క్షేత్రస్థాయి కరోనా విధులన్నింటా ఏఎన్ఎం, ఆశ కార్యకర్తలు, అంగన్వాడీలు
జ్వర సర్వే, టీకాల పంపిణీలోనూ అలుపెరుగని సేవ
కరోనా బాధితులకు అన్నీ తామై చూసుకుంటున్న వైనం
వైద్యులతో సమానంగా పనిచేస్తున్న ఆరోగ్యసిబ్బంది
ఊరూవాడా కరోనా విలయతాండవం చేస్తున్న తరుణంలో ఆశ కార్యకర్తలు, అంగన్వాడీలు అలుపెరగని సేవలందిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ప్రాణాలు ఫణంగా పెట్టి విధులు నిర్వర్తిస్తున్న వారు వైద్యులతో సమానంగా ప్రాణదాతలుగా నిలుస్తున్నారు. మొదటిదశ కరోనా వ్యాప్తి సమయంలో ఆశ కార్యకర్తలు, అంగన్వాడీలు కంటైన్మెంట్ జోన్లలోకి వెళ్లి ధైర్యంగా ఇంటింటి సర్వే చేశారు. సెకండ్వేవ్లో చేపట్టిన జ్వర సర్వేలోనూ ఏఎన్ఎం, ఆశ కార్యకర్తలు, అంగన్వాడీలు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. బృందాలుగా ఏర్పడి ఇంటింటి సర్వే చేపడుతున్నారు. కరోనా నియంత్రణలో క్షేత్ర స్థాయిలో ముందుండి నడిచిన సిబ్బంది వీరే. కొంతమంది ఆరోగ్య సిబ్బంది కరోనా బారిన పడినా కోలుకుని ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా స్ఫూర్తిదాయక విధుల్ని నిర్వర్తిస్తున్నారు.
కంటికి కనిపించని మహమ్మారి కరోనా వైరస్ ప్రపంచమంతటా సెకండ్వేవ్ రూపంలో విజృంభిస్తోంది. అన్ని వ్యవస్థలను అతలాకుతలం చేసిన ఈ వైరస్తో రోజూ వేలాది మంది ప్రాణాలు వదులుతున్నారు. ఒకవైపు వైద్యులు తమ కుటుంబాలను వదిలి, ప్రాణాలు తెగించి ప్రజలకు ఊపిరి పోస్తూ సమస్త మానవాళికి ప్రత్యక్ష దైవాలుగా నిలుస్తున్నారు. మరోవైపు వీరికి తోడుగా ఆరోగ్య సిబ్బంది అందిస్త్తున్న సేవలు అంతా ఇంతా కాదు. చికిత్స పొందుతున్న కరోనా బాధితులకు ఏఎన్ఎంలు అన్నీ తామై అండగా నిలుస్తున్నారు. ఆశ కార్యకర్తలు, అంగన్వాడీలు సైతం క్షేత్రస్థాయిలో సర్వే చేయడం, ఇంటింటా అవగాహన కల్పించడంలో కీలకమైన భూమిక పోషిస్తున్నారు.
-నిజామాబాద్, మే 22(నమస్తే తెలంగాణ ప్రతినిధి)
ఇంటింటికీ ధైర్యంగా..
కరోనా మొదటి దశ విపత్కర సమయంలోనూ ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు, అంగన్వాడీలు ధైర్యంగా ఇంటింటికీ తిరిగి సర్వే నిర్వహించారు. కొవిడ్ సోకిన వ్యక్తుల వద్దకెళ్లి వారి బాగోగులు ఆరా తీస్తూ, ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడం వంటి సేవలందించారు. సెకండ్వేవ్లోనూ చేపట్టిన జ్వర సర్వేలో ఏఎన్ఎం, ఆశ కార్యకర్తలు, అంగన్వాడీలు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. బృందాలుగా ఏర్పడి సర్వే చేపడుతున్నారు. జ్వరం వచ్చిన వారి వివరాలు నమోదు చేసుకొని వారికి మందులు అందజేయడంలో వీరే ప్రధానంగా నిలుస్తున్నారు. జ్వర సర్వే విజయవంతంలో కిందిస్థాయి సిబ్బంది సేవలే తోడ్పాటును అందించాయి. కరోనా నియంత్రణలో క్షేత్రస్థాయిలో ముందుండి నడిచిన సిబ్బంది వీరే కావడం విశేషం.
కంటికి రెప్పలా..
