నవనాథపురం ప్రగతి పథంలో దూసుకెళ్తున్నది. ఆర్మూర్ నియోజకవర్గం అభివృద్ధికి చిరునామాగా నిలుస్తున్నది. స్థానిక ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి నేతృత్వంలో పల్లెలు కొత్తరూపు సంతరించుకున్నాయి. నియోజకవర్గంలో దశాబ్దాలుగా నెలకొన్న సమస్యలు తొలగిపోయాయి. మౌలిక వసతులు మెరుగుపడ్డాయి. పేదలకు ఉచితంగా కార్పొరేట్ విద్య, వైద్య సేవలు అందుతున్నాయి. సీఎం కేసీఆర్తో ఉన్న సాన్నిహిత్యంతో జీవన్రెడ్డి నియోజకవర్గాన్ని ప్రగతిబాట పట్టించారు. ఆయన కృషితోనే ఆర్మూర్ దవాఖానలో అత్యాధునిక వైద్య చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. సంక్షేమ ఫలాలు ప్రజల దరికి చేరాయి. పల్లె పల్లెకూ రోడ్లు విస్తరించాయి. తొమ్మిదేండ్ల వ్యవధిలోనే ఆర్మూర్ పట్టణం అద్భుత రీతిలో అభివృద్ధి బాట పట్టింది. ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం సిద్దులగుట్ట సరికొత్త శోభను సంతరించుకున్నది.
– నందిపేట్, ఏప్రిల్ 20
స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్మూర్ ప్రాంతం అభివృద్ధిలో దూసుకుపోతున్నది. ఎటుచూసినా అభివృద్ధి పనులే కనిపిస్తున్నాయి. సర్కారు సంక్షేమ ఫలాలు నియోజకవర్గంలోని ఇంటింటికీ చేరుతున్నాయి. గతంలో లేని అభివృద్ధి ఇప్పుడు జరుగుతోందని నియోజకవర్గ ప్రజలు సంతోషాన్ని వెలిబుచ్చుతున్నారు. జఠిలమైన సమస్యలు సైతం వెనువెంటనే పరిష్కారమవుతున్నాయి. రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన పీయూసీ చైర్మన్ ఆశన్నగారి జీవన్రెడ్డి ఎప్పుడూ అందుబాటులో అవసరమైన సాయమందించి ఆదుకుంటున్నారు. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఆర్మూర్ నియోజకవర్గంలోని 24,167 మందికి సీఎంఆర్ఎఫ్, 1403 మందికి దవాఖాన ఖర్చులకు గాను ఎల్వోసీలను అందజేయడం విశేషం. ఆర్మూర్కు ప్రధాన చిహ్నంగా కనిపించే నవసిద్ధుల గుట్టను అన్ని విధాలా అభివృద్ధి చేసి అందంగా తీర్చిదిద్దారు. దశాబ్దాల నాటి కల అయిన రెవెన్యూ డివిజన్ను ఏర్పాటు చేశారు. రికార్డు స్థాయి సేవలందిస్తున్న ప్రభుత్వ దవాఖాన, నిర్మల్-నిజామాబాద్ జిల్లాలను కలుపుతూ రూ.120కోట్లతో ఉమ్మెడ వద్ద గోదావరి నదిపై వంతెన, సుమారు రూ.9కోట్లతో కల్యాణ మండపాల నిర్మాణాలు ఇలా ఎన్నో సంక్షేమాలు, అభివృద్ధి కార్యక్రమాలతో ఆర్మూర్ అన్ని రంగాల్లో దూసుకుపోతున్నది.
-నందిపేట్, ఏప్రిల్ 20
చేరువైన పాలన..
నియోజకవర్గంలో డొంకేశ్వర్, ఆలూర్ మండలాల ఏర్పాటుతో కొత్త కార్యాలయాలు ఏర్పాటై పరిపాలన సౌలభ్యంగా మారింది. మాక్లూర్ మండలంలో కొత్తగా 9 గ్రామపంచాయతీలు ఏర్పడ్డాయి. సట్లాపూర్ తండా, అమ్రాద్ తండా, గుత్ప తండా, సింగంపల్లి తండా, ఏలియానాయక్తండా, మెట్పల్లి, మాందాపూర్, వల్లభాపూర్, వెంకటాపూర్ అలాగే నందిపేట్ మండలంలోని కౌల్పూర్, జోర్పూర్, చిన్నయానం, మాయాపూర్, మల్లారం గ్రామ పంచాయతీలుగా ఏర్పడడంతో ఎక్కడికక్కడ పరిపాలన జరిగి స్థానికులకు సేవలు అందుబాటులోకి రావడంతోపాటు అభివృద్ధి జోరుగా జరుగుతున్నది.
