మెండోరా, ఆగస్టు 4: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ఎస్సారెస్పీలో నీటి మట్టం పెరుగుతుండడంతో గురువారం సాయంత్రం ఐదు వరద గేట్ల ద్వారా గోదావరిలోకి 20,820 క్యూసెక్కుల మిగులు జలాలను విడుదల చేస్తున్నట్లు ఏఈఈ కె. రవి తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి 34,540 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నదని పేర్కొన్నారు. ఎస్కేప్ గేట్ల నుంచి గోదావరిలోకి నాలుగు వేలు, కాకతీయ కాలువకు నాలుగు వేలు, వరదకాలువకు ఐదు వేలు, లక్ష్మీ కాలువకు 50, సరస్వతీ కాలువకు 600 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతున్నదని తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు (90.313 టీఎంసీలు) కాగా గురువారం సాయంత్రానికి 1088.30 అడుగుల (77.383 టీఎంసీలు) వద్ద ఉన్నదని పేర్కొన్నారు. ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల నుంచి ఇప్పటి వరకు 220.444 టీఎంసీల వరద వచ్చి చేరినట్లు తెలిపారు. దీంతో దిగువ గోదావరిలోకి, కాకతీయ వరద కాలువలకు 163.448 టీఎంసీల మిగులు జలాలను విడుదల చేసినట్లు ఏఈఈ వివరించారు.
నిజాంసాగర్, ఆగస్టు 4: కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టులోకి గురువారం ఎగువ ప్రాంతం నుంచి భారీగా ఇన్ఫ్లో వస్తున్నట్లు ఏఈ శివకుమార్ తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1405.00 అడుగులు (17.80 టీఎంసీలు) కాగా, గురువారం సాయంత్రం 1404.00 అడుగుల (16.35 టీఎంసీలు) వద్ద ఉన్నదని పేర్కొన్నారు. ఎగువ ప్రాంతం నుంచి 12,600 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా..11వేల క్యూసెక్కులు రెండు వరద గేట్ల ద్వారా మంజీరలోకి విడుదల చేస్తున్నట్లు తెలిపారు. మరో 1600 క్యూసెక్కులు ప్రధాన కాలువ ద్వారా వానకాలం పంటల సాగు కోసం ఆయకట్టుకు విడుదల చేస్తున్నామని వివరించారు.
నవీపేట, ఆగస్టు 4: మండలంలోని కోస్లీ గోదావరి తీరాన ఏర్పాటు చేసిన అలీసాగర్ లిప్టు ఫస్ట్ స్టేజీ వద్ద స్థానిక ఎంపీపీ సంగెం శ్రీనివాస్, ఇరిగేషన్ డిప్యూటీ ఈఈ బల్రామ్తో కలిసి నీటిని విడుదల చేశారు. వైస్ ఎంపీపీ ఇందూర్ హరీశ్, స్థానిక సర్పంచ్ నిలేశ్ కుమార్,ప్రాజెక్టు ఏఈ ప్రణయ్రెడ్డి, తాడ్బిలోలి లిప్టు చైర్మన్, రైతుబంధు సమితి జిల్లా డైరెక్టర్ మౌలానా, టీఆర్ఎస్ నాయకులు నీరడి బుచ్చన్న, శ్రీధర్బాబు, ఆయా గ్రామాలకు చెందిన రైతులు పాల్గొన్నారు.