కామారెడ్డి, ఆగస్టు 14: పరాయి పాలన నుంచి దేశానికి స్వేచ్ఛను ప్రసాదించేందుకు ప్రాణాలర్పించిన మహనీయులు ఎందరో.. నిజాం నిరంకుశత్వానికి ఎదురొడ్డి నిలిచిన వీరులెందరో.. ప్రత్యేక తెలంగాణ కోసం ఆత్మబలిదానాలు చేసిన ఉద్యమకారులెందరో.. వారి పోరాటాలు, స్ఫూర్తిని స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాలు, జయంతి, వర్ధంతి సమయంలో గుర్తు చేసుకుంటాం.
కానీ సామాజిక స్పృహ ఎక్కువగా ఉన్న కామారెడ్డి పట్టణ ప్రజలు వారిని ప్రతినిత్యం స్మరించుకుంటున్నారు. ఎప్పటికీ గుర్తుంచుకునేలా వీధికో వీరుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. రోడ్లు, వాడలకు మహనీయుల పేర్లు పెట్టుకొని స్ఫూర్తి పొందుతున్నారు. జాతీయ భావం, దేశభక్తిని చాటుకుంటున్నారు.
మద్యపాన నిషేధం, సమానత్వం, పరిశుభ్రత, అక్షరాస్యత వంటి అనేక సామాజిక కార్యక్రమాలను స్వాతంత్య్రోద్యమానికి జోడించిన మహాత్ముడు గాంధీజీ. శాంతి, ప్రేమ, స్నేహం, త్యాగం లాంటి ఉన్నత విలువలను నేర్పిన మహనీయుడు ఆయన. జాతిపిత బాటలో పయనించి నిజాం సైనికుల చేతిలో ప్రాణాలు విడిచిన ఉద్యమకారుల స్మారకార్థం కామారెడ్డి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్కు గాంధీ గంజ్గా నామకరణం చేశారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఘనమైన చరిత్ర ఉన్న గాంధీగంజ్లో ప్రస్తుతం రూ.7 కోట్ల 20 లక్షల నిధులతో సమీకృత మార్కెట్ భవనాన్ని నిర్మిస్తున్నారు. గంజ్లో ఉన్న పాత విగ్రహం స్థానంలో మార్కెట్ కమిటీ కార్యాలయం ఎదుట మహాత్ముడి భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అలాగే పట్టణంలోని ఓ కాలనీకి కూడా గాంధీనగర్ పేరు పెట్టుకొని నిత్యం స్మరిస్తున్నారు.
కామారెడ్డిలోని పలు కాలనీలకు జాతీయ నాయకులు, సమాజాన్ని జాగృతం చేసిన సంఘ సంస్కర్తలు, ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారుల పేర్లను పెట్టడం ఆనవాయితీగా మారింది. పలు కాలనీలు, చౌరస్తాలు, రోడ్లకు స్వాతంత్య్ర పోరాట యెధులు, దేశాన్ని ఏలిన ప్రధానులు, ఉద్యమకారుల పేర్లను పెట్టుకున్నారు.
దివంగత ప్రధాని పేరిట ఇందిరానగర్, రైల్వేస్టేషన్ ఎదుట ఉన్న చౌరస్తాకు ఇందిరా చౌక్, భారతదేశ సంసంస్కృతిని ప్రపంచానికి చాటిన స్వామి వివేకానంద పేరిట వివేకానందా నగర్, తాజాగా ప్రత్యేక తెలంగాణ కోసం తన జీవితాన్నే అంకితం చేసిన ప్రొఫెసర్ పేరిట జయశంకర్ కాలనీని ఏర్పాటు చేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన సమయంలోనే సర్కారు దవాఖాన వెనుక వీధికి భారత్రోడ్ అని పేరు పెట్టారు.
రైల్వే బిడ్జికి పక్కన ఉన్న ఎస్సీ వాడకు అంబేద్కర్నగర్గా నామకరణం చేశారు. సుభాష్రోడ్, భారత్రోడ్ వంటివి ఫుట్పాత్ వ్యాపారాలు మొదలుకొని పెద్దపెద్ద వాణిజ్య సంస్థలకు ప్రసిద్ధి. స్టేషన్ రోడ్డు నుంచి మధ్యన ఉన్న గల్లీరోడ్డును భగత్సింగ్ నగర్గా పిలుస్తారు. తెలంగాణ రైతాంగ పోరాట యోధుడు పణిహారం రంగాచారి పేరిటా ఓ కాలనీ ఉంది.
కామారెడ్డి పట్టణానికి ఉత్తర తెలంగాణ ప్రాంతంలోనే వర్తక, వాణిజ్య కేంద్రంగా గుర్తింపు ఉంది. ఆయా ప్రాంతాలకు ప్రముఖుల పేర్లు పెట్టుకొని స్ఫూర్తి పొందుతున్నారు. సుభాష్ చంద్రబోస్ పేరిట సుభాష్ రోడ్, గంజ్ రోడ్డుకు జయప్రకాశ్ నాయణ్ (జేపీఎన్) రోడ్, సుభాష్రోడ్-సిరిసిల్ల రోడ్డును కలుపుతూ ఉండే రహదారికి తిలక్ రోడ్, ఛత్రపతి పేరిట శివాజీ రోడ్, పాంచ్ చౌరస్తాలోని ప్రధాన రోడ్డుకు సరోజినీ రోడ్గా పిలుస్తున్నారు.
జీవదాన్ పాఠశాల వద్ద ఉన్న చౌరస్తాకు ఉక్కుమనిషి పేరిట సర్ధార్ పటేల్ చౌక్ను ఏర్పాటు చేశారు. పట్టణ ప్రజలకు స్ఫూర్తి కలిగేలా మున్సిపల్ కార్యాలయం ఎదుట జ్యోతిబా ఫూలే, సావిత్రీబాయి ఫూలే, బీఆర్ అంబేద్కర్, పణిహారం రంగాచారి విగ్రహాలను ఏర్పాటు చేశారు.
తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఆత్మబలిదానం చేసుకున్న కానిస్టేబుల్ కిష్టయ్య విగ్రహాన్ని నిజాంసాగర్ చౌరస్తాలో, ప్రభుత్వ పాఠశాల ఎదుట తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం, అశోక్నగర్ కాలనీలో బీఆర్ అంబేద్కర్, ఆశోక్నగర్ పెట్రోల్ బంక్ పక్కన శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణ అస్తిత్వానికి ప్రతికగా నిలిచే తెలంగాణ తల్లి విగ్రహాన్ని నిజాంసాగర్ చౌరస్తాలో ప్రతిష్ఠించారు.