ఇందూరు/ఖలీల్వాడి, ఆగస్టు 13: ఈనెల 22 వరకు నిర్వహించే స్వతంత్ర భారత వజ్రోత్సవాలను విజయవంతం చేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి కోరారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలో శనివారం చేపట్టిన ఫ్రీడమ్ ర్యాలీ అట్టహాసంగా సాగింది. మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై ఫ్రీడమ్ ర్యాలీని ప్రారంభించారు. అందరితో కలిసి ప్రదర్శనలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బ్రిటిష్ వలస పాలకుల చేతిలో బందీ అయిన దేశానికి స్వేచ్ఛా స్వాతంత్య్రాన్ని కల్పించేందుకు అనేక మంది సమరయోధులు ప్రాణత్యాగాలు చేశారని అన్నారు. వజ్రోత్సవాల్లో భాగంగా స్వాతంత్య్ర సమరయోధులను గుర్తు చేసుకుంటూ వారికి నివాళులర్పిస్తున్నామన్నారు. జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణలో గ్రామాలను అభివృద్ధి పథంలో నడుపుతున్నారన్నారు.
కలెక్టర్ నారాయణరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం నిర్వహిస్తున్న వజ్రోత్సవాలు ప్రతి భారతీయుడికీ పండుగ లాంటివన్నారు. ఈనెల 15న ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని, 16న ఉదయం 11.30 గంటలకు ఎక్కడివారు అక్కడ అన్ని కార్యాలయాలు, కూడళ్ల వద్ద సామూహిక జాతీయ గీతాలాపన చేయాలని సూచించారు. నెహ్రూపార్కు చౌరస్తా నుంచి ప్రారంభమైన ర్యాలీ గాంధీచౌక్, రాష్ట్రపతి రోడ్డు, బస్టాండ్ మీదుగా కలెక్టరేట్ వరకు కొనసాగింది.
75 సంవత్సరాల స్వాతంత్య్ర వేడుకలకు సంకేతంగా జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ప్రత్యేకంగా రూపొందించిన 750 మీటర్ల పొడవు ఉన్న జాతీయ జెండాను ఈ ర్యాలీలో ప్రదర్శించారు. జాతీయ జెండా గౌరవానికి భంగం వాటిల్లకుండా అధికారులు అడుగడుగునా జాగ్రత్తలు తీసుకున్నారు. కలెక్టరేట్ మైదానంలో అతిథులు ప్రసంగించిన అనంతరం మూడు రంగులతో కూడిన బెలూన్లను గాలిలోకి ఎగురవేసి భక్తి గేయాలు ఆలపించారు.
సీపీ నాగరాజు, మేయర్ నీతూకిరణ్, అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, చిత్రామిశ్రా, నుడా చైర్మన్ ప్రభాకర్రెడ్డి, జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు గడీల రాములు ర్యాలీలో భాగస్వాములయ్యారు. అదనపు డీసీపీ అరవింద్బాబు, ఆర్డీవో రవి, కలెక్టరేట్ ఏవో ప్రశాంత్, ఏసీపీ వెంకటేశ్వర్లు, జిల్లా కేంద్ర దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్, టీఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు కిషన్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, ఆయా సంఘాల బాధ్యులు, పోలీసులు, ఎన్సీసీ క్యాడెట్లు, ఎన్ఎస్ఎస్ వలంటీర్లు, 7వ పోలీసు బెటాలియన్ సిబ్బంది, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు, వైద్యులు, నర్సింగ్ స్టూడెంట్లు, క్రీడా సంఘాల బాధ్యులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ఆర్మీ అధికారులు 750 అడుగుల పొడవు కలిగిన భారీ త్రివర్ణ పతాకాన్ని పట్టుకుని దేశభక్తి, నినాదాలు, నృత్యాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు.