సుభాష్నగర్, ఫిబ్రవరి 15: భక్తుల పాలిట కొంగు బంగారం, ఇందూరు కంఠాభరణం నీలకంఠేశ్వరాలయం రథసప్తమి వేడుకలకు ముస్తాబైంది. ఏటా మాఘశుద్ధ సప్తమి శుక్రవారం పురస్కరించుకొని స్వామివారి శోభయాత్ర చేపట్టడం ఆలయ సంప్రదాయం. తల్లిఘోరీ వరకు ప్రత్యేకంగా అలంకరించే రథంపై ఉత్సవమూర్తులను ఊరేగించడం అనాదిగా వస్తున్న ఆచారం. వందేండ్లనాటి రథం శోభాయాత్రకు అనుకూలంగా లేకపోవడంతో ఆలయ కమిటీ నిర్ణయించిన 200మంది దాతల ద్వారా పోగు చేసిన రూ. 55లక్షలతో నూతన రథాన్ని సిద్ధం చేసింది.
రాష్ట్రంలోనే ఎత్తయిన రథం..
గద్వాలకు చెందిన ప్రముఖ శిల్పి బైరోజు బాలబ్రహ్మచారి నేతృత్వంలో 10 మంది కళాకారులు నూతన రథాన్ని తయారు చేశారు. మహారాష్ట్రలోని అడవుల నుంచి తెచ్చిన పెదవెగుకర్రను ఉపయోగించారు. గద్వాలలోనే కర్రపై చెక్కిన శిల్పాలను తయారుచేసి ఇక్కడకు తెచ్చి రథానికి అమర్చారు. 28.5అడుగుల ఎత్తు, 11 అడుగుల వెడల్పు, 5 అంతస్తుల్లో వైవిధ్యభరితమైన శిల్పాలతో రథాన్ని ఆవిష్కరించారు. శివలింగం, నంది ఇరువైపులా గణపతి, కుమారస్వామి మరోవైపు అమ్మవారు, ద్వార పాలకులు, ఏనుగులు, గుర్రాలు ఇలా రథంపై చెక్కిన శిల్పాలు ఆధ్యాత్మికతను ప్రతిబింబిస్తున్నాయి. కర్నూలు జిల్లా ఆలూరులో హంపీ ఆలయానికి వినియోగించిన నాలుగు ఏకశిలతో రథచక్రాలను తయారు చేయించారు. ఒక్కో చక్రం బరువు ఒకటన్ను ఉంటుంది. రాష్ట్రంలోనే ఎత్తయిన రథంగా భక్తుల గుర్తింపు పొందింది.
సుదీర్ఘ చరిత్ర కలిగిన నీలకంఠేశ్వరస్వామి రథసప్తమి వేడుకలు ఇందూరు సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పడతాయి. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. నేడు నూతన రథంతో శోభాయాత్రను నిర్వహిస్తున్నాం. 17న ఉత్సవమూర్తులకు కోనేరులో చక్రస్నానం తదితర ప్రత్యేక పూజలు చేస్తాం.