కోటగిరి, జూన్ 27: ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో పల్లెల్లో ఏర్పాటు చేసిన పల్లె దవాఖానల్లో ఖాళీలు వెక్కిరిస్తున్నాయి. ఏఎన్ఎం పోస్టులు ఖాళీగా ఉండడంతో రోగులకు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందడంలేదు. వానకాలం వచ్చేసింది.. వర్షాలు కురిస్తే వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నది. ఇలాంటి సమయంలో పొతంగల్ పీహెచ్సీ (ప్రాథమిక ఆరోగ్య కేంద్రం) పరిధిలోని 11 సబ్ సెంటర్లలో విధులు నిర్వర్తించే 9 మంది ఏఎన్ఎంలు బదిలీ అయ్యారు. కానీ వారి స్థానంలో కొత్తగా ఏఎన్ఎంలు రాలేదు.. అప్పటి నుంచి పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
వారి స్థానంలో ఉన్న వాళ్లతోనే డిప్యూటేషన్తో నడిపిస్తున్నారు. వీరితోపాటు ఇద్దరు సూపర్వైజర్లు బదిలీ అయ్యారు. వారి స్థానంలో కూడా పోస్టులు భర్తీ కాలేదు. పల్లెల్లో ఏఎన్ఎంలు లేకపోవడంతో వైద్య సేవలు అంతంత మాత్రమే అందుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొతంగల్ (బీ) సబ్ సెంటర్లో ఉన్న ఇద్దరు ఏఎన్ఎంలు బదిలీ అయ్యారు. అక్కడ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కొత్తగా ఏఎన్ఎంలు రాకపోవడంతో పల్లె దవాఖానలో వైద్య సేవలు పూర్తి స్థాయిలో అందడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సుంకిని పల్లె దవాఖానలో ఇద్దరు ఏఎన్ఎంలు ఉండాల్సి ఉండగా, చాలా ఏండ్ల నుంచి ఒక్కరే ఏఎన్ఎం ఉన్నారు.
పాత పొతంగల్ పల్లె దవాఖాన (సబ్ సెంటర్)లో ఇద్దరు ఏఎన్ఎంలు ఉండాల్సి ఉండగా ఒక్కరూ కూడా లేకపోవడం గమనార్హం. ప్రస్తుతం డిప్యూటేషన్తో సేవలు అందిస్తున్నారు. కల్లూర్ పల్లె దవాఖానలో ఇద్దరు ఏఎన్ఎంలు ఉండాల్సి ఉండగా ఒక్కరే ఉన్నారు. ఇక్కడ చాలా ఏండ్ల నుంచి పోస్టు ఖాళీగా ఉంది. ఎత్తొండ పల్లె దవాఖానలో ఇద్దరు ఏఎన్ఎంలు ఉండాలి. ఇప్పటికే ఒకరు బదిలీ కాగా అప్పటి నుంచి ఒక్కరే ఉన్నారు. హెగ్డోలి సబ్ సెంటర్లో ఇద్దరు ఉండాలి కానీ ఒక్కరే ఉన్నారు. ఒకరు గతేడాది బదిలీ కాగా అప్పటి నుంచి పోస్టు ఖాళీగా ఉంది. రాణంపల్లి సబ్ సెంటర్లో ఇద్దరు ఉండాలి, కానీ అక్కడ ఒక్కరు కూడా లేరు. వైద్య సేవలు ఎలా అందిస్తారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
పొతంగల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఇద్దరు సూపర్వైజర్లు ఉండే వారు,. ఇటీవల వారు కూడా ఉద్యోగోన్నతిపై ఇతర చోటికి బదిలీ అయ్యారు. అప్పటి నుంచి రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏఎన్ఎంలపై పర్యవేక్షణ చేయాల్సిన పర్యవేక్షకులు (సూపర్వైజర్లు)లేకపోతే వైద్య సేవలు అందేది ఎలా అని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. పీహెచ్సీ పరిధిలో ముగ్గురు సూపర్వైజర్లు ఉం డాలి. కానీ ఒక్కరే ఉన్నారు. మిగతా రెండు పోస్టులు ఖాళీ ఉన్నాయి. కొత్తపల్లి, సుంకిని రెండు పల్లె దవాఖానలో ఇద్దరు ఎంఎల్హెచ్పీలు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వైద్య సిబ్బంది కొరత ఉంటే రోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని మండలవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిబ్బంది కొరత కారణంగా గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించడానికి కూడా ఆస్కారం లేకుండా పోయింది.
పల్లె దవాఖానలో(సబ్ సెంటర్)లో ఏఎన్ఎం పోస్టు లు ఖాళీ కావడంతో పనిభారం పెరిగిందని సెకండ్ ఏఎన్ఎంలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏండ్ల తరబడి సింగిల్ సెకండ్ ఏఎన్ఎంలు పని చేస్తున్నారని, వారిపై పనిభారం తీవ్రంగా పడుతుందని సెకండ్ ఏఎన్ఎంలు ఆవేదన వ్యక్తం చేశారు.