నందిపేట్: రాష్ట్రంలో మున్నూరు కాపుల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేసి ప్రోత్సహిస్తున్నదని ఆర్మూర్ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. నందిపేట్ మండల కేంద్రంలో నిర్మిస్తున్న మున్నూరుకాపు మండపాన్ని ఆయన బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మండప నిర్మాణానికి అడగగానే ప్రభుత్వం నిధులు కేటాయించి పనులు కొనసాగిస్తున్నదని, త్వరలోనే పనులు పూర్తవుతాయని చెప్పారు.
రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నిర్గాలకు సమ న్యాయంగా నిధులు కేటాయించి వారి సంక్షేమానికి కృషి చేస్తుందని పేర్కొన్నారు. మండప నిర్మాణం వల్ల మండలంలోని మున్నూరుకాపులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని, అన్ని హంగులతో సువిశాలమైన స్థలంలో నిర్మితమవుతున్నదని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో అయిలాపూర్ సొసైటీ చైర్మన్ మీసాల లక్ష్మీనారాయణ, వైస్ ఎంపీపీ దేవేందర్, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు రాముడ పోశెట్టి, కొత్తూర్ రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.