కామారెడ్డి, జనవరి 11 : ఎలాంటి క్రీడా పోటీలకైనా చక్కని వేదిక కామారెడ్డి పట్టణమని స్థానిక ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. పోటీల నిర్వహణకు ఇక్కడ పుష్కలంగా వనరులు ఉన్నాయని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఈ నెల 7న ప్రారంభమైన జాతీయ స్థాయి (అండర్ -17) బాలుర కబడ్డీ పోటీలు గురువారంతో ముగిశాయి. సాయంత్రం ఏర్పాటు చేసిన బహుమతుల ప్రదానోత్సవానికి ముఖ్యఅతిథులగా ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డితోపాటు ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..
జాతీయస్థాయి క్రీడా పో టీల నిర్వహణకు చాలా మంది దాతలు ముందుకు వచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. కామారెడ్డిలో ఏ కార్యక్రమం నిర్వహించినా అందరి సహకారంతో విజయవంతమవుతుందని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి మాట్లాడుతూ.. ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి పోటీలు నిర్వహించడం గర్వకారణమని అన్నారు. కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ మాట్లాడుతూ.. కామారెడ్డి క్రీడలకు ఎంతో ప్రాధాన్యత ఉందని అన్నారు. కార్యక్రమంలో ఎస్పీ సింధూశర్మ, డీఈవో రాజు, ఇంటర్ నోడల్ అధికారి షేక్ సలాం,పరీక్షల విభాగం అధికారి నీలం లింగం, డీఎస్వో సిద్దిరాంరెడ్డి, ఎస్జీఎఫ్ నిర్వాహకులు దామోదర్ రెడ్డి, అనిల్ కుమార్, వ్యాయా మ ఉపాధ్యాయులు, ఆయా రాష్ర్టాల క్రీడాకారులు, విద్యార్థులు పాల్గొన్నారు.
చివరిరోజు హర్యానా వర్సెస్ కర్ణాటక జట్లు ఫైనల్లో పోటీ పడ్డాయి. పోటీలో 58-51 పాయింట్లు సాధించి 7 పాయింట్ల తేడాతో హర్యానా గెలుపొందింది. రెండో స్ధానంలో కర్ణాటక, మూడో స్థానంలో తెలంగాణ, నాల్గో స్థానంలో ఢిల్లీ నిలిచాయి. విజేత జట్లకు అతిథులు ట్రోఫీలను అందజేశారు.