బాన్సువాడ రూరల్, ఆగస్టు 14: గిరిజనులు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించే తీజ్ పండుగ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక అని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదివారం రాంపూర్తండా, పోచారం తండాల్లో తీజ్ ముగింపు వేడుకల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డితోకలిసి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. గోధుమ మొలకలతో ఉన్న బుట్టలను పెళ్లికాని ఆడపడుచులు నెత్తిన ఎత్తి శోభాయాత్రను స్పీకర్ ప్రారంభించారు.
మహిళలు, చిన్న పిల్లలతో కలిసి స్పీకర్ పోచారం నృత్యం చేస్తూ అలరించారు. గ్రామంలో నిర్వహించిన శోభాయాత్రలో డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి సైతం మహిళలు, యువతులతో కలిసి నృత్యం చేశారు. అనంతరం యువతులు ఊరేగింపుగా వెళ్లి గ్రామ శివారులోని కాలువలో గోధుమ మొలకల బుట్టలను నిమజ్జనం చేశారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాలను గుర్తు చేసేలా గోధుమ బుట్టల్లో ఏర్పాటు చేసిన మూడు రంగుల బెలూన్లు ఆకర్షణగా నిలిచాయి.
రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ దుద్దాల అంజిరెడ్డి, బాన్సువాడ సొసైటీ అధ్యక్షుడు ఎర్వాల కృష్ణారెడ్డి, తండా నాయకుడు గోప్యానాయక్, కారోబార్ ప్రకాశ్, తండా పెద్దలు, వైస్ ఎంపీపీ హరిసింగ్, జడ్పీటీసీ పద్మ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మోహన్నాయక్, బంజారా సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు నెనావత్ బద్యానాయక్, నరేశ్ రాథోడ్, మండల నాయకులు దొడ్ల వెంకట్రాంరెడ్డి, మహ్మద్ ఎజాస్, గోపాల్రెడ్డి, బాబా, తండా వాసులు రవిచవాన్, బల్రాం నాయక్, శ్రీనివాస్, కిషన్, సర్వాన్, అంబర్సింగ్, శ్రీనివాస్, అంబర్సింగ్, రామురాథోడ్, గోవింద్, మోహన్, మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కేంద్రంలో బంజారాల ఆధ్వర్యంలో తీజ్ ఉత్సవాలు నిర్వహించారు. పట్టణంలో బంజారాలు ర్యాలీ నిర్వహించారు. శోభాయాత్రలో యువతీయువకులు నృత్యం చేశారు.
బీర్కూర్, ఆగస్టు 14: స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా తిరంగా సైకిల్ యాత్ర చేపట్టిన హైదరాబాద్ సైకిల్ గ్రూప్ సభ్యులను శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అభినందించారు. హైదరాబాద్ సైకిల్ గ్రూప్ సభ్యులు 350 మంది స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా కుత్బుల్లాపూర్ నుంచి 100 కిలో మీటర్ల సైకిల్ యాత్రను హైదరాబాద్-నాగాపూర్ జాతీయ రహదారిపై చేపట్టారు. స్పీకర్ హైదరాబాద్ నుంచి బాన్సువాడకు వస్తుండగా మార్గమధ్యంలో మెదక్ జిల్లా చేగుంట సమీపంలో సైకిల్ యాత్రను చూసి ఆగి వారిని కలిసి మాట్లాడారు.