నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ దవాఖానల కోసం నిల్వ
రోగుల అవసరాలు తీరుస్తూ… కొరతను అధిగమించిన యంత్రాంగం
మంత్రి వేముల, ఎమ్మెల్సీ కవిత చొరవతో సమకూరిన ఔషధాలు
కలెక్టర్ నిరంతర పర్యవేక్షణ, తనిఖీలతో బ్లాక్ మార్కెట్ దందాకు చెక్
ప్రైవేటు, ప్రభుత్వ దవాఖానల్లో తగ్గుతున్న పేషెంట్లు, పెరుగుతున్న ఖాళీలు
ఒకవైపు కరోనా బాధితులకు మెరుగైన చికిత్సా సదుపాయాలను సమకూరుస్తూనే.. మరోవైపు రెమ్డెసివిర్ లాంటి మందుల కొరతను జిల్లా యంత్రాంగం అధిగమించింది. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాకేంద్ర ఔషధ గిడ్డంగిలో 18,400 వాయిల్స్ రెమ్డెసివిర్ నిల్వలున్నాయి. శుక్రవారం వరకు 8,400 వాయిల్స్ ఉండగా శనివారం మరో 10వేల వాయిల్స్ జిల్లాకు చేరుకున్నాయి. మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చొరవతో నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ ప్రభుత్వ దవాఖానల్లో ఉత్తమ వైద్యసేవలు అందుతున్నాయి. ఇక ప్రైవేటు దోపిడీకి అధికార యంత్రాంగం అడ్డుకట్ట వేసింది. ప్రైవేటు దవాఖానల పర్యవేక్షణకు ఇప్పటికే టాస్క్ఫోర్స్ బృందాలను రంగంలోకి దింపిన కలెక్టర్ నారాయణరెడ్డి.. స్వయంగా హాస్పిటల్స్లో తనిఖీలు చేపడుతుండడంతో సత్ఫలితాలు వస్తున్నాయి.
నిజామాబాద్, మే 15, (నమస్తే తెలంగాణ ప్రతినిధి):
కొవిడ్ మహమ్మారి నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోంది. లక్షణాలు ఉన్న వారికి టెస్టులు చేయించడం దగ్గరి నుంచి పాజిటివ్గా తేలితే చికిత్స అందించడం వరకు జాగ్రత్తలు తీసుకుంటున్నది. ప్రభుత్వమే ఉచితంగా ఐసొలేషన్ కిట్లు సరఫరా చేయడంతోపాటుగా సీరియస్ పేషెంట్లకు ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్యం అందస్తున్నది. నిజామాబాద్ జిల్లాలోని ప్రభుత్వ జనరల్ దవాఖాన, ఆర్మూర్, బోధన్ ఏరియా దవాఖానల్లో కొవిడ్ వార్డులను ప్రత్యేకంగా ఏర్పాటు చేయడంతోపాటు సేవలను నిర్విరామంగా కొనసాగిస్తున్నారు. రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చొరవతో ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి నిరంతరం అధికార యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ కరోనా బాధితులకు అవసరమయ్యే చికిత్సకు సంబంధించిన సదుపాయాలను వెనువెంటనే సమకూర్చేలా కృషి చేస్తున్నారు. ప్రైవేటు దవాఖానల ఆగడాలపై కమిటీలు వేయడం, నిరంతరం తనిఖీలు చేపట్టడం ద్వారా దోపిడీని అరికట్టారు. రెమ్డెసివిర్ ఇంజక్షన్ల కొరతను నివారించడంతోపాటు సామాన్యులకు అందుబాటులోకి తెచ్చారు.
