ఖమ్మం, డిసెంబర్ 6 : ఖమ్మం నగరంలో జరిగిన అభివృద్ధిని నమూనాగా తీసుకొని నిజామాబాద్లో అమలు చే స్తామని అర్బన్ ఎమ్మె ల్యే బిగాల గణేశ్గుప్తా అన్నారు. జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, నగర మేయర్ దండు నీతూకిరణ్, అదనపు కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ చిత్రామిశ్రాతో కలిసి మంగళవారం ఖమ్మంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిగాల మాట్లాడుతూ తెలంగాణలో 40శాతం ప్రజలు పట్టణాల్లో నివసిస్తున్నారనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ హైదరాబాద్ తర్వాత వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్ తదితర కార్పొరేషన్లతోపాటు మున్సిపాలిటీల అభివృద్ధి కోసం యేటా రూ.100 కోట్ల చొప్పున రూ.300 కోట్ల నిధులు ఇచ్చారని వెల్లడించారు. ఈ నిధులతో నిజామాబాద్ నగరాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తున్నామని, మార్కెట్లు, జంక్షన్లు, రోడ్లు, తాగునీటి వసతి, పార్కులు తదితర అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు.
2015లో తాను ఖమ్మంలో 10రోజులు ఉన్నానని, ఇప్పుడు చాలా మారిందన్నారు. ఇంత తక్కువ సమయంలో హైదరాబాద్కు దీటుగా ఖమ్మం నగరాన్ని అభివృద్ధి చేసిన మంత్రి అజయ్ను అభినందిస్తున్నట్లు తెలిపారు. ఇటీవల సీఎం కేసీఆర్ నిజామాబాద్ వచ్చినప్పుడు మరో రూ.వంద కోట్లను నిజామాబాద్ అభివృద్ధికి ఇచ్చారన్నారు. ఈ నిధుల వినియోగంపై ప్రగతిభవన్లో రాష్ట్రస్థాయి అధికారులు, నిజామాబాద్ ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగంతో సమీక్ష నిర్వహించారని, ఆ సందర్భంగా సీఎం కేసీఆర్ ఖమ్మంలో జరిగిన అభివృద్ధిని చూసి రావాలని ఆదేశించారన్నారు. దీంతో అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులంతా కలిసి రెండ్రోజులపాటు ఖమ్మంలో పర్యటించామన్నారు. లకారం ట్యాంక్బండ్, సస్పెన్షన్ బ్రిడ్జి, వాకింగ్ ట్రాక్ చాలా అద్భుతంగా ఉన్నాయన్నారు. అభివృద్ధి పనులను సందర్శించామని, ఇదే మోడల్గా నిజామాబాద్లో నిర్మించేందుకు అధికారులకు పలు సూచనలు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఖమ్మం మాదిరి నిజామాబాద్ను కూడా అభివృద్ధి చేస్తామన్నారు. కలెక్టర్ సి.నారాయణరెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశాలతో రెండ్రోజులపాటు ఖమ్మంలో జరిగిన పలు అభివృద్ధి పనులను సందర్శించామన్నారు. ఖమ్మం అనుభవం ఎంతో ఉపయోగపడుతుందన్నారు.