నిజామాబాద్, ఆగస్టు 13(నమస్తే తెలంగాణ ప్రతినిధి): సర్కారు బడుల్లోని విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు పెంపొందించేందుకు ప్రభుత్వం తొలిమెట్టు కార్యక్రమా న్ని అమలు చేయబోతున్నది. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల్లో మౌలిక అక్షరాస్యత, గణిత సామర్థ్యాల సాధన(ఎఫ్ఎల్ఎన్)ను పునరుద్ధరించేందుకు తొలిమెట్టు అమలుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
రెండేండ్లుగా కరోనా వైరస్ వ్యాప్తితో పూర్తి స్థాయిలో ప్రత్యక్ష తరగతులు జరగకపోవడంతో విద్యార్థులు పాఠ్యాంశాలపై పట్టు కోల్పోయినట్లు గత నవంబర్లో దేశ వ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. మాతృభాషలోని అక్షరాలను గుర్తించి స్పష్టంగా చదవడం లేదని, చదివిన విషయాన్ని అర్థం చేసుకోవడం లేదని గుర్తించారు. విద్యార్థులు కోల్పోయిన అభ్యసన సామర్థ్యాలను పెంపొందించేందుకు చేపడుతున్న తొలిమెట్టు కార్యక్రమంతో సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది.
విద్యార్థులు ధారాళంగా చదవడం నేర్చుకునేలా, మౌలిక భాషా గణిత సామర్థ్యాల పెంపునకు పూర్వ సంఖ్యా భావనలు, సంఖ్యలు, చతుర్విద ప్రక్రియలు ఆకారాలు, పరిణామాలపై అవగాహన కొలతలు, దత్తాంశ నిర్వహణ వంటివి తొలిమెట్టు కార్యక్రమం ద్వారా నేర్పుతారు. దీంతో తదుపరి తరగతుల్లో వెనుకబడకుండా మెరుగవుతుంది. ఈ కార్యక్రమం ద్వారా ఉమ్మడి జిల్లాలో సుమారు లక్ష మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనున్నది.
విద్యార్థుల్లో సామర్థ్యాలను పెంచేందుకు విద్యా శాఖ శ్రీకారం చుట్టిన తొలిమెట్టు కార్యక్రమాన్ని ఈనెల 15న ప్రారంభించనున్నారు. ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల తల్లిదండ్రులను పాఠశాలలకు ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు విద్యా శాఖ సన్నాహాలు చేస్తున్నది. సెంట్రల్ స్కేర్ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ, విద్యాశాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నది.
2022-23 విద్యా సంవత్సరంలో మొత్తం 220 రోజులు పని దినాలు ఉండగా 140 రోజులు బోధన అభ్యాసన ప్రక్రియ నిర్వహణకు ప్రణాళిక రూపొందించారు. వారానికి 6 రోజులు పని దినాలు ఉంటే 5 రోజులు బోధన అభ్యాసన ప్రక్రియ నిర్వహణ కోసం, ఒక రోజు మూల్యాంక నం, పునరభ్యాసనం కోసం కేటాయించారు.
విద్యార్థులంతా భాగస్వాములు అయ్యేలా వార్షిక, వారపు, రోజువారీ పీరియడ్ వారీగా ప్రణాళిక రూపొందించనున్నారు. తొలిమెట్టు కార్యక్రమాన్ని నిర్వహించేందుకు నిజామాబాద్ జిల్లాలో ప్రాథమిక పాఠశాలల్లో పని చేస్తున్న మూడు వేల మం ది ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లోని విద్యార్థుల సామర్థ్యాల పెంపు ఏకైక లక్ష్యంతో తొలిమెట్టు అమలవుతున్నది.
