కామారెడ్డి రూరల్, ఆగస్టు 13 : డివైడర్ను ఢీకొని ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. దీంతో బస్సులోని 19 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలు కాగా ప్రభుత్వ దవాఖానకు తరలించి చికిత్స అందించారు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా కేంద్రం సమీపంలోని పాత కలెక్టరేట్ వద్ద శనివారం చోటుచేసుకున్నది. దేవునిపల్లి ఎస్సై ప్రసాద్, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బాన్సువాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు (టీఎస్ 16 యూసీ 4488) శనివారం మధ్యాహ్నం నిజామాబాద్ నుంచి కామారెడ్డికి బయల్దేరింది.
కామారెడ్డి జిల్లా కేంద్రం సమీపంలో ని పాత కలెక్టరేట్ వద్దకు రాగానే బస్సు డివైడర్ను ఢీకొట్టి బోల్తా పడింది. గమనించిన సమీప గోదాముల్లో పనులు చేసుకుంటున్న కూలీలు వెంటనే బస్సు వద్దకు చేరుకున్నారు. బస్సు వెనుక అద్దాలు పగులగొట్టి ప్రయాణికులను బయటికి తీశారు. బస్సులో మొత్తం 29 మంది ప్రయాణికులు, డ్రైవర్, కండక్టర్ ఉండగా.. 19 మంది గాయపడ్డారు.
వెంటనే వీరిని కామారెడ్డి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. బస్సు డ్రైవర్ బాపురావు మూడు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడని, కామారెడ్డి సమీపంలోకి రాగానే కండ్లు చీకట్లు కమ్మడంతో ప్రమాదం జరిగినట్లు కండక్టర్ తెలిపారు. ఈ సంఘటనలో కండక్టర్ బండారి రామాగౌడ్తో పాటు మరో 19 మందికి గాయపడగా వారికి చికిత్స చేసి పంపించారు. డ్రైవర్ అనారోగ్యంతో ఉండడంతో చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.