భారీగా రెమ్డెసివిర్ ఇంజక్షన్లు
ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయి కరోనాతో ఆరోగ్య పరిస్థితి సీరియస్గా మారిన వారికి రెమ్డెసివిర్ ఇంజక్షన్లతో ప్రాణాలు నిలుపుతున్నారు. ప్రైవేటు, ప్రభుత్వ దవాఖానల్లో గతంలో ఈ ఔషధం దొరుకుతుందా అనే అనుమానాలుండేవి. నిజామాబాద్ ప్రభుత్వ దవాఖానల్లో మాత్రం ఏ రోజు కొరత లేకుండా ప్రభుత్వ యంత్రాంగం సమకూర్చింది. రాష్ట్ర మంత్రి వేములతోపాటు ఎమ్మెల్సీ కవిత చొరవ మూలంగా ప్రభుత్వ పెద్దలతో నిరంతరం మాట్లాడి రెమ్డెసివిర్ ఇంజక్షన్లను భారీగా నిజామాబాద్కు వచ్చేలా కృషి చేశారు. తద్వారా వందలాది వాయిల్స్ అందుబాటులో ఉండడం మూలంగా ప్రభుత్వ దవాఖానల్లో సామాన్య పేషెంట్లకు ఉచితంగానే అవసరమైన డోసులు అందించారు. వారి ప్రాణాలను నిలిపారు. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా కేంద్ర ఔషధ గిడ్డంగిలో 18వేల 400 వాయిల్స్ రెమ్డెసివిర్ నిల్వలు ఉండడం విశేషం. శుక్రవారం వరకు 8,400 వాయిల్స్ ఉండగా శనివారం మరో 10వేల వాయిల్స్ రెమ్డెసివిర్లు జిల్లాకు చేరుకున్నాయి. ఈ మొత్తం రెమ్డెసివిర్ ఇంజక్షన్లను నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ ప్రభుత్వ దవాఖానల్లో చికిత్స పొందుతున్న కరోనా బాధితులకే వాడనున్నారు. వైద్యుల పర్యవేక్షణలో అవసరమైన వారికి మాత్రమే వీటిని వినియోగిస్తారు. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఇప్పటి వరకు జిల్లాలోని వివిధ ప్రైవేటు దవాఖానల్లో 17వేల వాయిల్స్ రెమ్డెసివిర్ల వినియోగం జరిగింది. ప్రైవేటులోనూ వీటి కొరత లేకుండా జిల్లా యంత్రాంగం పకడ్బందీగా వ్యవహరించింది.
తనిఖీలతో దారిలోకి…
విపత్కర సమయంలో కరోనా చికిత్స విధానాన్ని అడ్డం పెట్టుకుని నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కొన్ని ప్రైవేటు దవాఖానలు అడ్డదారులు తొక్కాయి. రెమ్డెసివిర్ ఇంజక్షన్లను బ్లాక్ మార్కెట్లో విక్రయించడం, కొరతను సృష్టించి సామాన్యులను పీల్చి పిప్పిచేశారు. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ దృష్టిసారించి పోలీసుల నిఘా పెట్టారు. వేర్వేరు ఘటనల్లో కొందరు అక్రమార్కులు రెమ్డెసివిర్ ఇంజక్షన్లను పక్కదారి పట్టించడం, కల్తీ చేయడం వంటివి వెలుగు చూడడంతో వారిపై కఠిన చర్యలకు పూనుకున్నారు. అంతేగాకుండా ఈ అక్రమ దందాకు చెక్ పెట్టేందుకు ఉక్కుపాదం మోపారు. ఆయా శాఖల జిల్లా అధికారులతో వివిధ కమిటీలు ఏర్పాటు చేశారు. ప్రైవేటు దవాఖానల వ్యవహారంపై తనిఖీలు చేయించారు. రెమ్డెసివిర్ ఇంజక్షన్ల వినియోగం, ధరల వివరాలపై తేడాలు వచ్చిన దవాఖానలకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. నిరంతరంగా ప్రైవేటు దవాఖానల అక్రమాలపై తనిఖీలు కొనసాగడంతో అక్రమార్కులు భయపడిపోయారు. తమ దందాకు చెక్ పెట్టి సక్రమార్గంలో ప్రజలకు వైద్య సేవలు అందించే పనిలో నిమగ్నమయ్యారు. మరోవైపు జిల్లాకు రెమ్డెసివిర్ ఇంజక్షన్లను అవసరానికి మించి తెప్పించడం మూలంగా డిమాండ్ను నీరుగార్చడంతో ధరలు నియంత్రణలోకి వచ్చాయి.
ప్రభుత్వం అండగా ఉంటుంది..
కరోనా చికిత్సకు జిల్లాలోని ప్రభుత్వ దవాఖానల్లో సకల సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. రెమ్డెసివిర్ ఇంజక్షన్లు, క్రిటికిల్ కండిషన్లో ఇచ్చే ఔషధాలు, ఆక్సిజన్, వెంటిలేటర్ సౌకర్యాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కరోనా సోకితే వెంటనే చికిత్సను ప్రారంభించాలి. జ్వర సర్వేలో లక్షణాలు ఉన్న వారి ఇంటింటికీ ఔషధ కిట్లు పంపిణీ చేశాం. మందులు వాడితే కరోనా నుంచి కోలుకోవచ్చు. నిర్లక్ష్యం చేసి ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దు. ప్రభుత్వం ఎల్లవేళలా సేవ చేసేందుకు సర్వం సిద్ధంగా ఉంది.