నవీపేట, అక్టోబర్ 2: ఓ వైపు చదువు..మరోవైపు నాటు కోళ్ల వ్యాపారం చేస్తూ కుటుంబానికి అండగా ఉంటున్నాడు. తాను కుటుంబానికి భారం కా కూడదనే ఉద్దేశంతో నెల కు రూ.45 వేలు సంపాదిస్తూ తండ్రికి చేదోడువాదోడుగా ఉంటూ ఇతరులకు ఆదర్శం గా నిలుస్తున్నాడు నవీపేట మండల కేంద్రానికి చెందిన మాగిని రాజేశ్. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో రాజేశ్ ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. తండ్రి పెద్ద శ్రీనివాస్ మేస్త్రీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. రాకేశ్ తన కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉండడంతోపాటు భవిష్యత్తులో వ్యాపారంలో స్థిరపడాలని నాటుకోళ్ల వ్యాపారం ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు.
మండలంలోని ధర్మారం గ్రామంలో ఓ షెడ్డును ఏర్పాటు చేసి 600 నాటు కోళ్లు(పుంజులు) పెంచుతున్నాడు. హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి ఒకరోజు వయసు ఉన్న పిల్లలను ఒక్కోటి 45 రూపాయలకు కొనుగోలు చేసి తీసుకువచ్చాడు. షెడ్డులో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి వాటిని పెంచుతున్నాడు. వాటికి నాలుగు నెలల వయస్సు రాగానే నిజామాబాద్, నవీపేట తదితర ప్రాంతాల్లో కిలో రూ.350 చొప్పున విక్రయిస్తూ ఆదాయం పొందుతున్నాడు. గతేడాది రూ.2.50 లక్షల పెట్టుబడి పెట్టగా.. ఖర్చులు పోనూ నెలకు రూ.45 వేల ఆదాయం సంపాదిస్తున్నాడు. షెడ్డు ఆవరణలో ఖాళీ స్థలంలో కోళ్లను మేతకు వదిలి జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. తన చదువుతో పాటు తమ్ముడు చదువు ఖర్చులను సైతం తానే భరిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు.
నాటు కోళ్లకు మార్కెట్లో డిమాండ్ బాగుంది..
రుచికరమైన నాటు కోళ్లకు మార్కెట్లో భలే డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో త్వరలోనే మరో ఐదు వేల నాటు కోళ్ల పిల్లలను కొనుగోలు చేసి పెంచుతాను. ఉపాధి అవకాశాలు మెరుగు పర్చుకునేందుకు నాటు కోళ్ల వ్యాపారం కలిసి వచ్చే అంశంగా చెప్పవచ్చు. మార్కెట్లో బాయిలర్ కోళ్లకన్నా నాటు కోళ్ల మాంసం తినేందుకు చాలా మంది ఇష్టపడుతున్నారు. దీంతో నాటు కోళ్ల విక్రయాలు జోరందుకుంటున్నాయి. నాటుకోళ్ల పెంపకం కొంచెం కష్టమైనా ఆదాయం మాత్రం బాగుంది. – మాగిని రాజేశ్, విద్యార్థి