సువాడ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాలులో నిర్వహించిన కార్యక్రమానికి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. నేటి తరానికి స్వాతంత్య్రం, జాతీయ జెండా ప్రాముఖ్యత తెలియదన్నారు. ఎందరో మహనీయుల ప్రాణ త్యాగాల ఫలితమే ఈ రోజు మనం అనుభవిస్తున్న స్వాతంత్య్రం అని పేర్కొన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం 140 కోట్ల మంది సంతోషంగా జరుపుకునే పండుగ అని అన్నారు. నిరుపేదలకు అందే ఉచిత ప్రభుత్వ పథకాలు వద్దనడం దుర్మార్గమని అన్నారు.
కేవలం కొద్దిమంది కోసం ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరించడం అన్యాయమన్నారు. దేశ స్వాతంత్య్రం ఆదాని, అంబానీల కోసం కాదని దేశంలోని ప్రతి పౌరుడి కోసమని అన్నా రు. దేశంలో, సమాజంలో లోపాలు ఉంటే సరిచేసుకోవాలని, అప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. కొంత మంది పదవుల కోసం రాజకీయాలు కావాలని, అందుకోసం లేని సమస్యలను సృష్టిస్తున్నారని, అది మంచి పద్ధతి కాదని సూచించారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న కళాకారులకు ప్రశంసా పత్రాలను అందజేశారు.
ఆక్స్ఫర్డ్ పాఠశాల, ప్రభుత్వ నర్సింగ్ కళాశాల విద్యార్థినులతోపాటు వివిధ మం డలాల నుంచి వచ్చిన జానపద కళాకారులు ప్రదర్శనలు ఇచ్చారు. బాన్సువాడ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ అంజిరెడ్డి, ఆర్డీవో రాజాగౌడ్, డీఎస్పీ జైపాల్ రెడ్డి, తహసీల్దార్ గంగాధర్, విండో చైర్మన్ ఏర్వాల కృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ ఎజాస్, జిల్లా కో-ఆప్షన్ సభ్యుడు మాజిద్, మున్సిపల్ కమిషనర్ రమేశ్, వైస్ చైర్మన్ షేక్ జుబేర్ తదితరులు పాల్గొన్నారు.