రికార్డు స్థాయిలో సీఎంఆర్ఎఫ్, ఎల్వోసీలు..
అనారోగ్యంతో దవాఖానలో చేరుతున్న వారికి సీఎంఆర్ఎఫ్, ఎల్వోసీలు అండగా నిలుస్తున్నాయి. ఎమ్మెల్యే జీవన్రెడ్డి వీటిపై ప్రత్యేక దృష్టి సారించి మండలానికి ఒకరి చొప్పున ప్రతినిధులను నియమించి అనారోగ్యంతో ఇబ్బందిపడుతున్న వారికి భరోసా కల్పిస్తున్నారు. తన ప్రతినిధుల ద్వారా బాధితుల నుంచి దవాఖాన బిల్లుల రశీదు, అవసరమయ్యే పత్రాలు తీసుకొని ప్రభుత్వానికి పంపించి ఆర్థికసాయం మంజూరు చేయిస్తూ చేయూతనిస్తున్నారు. ఇప్పటి వరకు 24,167 మందికి సుమారు రూ.17 కోట్లు సీఎంఆర్ఎఫ్, ఎల్వోసీ ద్వారా 1403 మంది బాధితులకు సుమారు రూ.9 కోట్లు దవాఖాన ఖర్చులకు అందజేసి పేదవారి ప్రాణాలను నిలబెట్టారు.
అగ్రగామిగా ఆర్మూర్ సర్కారు దవాఖాన..
పేదవారికి ప్రసవమనగానే ప్రైవేట్ దవాఖాన కాకుండా ఆర్మూర్ ప్రభుత్వ దవాఖాన గుర్తుకు వచ్చేలా సేవలందుతున్నాయి. 30 పడకల స్థాయి నుంచి 100 పడకల స్థాయికి పెంచి దవాఖానలో అన్నివిధాలా సౌకర్యాలు కల్పించడంతోపాటు గతంలో కన్నా మూడు, నాలుగు రేట్ల సిబ్బందిని, వైద్యులను పెంచారు. ప్రధానంగా ప్రసవాలపై దృష్టి సారించి అన్ని వసతులు, ప్రత్యేక సేవలందించడంతో రికార్డు సృష్టించారు. ప్రైవేట్ దవాఖానలో రూ.30వేల నుంచి రూ.50వేలు అయ్యే ఖర్చు ఇక్కడ నయా పైసా లేకుండా ప్రసవం జరగడంతో సర్కారు దవాఖానపై అందరికీ నమ్మకం ఏర్పడింది. ఎమ్మెల్యే ప్రత్యేక శ్రద్ధతో ఇటీవల డయాలసిస్ సెంటర్ను మంజూరు చేయించి ప్రారంభించారు.
రూ.120కోట్లతో గోదావరిపై వంతెన..
నిజామాబాద్-నిర్మల్ జిల్లాలను కలుపుతూ ఎన్నో కిలోమీటర్ల దూరం తగ్గి చేరువైపోయింది. నందిపేట్ మండలం ఉమ్మెడ పాతగ్రామం వద్ద గోదావరి నదిపై నిర్మించిన వంతెన రెండు జిల్లాల ప్రజలకు ఎంతో సౌకర్యవంతంగా మారింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిర్మాణంతో 50ఏండ్ల క్రితం దూరమైన ఈ రెండు ప్రాంతాలు ఎంతో దగ్గరయ్యాయి. సుమారు రూ.120 కోట్లతో నదిపై వంతెన నిర్మించడంతో సుమారు 50 కిలోమీటర్ల దూరం తగ్గింది. 50కిలోమీటర్ల చుట్టూ తిరిగి వెళ్లాల్సిన దూరం 10కిలోమీటర్లకు చేరువైంది. గతంలో రెండు ప్రాంతాల ప్రజలు పుట్టి(నాటుపడవ) ద్వారా ప్రమాదకర పరిస్థితుల్లో నది దాటుతుండేవా రు. ఇప్పుడు వంతెన నిర్మాణంతో ఎంతో సౌకర్యవంతమైంది. అంతేగాకుండా వెల్మల్, జోర్పూర్, దేగాం వాగులపై నూతన వంతెనల నిర్మాణాలు జరగడంతో వానకాలంలో వాగు లు ఉప్పొంగి ప్రవహించినా రాకపోకలకు ఏ మాత్రం అంతరాయం కలుగడం లేదు. మా క్లూర్ మండలం మానిక్భండార్ శివారులోని వాగుపై సుఖ్జిత్ ఫ్యాక్టరీని ఆనుకొని కోట్లాది రూపాయలతో వంతెన నిర్మాణ పనులు జరుగుతున్నాయి.
