మాక్లూర్, జనవరి 22: మండలంలోని వల్లభాపూర్- బొంకన్పల్లి గ్రామాల మధ్య గుంతలమయంగా మారిన రోడ్డు ఆర్మూర్ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ జీవన్రెడ్డి చొరవతో అద్దంలా మారింది. ఏడు కిలోమీటర్ల ఈ రోడ్డు గతంలో అధ్వానంగా ఉండేది. ఈరోడ్డుపై ప్రయాణం చేయాలంటే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే వారు. ఈ రోడ్డు దుస్థితిని ఆయా గ్రామాల సర్పంచులు ఆర్మూర్ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.
ఎమ్మెల్యే స్పందించి రూ.కోటి 50 లక్షల నిధులు మంజూరు చేయించారు. దీంతో వల్లభాపూర్, మెట్పల్లి, గొట్టుముక్కల మీదుగా బొంకన్పల్లి వరకు బీటీ రోడ్డు నిర్మించారు. వల్లభపూర్, బొంకన్పల్లి, మెట్పల్లి, గొట్టుముక్కల, ముల్లంగి(బీ), శాంతినగర్, కృష్ణానగర్, బోర్గాం(కె), మాక్లూర్, మాదాపూర్ గ్రామాల వాహనదారులకు కూడా ఈ రోడు సౌకర్యంగా మారింది. 63వ నంబర్ జాతీయ రహదారి మానిక్బండార్ నుంచి జన్నెపల్లి వరకు ధర్మోరా, మాందాపూర్, చిక్లీ, కొత్తపల్లి, గుంజిలి గ్రామాల నుంచి జిల్లా కేంద్రం వెళ్లే వాహనదారులకూ ఇబ్బందులు తొలగాయి. ప్రతి వారం నవీపేట్ సంతకు వెళ్లే వారికీ సౌకర్యవంతంగా మారింది. ఆయా గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే జీవన్రెడ్డికి స్థానికులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
ప్రజల కష్టాలు దూరం..
అధ్వానంగా ఉన్న వల్లభపూర్-బొంకన్పల్లి మార్గంలో బీటీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి నిధులు మంజూరు చేయించారు. ఇటీవల బీటీ రోడ్డు వేయడంతో ప్రయాణికులకు ఇబ్బందులు తొలగిపోయాయి. ఎమ్మెల్యే చొరవతోనే మా గ్రామంలో డ్రైనేజీలు, సీసీ రోడ్ల నిర్మాణం నిర్మించాం. గ్రామం వేగంగా అభివృద్ధి చెందుతోంది. సీఎం కేసీఆర్కు, ఎమ్మెల్యే జీవన్రెడ్డికి గ్రామస్తుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.
-సిలారి మంజుల, సర్పంచ్, వల్లభపూర్