బోధన్, మే 3: నిజాం షుగర్స్కు లేఆఫ్ ప్రకటించి 11 ఏండ్లు గడుస్తున్నప్పటికీ, తమకు న్యాయంగా రావాల్సిన వేతన బకాయిలు చెల్లించకపోవడంపై కార్మికులు నిరసన వ్యక్తంచేశారు. బుధవారం శక్కర్నగర్లోని నిజాం షుగర్స్ మెయిన్ గేట్ వద్ద కార్మికులు ధర్నా చేశారు. తమను ఎన్డీఎస్ఎల్ యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదని, వెంటనే తమకు రావాల్సిన వేతన బకాయిలను చెల్లించాలని డిమాండ్చేశారు. నిజాం షుగర్స్ను తాము అధికారంలోకి వస్తే పునరుద్ధరిస్తామన్న హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోవాలని కోరారు.
కార్మిక చట్టాల ప్రకారం వేతనాలు ఇవ్వకపోవడంతో కార్మికులు రోడ్డున పడ్డారని, తమ బకాయిలు రాకముందే కొందరు మరణించారని ఆవేదన వ్యక్తంచేశారు. స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి, రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి అనేకసార్లు తమ సమస్యలు తీసుకెళ్లామని, ఇప్పటివరకు స్పందించకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. ధర్నాలో కార్మిక సంఘాల నాయకులు నాగుల రవిశంకర్గౌడ్, ఉపేందర్, బాలకృష్ణ, రాజారాం, దేవదాసు, కార్మికులు బాలచందర్, భాస్కర్, భిక్షపతి, భూమయ్య, శ్రీధర్ పాల్గొన్నారు.