తొలి మెట్టు కార్యక్రమాన్ని అమలు చేసేందుకు ఇటీవల హైదరాబాద్లో డీఈవోలు, సెక్టోరియల్ అధికారులకు అవగాహన కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించింది. ప్రైమరీ స్కూళ్లలో ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకు విద్యార్థులకు సొంతంగా చదవడం, రాయడం నేర్పించనున్నారు.
కూడికలు, తీసివేతలు, భాగాహారాలు, గుణకారాలు, పూర్ణ సంఖ్య భావనలు, ఆకారాలు – పరిమాణాలు, కొలతలు, దత్తాంశం తదితర అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు. విద్యార్థులు 1వ తరగతిలో నిమిషానికి 20 పదాలను, 2వ తరగతిలో 25 పదాలను, 3వ తరగతిలో 30 పదాలను, 4వ తరగతిలో 40 పదాలను, 5వ తరగతిలో 50 పదాలను ధారాళంగా చదవాల్సి ఉంటుంది.
3,4,5 తరగతుల్లోని విద్యార్థులు ఇచ్చిన పేరాను, గేయాన్ని, పద్యాన్ని చదివి అర్థం చేసుకోగలగాలి. 1వ తరగతి విద్యార్థులు సరళ పదాలు, గుణిత పదాలు, 2వ తరగతి విద్యార్థులు ఒత్తుల పదాలు, 3వ తరగతి నుంచి 5వ తరగతి వరకు పిల్లలు 4 లేదా 5 పదాల్లో కనీసం 4 పదాలను తప్పుల్లేకుండా రాయాల్సి ఉంటుంది.
తొలిమెట్టు సత్ఫలితాలను సాధించేలా ప్రతి నెలా క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులను పూర్తి స్థాయిలో బాధ్యులుగా చేయనున్నారు. ప్రతి ఉపాధ్యాయుడు వార్షిక, వారాంతపు, పీరియడ్ వారీగా ప్రణాళికలు రూపొందించాల్సి ఉంటుంది. ప్రతి వారంలో ఐదు రోజులు బోధన, ఒక రోజు మూల్యాంకనం చేయాల్సి ఉంటుంది.
ప్రతి నెలా 27న పాఠశాల స్థాయిలో, 28న మండల స్థాయి, 29న జిల్లా స్థాయి, 30న రాష్ట్ర స్థాయిలో సమీక్షలు నిర్వహించి విద్యార్థుల ప్రగతిని అంచనా వేయనున్నారు. కొవిడ్ కారణంగా ప్రాథమిక స్థాయి విద్యార్థుల్లో కనీస అభ్యసన సామర్థ్యాలు పడిపోయాయి. స్కూళ్లు బంద్ ఉండడంతో ఈ పరిస్థితి దాపురించింది.
కార్పొరేట్ స్కూళ్లలో చదివే పిల్లలకు ఆన్లైన్ బోధన, ఇతరత్రా మార్గాల ద్వారా పునరుశ్చరణ జరిగింది. విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యం కోల్పోకుండా ప్రయత్నం చేశారు. ప్రైవేటు స్కూళ్ల పిల్లలతో పోలిస్తే ప్రభుత్వ బడుల్లో చదివే వారి సామర్థ్యాలు తగ్గిపోకుండా ఉండేందుకు తొలిమెట్టు ఆలోచన చేశారు.
ప్రాథమిక స్థాయి విద్యార్థులకు తొలి మెట్టు కార్యక్రమాన్ని అమలు చేయాలని విద్యా శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలను పూర్తి చేశాం. ఈనెల 15 నుంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. కరోనాతో ఆయా తరగతుల్లో అభ్యాసనల్లో విద్యార్థులు వెనుకబాటుకు గురయ్యారు. తొలి మెట్టు కార్యక్రమంతో ఆ లోపం నివారించబడుతుంది. ప్రజల్లోనూ ప్రభుత్వ విద్యా విధానంపై తప్పక నమ్మకం నిలబెడుతుంది.
– దుర్గా ప్రసాద్, డీఈవో, నిజామాబాద్