డిచ్పల్లి, మార్చి 12 : కార్పొరేట్ శక్తుల ప్రయోజనాల కోసమే బీజేపీ ప్రభుత్వం నూతన జాతీయ విద్యావిధానాన్ని అమలు చేస్తున్నదని రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ ఆరోపించారు. టీయూ ఆర్ట్స్ కాలేజీ సెమినార్ హాల్లో మంగళవారం విద్యార్థుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నూతన విద్యావిధానం, ప్రైవేటీకరణ అనే అంశంపై సదస్సు నిర్వహించారు.
ప్రొఫెసర్ పున్నయ్య అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో పలువురు వక్తలు మాట్లాడుతూ.. నూతన విద్యావిధానాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ విధానం ద్వారా ప్రభుత్వ యూనివర్సిటీలు దివాళా తీస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యారంగానికి సరిపడా బడ్జెట్ కేటాయించకుండా ఎన్ని సంస్కరణలు చేసినా ప్రయోజనం లేదన్నారు. యువత, విద్యార్థిలోకం పెద్ద ఎత్తున ఉద్యమించాలని పిలుపునిచ్చారు.