కొవిడ్ బాధితులెంతో మంది ఒంటరిగా దవాఖానలకు చికిత్స కోసం వచ్చి చేరుతున్నారు. కుటుంబాన్ని, దగ్గరి వాళ్లను వదిలి దవాఖానకొచ్చే వారికి కిందిస్థాయి సిబ్బందే సర్వస్వం. కంటికి రెప్పలా కరోనా బాధితులకు సేవ చేయడం, సమయానికి పౌష్టికాహారం, మందులు అందించడంలో నర్సులు, పారిశుద్ధ్య సిబ్బంది పనితనం అసాధారణం. కరోనా లక్షణాలుంటేనే కిలోమీటర్ దూరం పారిపోతున్న సమయంలో కరోనా దవాఖానలో, బాధితుల వార్డులో పని చేయడమంటే వారి మానవీయతకు రెండు చేతులతో నిండుగా నమస్కరించాల్సిందే. కుటుంబసభ్యుల ఆప్యాయత, అనురాగాలు లేని లోటును తీరుస్తూ… తోడుగా అన్నింటికీ మేమున్నామంటూ బాధితుల్లో ఆత్మైస్థెర్యాన్ని నింపుతున్నారు. నిండు ఆరోగ్యంతో ఇంటికి వెళ్లేలా సేవ చేయడంలో వైద్య సిబ్బంది కీలకంగా మారుతున్నారు. తమ కుటుంబాలను వదిలి ఇతరుల ఆరోగ్యం కోసం పాటుపడుతున్న వీరి స్ఫూర్తికి అందరూ జేజేలు పలుకుతున్నారు.
పడిలేచిన కెరటాలు
కరోనా కట్టడి చర్యల్లో భాగంగా కింది స్థాయి సిబ్బంది అనేక మంది వైరస్ ముప్పును ఎదుర్కొన్నారు. మొదటి, రెండోవేవ్లో చాలా మందికి కరోనా సోకింది. 14 రోజుల ఐసొలేషన్ తర్వాత చాలా మంది ధైర్యంగా విధుల్లో చేరారు. రోజువారీ కార్యకలాపాల్లో వీరి పాత్ర కీలకంగా మారడంతో బాధ్యతగా పని చేస్తున్నారు. అంతేగాకుండా తమ కుటుంబాలకు దూరంగా ఉంటూ సమాజ శ్రేయస్సు కోసం వీరు తపిస్తున్న తీరు గొప్పదే. రోజంతా గ్రామాల్లో, పట్టణాల్లో సర్వే, ఇతరత్రా వైరస్ నియంత్రణ చర్యల్లో పాల్గొంటున్న వారంతా తిరిగి ఇంటికెళ్తే భయమే. పిల్లలు, కుటుంబీకులను తాకకుండా ఉండడం, భావోద్వేగాలను చంపుకొని వృత్తి ధర్మాన్ని నిర్వర్తించడం వీరి త్యాగాలకు ప్రతిరూపంగా నిలుస్తోంది.
ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం
అధికారుల ఆదేశాలను పాటిస్తూ గ్రామస్తులకు కరోనాపై అవగాహన కల్పిస్తున్నాం. పాజిటివ్ వచ్చిన వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ వారిలో ధైర్యాన్ని నింపుతున్నాం. హోం ఐసొలేషన్లో ఉన్న బాధితులకు ప్రతి రోజూ వాడాల్సిన మందులను వివరిస్తూ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటున్నాం.
-గంగామణి, ఏఎన్ఎం (బాన్సువాడ)
కంటి మీద కునుకు లేదు..
కొవిడ్ పరిస్థితులు తలెత్తినప్పటి నుంచి కంటి మీద కునుకు లేకుండా కష్టపడుతున్నాం. ప్రభుత్వ ఆదేశాలు పాటిస్తూ గ్రామాల్లో కొవిడ్ వ్యాప్తి చెందకుండా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. లక్షణాలున్న వారిని కేంద్రానికి తీసుకొచ్చి కరోనా పరీక్షలు చేయిస్తున్నాం. మహమ్మారి ఎప్పుడూ తగ్గుతుందన్న ఆశతోనే ఎదురుచూస్తున్నాం.
-నాగపురం లావణ్య, ఆశ వర్కర్ (దమ్మన్నపేట్)
ధైర్యం చెబుతున్నాం..
కరోనా బాధితుల ఇండ్లకు వెళ్లి వారికి ధైర్యం చెబుతున్నాం. సమయానికి భోజనం చేసి, మందులు వేసుకోవాలని సూచిస్తున్నాం. మా మండలానికి మహారాష్ట్ర దగ్గరగా ఉండడంతో కరోనా కేసులు పెరిగాయి. ఇప్పుడవి తగ్గుముఖం పట్టాయి. విధి నిర్వహణలో భాగంగా మావంతు కర్తవ్యం నిర్వహిస్తున్నాం.