కల్యాణ మండపాలకు కేరాఫ్ అడ్రస్..
నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో మండపాల నిర్మాణాలు వేగవంతంగా జరుగుతున్నాయి. ఆయా కుల సంఘాలకు కోట్లాది రూపాయలు మంజూరు చేసి మండపాలు నిర్మించి ఇస్తున్నారు. సుమారు రూ.10కోట్లకు పైగా వ్యయంతో మండపాలను నిర్మిస్తున్నారు. నందిపేట్, మాక్లూర్లో మున్నూరు కాపు కల్యాణ మండపాలు, ఆర్మూర్ టౌన్, నందిపేట్లో పద్మశాలీ కల్యాణ మండపాలు, ఆర్మూర్ టౌన్, నందిపేట్లో గౌడ సంఘం కమ్యూనిటీ హాళ్లు, నియోజకవర్గస్థాయిలో గొల్లకుర్మలకు నందిపేట్లో, ఆర్మూర్, నిజామాబాద్ ప్రధాన రోడ్డును ఆనుకొని వంజరి సంఘం కల్యాణ మండపం, నందిపేట్ బైపాస్ రోడ్డును ఆనుకొని ముస్లిములకు షాదీఖాన నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి.
సమస్యలు తీర్చిన బైపాస్ రోడ్డు..
గ్రామాల్లోని ఇరుకురోడ్లతో తరచూ పడుతున్న ఇబ్బందులను గమనించి బైపాస్ రోడ్లను మంజూరు చేయించారు. ప్రధానంగా నందిపేట్ చుట్టూ బైపాస్ రోడ్డు నిర్మించడంతో తరచూ జరిగే ట్రాఫిక్ ఇబ్బందులు తొలగాయి. ఆర్మూర్లోని ఆలూర్ బైపాస్ రోడ్డు, వెల్మల్ బైపాస్ రోడ్లతో వాహనాల రాకపోకలు ఎంతో సౌకర్యవంతంగా అయ్యాయి.
రెవెన్యూ డివిజన్ ఏర్పాటు..
ఆర్మూర్తోపాటు బాల్కొండ నియోజకవర్గాల ప్రజల దశాబ్దాల కల అయిన రెవెన్యూ డివిజన్ ఏర్పడింది. ఏ అవసరానికైనా దూరంలో ఉన్న నిజామాబాద్కు వెళ్లాల్సి ఉండేది. భూసమస్యలు, ఇతరత్రా తగాదాలు, రెవెన్యూకు సంబంధించి పనులను ఆర్మూర్లోనే జరగడంతో ప్రజలు సంతృప్తి చెందుతున్నారు.
విద్యారంగం మెరుగు..
మాక్లూర్ మండలంలో మైనార్టీ గురుకుల పాఠశాల, కేజీబీవీ పాఠశాలలకు అన్ని హంగులతో భవనాల నిర్మాణం చేపడుతున్నారు. కోట్లాది రూపాయల వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయగా మైనార్టీ గురుకుల పాఠశాల, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం నిర్మిస్తున్నారు. మన ఊరు – మన బడి కార్యక్రమంలో ప్రతి మండలంలో పదుల సంఖ్యలో పాఠశాలల ఆధునీకరణ పనులు చివరి దశకు చేరుకున్నాయి.
జాబ్మేళాలతో ఉద్యోగావకాశాలు..
ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి నియోజకవర్గంలోని నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు పలుమార్లు ఆయా కంపెనీలను తీసుకువచ్చి జాబ్మేళాలు ఏర్పాటు చేశారు. దీంతో ఎంతోమంది నిరుద్యోగులకు ఉపాధి లభించింది.