దేశ నిర్మాణమంతా క్లాసు రూముల్లోనే పురుడు పోసుకుంటుంది.. ఆ దిశగానే ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు రాష్ట్ర సర్కారు చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టింది. కార్పొరేట్కు దీటుగా సర్కారు బడుల్లో సకల సదుపాయాలను కల్పించి పేద విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన అందించేందుకు ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమాన్ని చేపట్టింది. ఉమ్మడి రాష్ట్రంలో నిరాదరణకు గురైన ప్రభుత్వ పాఠశాలలు.. తెలంగాణ ఏర్పడిన తర్వాత సరికొత్త రూపును సంతరించుకుంటున్నాయి. మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొదటి విడుతలో 758 పాఠశాలను ఎంపిక చేసి, రూ.280 కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ నిధులతో బోర్డుల నుంచి భవనాలకు రంగులు వేసే దాకా అన్ని పనులు చేపట్టారు. శిథిలమైన తరగతి గదుల స్థానంలో కొత్త గదులను నిర్మించారు. తాగునీటి సౌకర్యం కల్పించడంతో పాటు టాయిలెట్లను నిర్మించారు. ప్రస్తుతం మొదటి విడుత పనులన్నీ పూర్తి కావడంతో రేపటి నుంచి ఆయా పాఠశాలలను ప్రారంభించనున్నారు.
నిజామాబాద్, జనవరి 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ప్రభుత్వం రంగంలోని విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు సీఎం కేసీఆర్ నడుం బిగించారు. గత సంత్సరం శ్రీకారం చుట్టిన మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో వందలాది స్కూళ్లను బాగు చేసేందుకు నిర్ణయించడంతో అవన్నీ ఇప్పుడు తళుక్కుమంటున్నా యి. కార్పొరేట్ విద్యాలయాల మాదిరిగా కొంగొత్తగా కనిపిస్తున్నాయి. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ స్కూళ్లంటేనే ఆమడ దూరం పారిపోవాల్సిన పరిస్థితి ఉండేది. మౌలిక సదుపాయాలు అరకొరగా ఉండడంతో విద్యను అభ్యసించేందుకు చాలా మంది వెళ్లేది కాదు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత సర్కారు బడులకు ప్రాధాన్యత పెరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ప్రభుత్వ స్కూళ్లలో సౌకర్యాలు మెరుగు పర్చారు. ఎనిమిదేండ్లుగా విద్యావ్యవస్థను గాడిలో పెట్టేందుకు అనేక చర్యలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది. మరో విప్లవాత్మకమైన నిర్ణయాన్ని మన ఊరు మన బడి రూపంలో అమలు చేయడంతో సామాన్య ప్రజల్లో ఆనందం వెల్లివిరుస్తున్నది. సకల సౌకర్యాలకు నెలవుగా ప్రభుత్వ బడులను తీర్చిదిద్దడంతో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.
నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 1166 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 1039 మండల ప్రజా పరిషత్, జిల్లా పరిషత్ స్కూళ్లు ఉండగా 117 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. ఆయా మండలాల్లో 10 ఆదర్శ పాఠశాలల్లోనూ పిల్లలు విద్యను అభ్యసిస్తున్నారు. ఇవేకాకుండా 25 కేజీబీవీలు ఉన్నాయి. మన ఊరు మన బడిలో భాగంగా 407 స్కూళ్లను ప్రభుత్వం తొలి దశలో ఎంపిక చేసింది. మొదటి విడుతలో మౌలిక వసతుల మెరుగుదలకు ఏకంగా రూ.170కోట్లు నిధు లను కేటాయించింది. మన ఊరు మన బడిలో ఎంపికైన పాఠశాలల్లో 72,801 మంది విద్యాభ్యాసం చేస్తున్నారు. వీరందరికీ మౌలిక వసతుల కల్పనతో మెరుగైన విద్యఅందనున్నది. 2022-23 విద్యా సంవత్సరం ముగింపు నాటికి పనులన్నీ పూర్తి కానున్నాయి. కొత్త విద్యా సంవత్సరంలో సకల వసతులతో పాఠశాలలు సిద్ధం కాబోతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో మొత్తం 1156 ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలున్నాయి. ఇందులో లక్షా 10వేల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. మొదటి విడుతలో ఎంపికైన స్కూళ్లలో వసతుల కల్పన పూర్త యితే దాదాపు 65 శాతం మందికి మేలుజరుగుతుంది.