-హైమావతి, ఆశ వర్కర్,
బొప్పాస్పల్లి, నస్రుల్లాబాద్ మండలం
రోజూ మానిటరింగ్ చేస్తున్నాం
కరోనా బారినపడ్డ వారిని ప్రతి రోజూ మానిటరింగ్ చేస్తున్నాం. దగ్గు, జ్వరం ఏమైనా సమస్యలు ఉన్నాయా అని తెలుసుకునేందుకు వారి ఇంటి వద్దకు వెళ్లి మాట్లాడుతున్నాం. వారిలో ధైర్యాన్ని పెంపొందిస్తున్నాం. ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడితే వెంటనే ప్రభుత్వ దవాఖానకు తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నాం.
-కమల, ఆశ వర్కర్, పాల్వంచ (మాచారెడ్డి)
అందరి ఆరోగ్య పరిస్థితులు తెలుసుకున్నాం..
సర్వేలో భాగంగా ఇంటింటికీ వెళ్లాం. కుటుంబసభ్యులందరినీ పిలిచి వారి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకున్నాం. జ్వరం, దగ్గు, జలుబు ఉన్న వారికి మందులు అందజేశాం. లక్షణాలున్నవారిని కేంద్రానికి తీసుకెళ్లి పరీక్షలు నిర్వహిస్తున్నాం. పాజిటివ్ అని తేలితే మెడికల్ కిట్ అందజేస్తున్నాం.
-ఆడెపు సులోచన, ఆశ వర్కర్ (నవీపేట)
ప్రతి రోజు టెస్టులు చేస్తున్నాం
కరోనా వైరస్ వ్యాప్తి మొదలైనప్పటి నుంచి రాజీవ్నగర్ పీహెచ్సీలో ప్రతి రోజూ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నాం. రోజుకు సుమారు వంద మంది వరకు వస్తున్నారు. పీపీఈ కిట్ ధరించి పరీక్షలు చేస్తున్నాం. ఇబ్బందులు ఎదురైనా విధి నిర్వహణతోపాటు ప్రజలకు సేవలందిస్తున్నాం.
-కవిత, ఏఎన్ఎం, కామారెడ్డి
సర్వేతో కేసులు తగ్గుతున్నాయి
జ్వర సర్వేతో కరోనా కేసులు తగ్గుతున్నాయి. ఆశ కార్యకర్త, అంగన్వాడీ టీచర్, రెవెన్యూ సిబ్బందితో కలిసి ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరిస్తున్నాం. స్వల్ప లక్షణాలున్నప్పుడే మందులు వేసి జాగ్రత్తలు తీసుకుంటున్నాం. బాధితులను హోం ఐసొలేషన్లో ఉంచుతూ నిరంతరం పరిశీలిస్తున్నాం.
-జానకీ, ఏఎన్ఎం, కందకుర్తి (రెంజల్)
జాగ్రత్తలు పాటిస్తూ పరీక్షలు..
పలు గ్రామాలకు చెందిన ప్రజలు కరోనా లక్షణాలతో దవాఖానకు వస్తున్నారు. రోజుకు వంద మందికి పరీక్షలు చేస్తున్నాం. జాగ్రత్తలు తీసుకుంటూ కొవిడ్ పరీక్షలు చేస్తున్నాం. పాజిటివ్గా నిర్ధారణ అయిన వారిని హోం ఐసొలేషన్లో ఉండాలని సూచిస్తున్నాం. పాజిటివ్ వ్యక్తుల సమాచారాన్ని గ్రామంలో విధులు నిర్వర్తించే సిబ్బందికి అందించి అప్రమత్తం చేస్తున్నాం.
-గంగామణి,
ఏఎన్ఎం, ఎడపల్లి
మొదట్లో భయం వేసినా..
కరోనా సెకండ్వేవ్ అధికంగా ఉన్నా సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తున్నాం. పాజిటివ్ వచ్చిన రోగుల ఇంటికి వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితులను పరిశీలించి సలహాలు అందిస్తున్నాం. నిత్యం వందమందికి కొవిడ్ పరీక్షలు చేస్తున్నాం. మొదట్లో కాస్త భయం వేసినా బాధితులకు ధైర్యంగా సేవలందిస్తున్నాం.
-భాగ్య, ఏఎన్ఎం (లింగంపేట)