ప్రభుత్వ విద్యా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కంకణం కట్టుకున్నారు. గడిచిన కాలంలో వినూత్న నిర్ణయాలతో సర్కారు స్కూళ్లకు ఊపిరి పోశారు. మొదటి విడుత మన ఊరు… మన బడి కార్యక్రమంతో కామారెడ్డి జిల్లాలో 185 ప్రాథమిక, 42 ప్రాథమికోన్నత, 124 ఉన్నత పాఠశాలలు కలిపి మొత్తం 351 స్కూళ్లలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. వంద శాతం పూర్తయిన స్కూళ్లలో ఫిబ్రవరి 1న ప్రారంభోత్సవాలు జరుపుతున్నారు. రెండు దశాబ్దాలుగా చాలా మంది గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పిల్లలు ప్రైవేటు స్కూళ్ల వైపు ఆసక్తి చూపుతున్నా రు. ఆంగ్ల మాధ్యమ బోధన, కార్పొరేట్ స్థాయి వసతులు ఉండడం మూలంగా ఖర్చును లెక్క చేయకుండా తల్లిదండ్రులు ప్రభుత్వ బడులను వీడుతున్నారు. తిరిగి పూర్వ వైభవం తీసుకు రావాలనే గొప్ప ఆలోచనతో సీఎం కేసీఆర్ మన ఊరు… మన బడి కార్యక్రమాన్ని తీసుకువచ్చారు. ఆంగ్ల మాధ్యమ బోధ న, మౌలిక సదుపాయాల కల్పనతో ప్రభుత్వ బడులు అద్భుతంగా తీర్చిదిద్దబోతున్నారు. అంగన్వాడీ కేంద్రాల దగ్గరి నుంచి ఉన్నత విద్య వరకు ప్రభుత్వం తీసుకు వచ్చిన మార్పులతో పేద కుటుంబాలకు మేలు చేకూరింది.
పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన పిల్లల విద్యాభ్యాసం తల్లిదండ్రులకు తలకు మించిన భారం అవుతున్నది. కుటుంబం సంపాదనలో 30 నుంచి 40 శాతానికిపైగా పిల్లల విద్యపైనే వెచ్చించాల్సి వస్తున్నది. తద్వారా పేద కుటుంబాల్లో పొదుపు చర్య లు నశిస్తున్నాయి. కరోనా మూలంగా ఈ పరిస్థితి మరింత దయనీయంగా మారిన విషయం తెలిసిందే. పేద కుటుంబాలకు భరోసా కల్పించేందుకు తెలంగాణ సర్కారు వినూత్న మార్పులను తీసుకురావడంతో ప్రభుత్వ స్కూళ్లలో అనేక మార్పులు సంభవించాయి. ఇంగ్లిష్ మీడియం విద్యతో పాటు మధ్యాహ్న భో జనం, ఉచితంగా దుస్తులు, పుస్తకాల పంపిణీతో కొండంత అండ దొరుకుతున్నది. నైపుణ్యం గల టీచర్లతో విద్యాబోధన ఉండడంతో విద్యార్థులకు పైసా ఖర్చు లేకుండానే అద్భుతమైన విద్యాబోధన అందుతున్నది. కరోనా మూలంగా ప్రైవేటును వీడి ప్రభుత్వ బడుల్లో చేరిన వారందరికీ ఇప్పుడు ఫీజుల భారం తప్పింది. మన ఊరు మన బడి, మన బస్తీ మన బడి ద్వారా స్కూళ్లు వైభవంగా ముస్తాబు కావడంతోనూ తల్లిదండ్రుల్లో ధైర్యం కనిపిస్తోంది. నిజామాబాద్ జిల్లాలో 10 మండలాల్లో 16 స్కూళ్లలో మన ఊరు-మనబడి కింద అభివృద్ధికి నోచుకున్న స్కూళ్లను విద్యాశాఖ ద్వారా ఫిబ్రవరి 1న ప్రారంభించబోతున్నారు.
మా బడిని మంచిగా చేశారు. ఇప్పుడు స్కూల్కు రావాలంటే చాలా సంతోషంగా ఉంది. మంచి వాతావరణంలో చదువుకోవడం ఆనందంగా ఉంది. బాత్రూమ్లు, తాగేందుకు నీళ్లు అన్ని ఏర్పాటు జేసిండ్రు.
– మనీషా, 5వ తరగతి, తీర్గల్లి ప్రభుత్వ పాఠశాల, బోధన్
హమారా స్కూల్ బహుత్ అచ్చాహై. ఇత్నా సుందర్ కామ్ కియా. ఇస్కే పైలే కుచ్బీ కామ్ నహీ తే. అబీ సబ్ బన్గయీ. టాయిలెట్స్, హ్యాండ్ వాష్, క్లాస్ రూం అబీ అచ్చాహై. బహుత్ సుందర్ దిఖ్రే.
– తెహ్రీన్, 5వ తరగతి , తీర్గల్లి ప్రభుత్వ పాఠశాల, బోధన్