ఎటు చూసినా ఎత్తయిన భవనాలు..అద్దాల మేడలు..భారీ హోర్డింగ్లు..కండ్లు మిరిమిట్లు గొలిపేలా రంగురంగుల బోర్డులు.. ఏ సందు చూసినా కిక్కిరిసిన జనం.. వాహనాన్ని పార్కింగ్ చేయడానికి దొరకని స్థలం.. నడవడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి..ఇదంతా జిల్లా కేంద్రంలోని ఖలీల్వాడి ప్రాంతంలో కనిపిస్తుంది. ఇక్కడ రోజుకో కొత్త దవాఖాన లేదా ల్యాబ్లు వెలుస్తున్నాయి. మల్టీ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ దవాఖానలుగా పేర్కొంటూ పెద్దపెద్ద భవనాలు దర్శనమిస్తున్నాయి. దీంతో వీటికి జిల్లా నలుమూలల నుంచి వచ్చే రోగుల తాకిడి ఎక్కువైంది. కానీ రోగులకు మెరుగైన సేవల సంగతి అటుంచితే .. వారిని నిలువుదోపిడీ చేస్తుండడం శోచనీయం.
దవాఖాన నుంచి మొదలైన దోపిడీ అంబులెన్సు డ్రైవర్ల వరకు పాకిం ది.అనారోగ్యం బారినపడి వచ్చిన వారి బలహీనతను ఆసరాగా చేసుకొని కొన్ని దవాఖానలు అందినకాడికి దోచుకుంటున్నాయి.మల్టీ, సూపర్ స్పెషాలిటీలతో ఆకర్షణ పెద్దపెద్ద భవంతులు నిర్మిస్తూ అందులో వసతులు, పూర్తిస్థాయి వైద్య సిబ్బంది లేకున్నా మల్టీ, సూపర్ స్పెషాలిటీ దవాఖాన అంటూ ఆకర్షిస్తున్నారు. అర్హత లేకున్నా ఇద్దరు, ముగ్గురు వైద్యులను తీసుకువచ్చి మల్టీస్పెషాలిటీ పేరుతో దవాఖాన నిర్వహిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఎక్కడ తమ ప్రాణాల మీదకు వస్తుందోనని హైదరాబాద్కు రిఫర్ చేస్తూ చేతులు దులుపుకోవడం గమనార్హం. సదరు రోగిని హైదరాబాద్కు తరలించేలోపు మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు కోకొల్లలు. కొన్ని దవాఖానలు ఏ రోగమైనా ఇక్కడే నయం చేస్తామని, ఎక్కడకీ వెళ్లనవసరంలేదంటూ ప్రకటనలతో రోగులను మభ్యపెడుతున్నాయి. చివరి నిమిషంలో తమ వద్ద సరైన సదుపాయాలు, స్పెషలిస్టులు లేరంటూ మరో హాస్పిటల్కు పంపించేస్తున్నాయి. దీంతో చేసేదేమీలేక రోగులు, వారి బంధువులు నిస్సహాయంగా ఉండిపోవాల్సి వస్తున్నది. ప్రైవేట్ దవాఖానల్లో ఇంత జరుగుతున్నా పట్టించుకునేవారెవరు.. ఒకవేళ ఫిర్యా దు చేసినా తూతూ మంత్రంగా తనిఖీలు చేపడుతున్నారు. విచారణ చేపట్టి నివేదికలు ఇచ్చినా అవన్నీ చెత్తబుట్టలోకి చేరుతున్నాయి.
మల్టీ స్పెషాలిటీ దవాఖానలో అన్ని సౌకర్యాలు ఉండి, అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉండాలి. అన్ని విభాగాలకు చెందిన వైద్య నిపుణులు ఉండాలి. దవాఖాన బహుళ ఆరోగ్య సంరక్షణ కేంద్రంగా ఉండాలి. కానీ వచ్చిరాని వైద్యంతో రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కొన్ని దవాఖానల్లో వైద్యులు అందుబాటులో లేకపోతే కాంపౌండర్లతోనే వైద్యం చేయిస్తుండడం గమనార్హం.
దవాఖాన ప్రారంభించడానికి ముందుగా ఓ అద్దె భవనం తీసుకుంటున్నారు. అందులో అరకొర వసతులు ఏర్పాటు చేస్తున్నారు. రోగులు వస్తే చాలు చిన్న రోగాన్ని వారికి భూతద్దంలో పెద్దగా చూపించి అందినకాడికి దండుకుంటున్నారు. ఇలా నెలలు, సంవత్సరాల్లో కోట్లకు పడగలెత్తి సొంత భవనం నిర్మించి వాటిని మల్టీ, సూపర్ స్పెషాలిటీ దవాఖానలుగా మారుస్తున్నారు. దవాఖాన నిర్మాణానికి అయిన ఖర్చులన్నీ రోగుల నుంచి రాబడుతున్నారు. అవసరం లేకున్నా ఇన్పేషెంట్గా అడ్మిట్ చేసుకొని రూ.లక్షల్లో బిల్లులు వేస్తున్నారు. అడిగితే ప్రాణాలకు, తమకు సంబంధం లేదంటూ తప్పించుకుంటున్నారు.
కొన్నిసమయాల్లో చోటుచేసుకున్న ఘటనల్లో ప్రైవేట్ దవాఖానల వైఫల్యం స్పష్టంగా కనిపించినా అధికారులు చర్యలు తీసుకోకుండా నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకొంటున్నారు. తనిఖీలో పేరిట డబ్బులు వసూలు చేయడమే తప్ప.. ఇప్పటి వరకు ఏ ఒక్క మల్టీ, సూపర్ స్పెషాలిటీ దవాఖాలనపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేకపోవడం గమనార్హం. జిల్లాలోనే పేరుగాంచిన ప్రైవేట్ దవాఖానల్లో రోజుకో ఘటన చోటుచేసుకుంటున్నా కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారు. పోయిన ప్రాణాలు తిరిగిస్తారా అని మృతుడి బంధువులు నిలదీస్తే .. నోటీసులు జారీ చేశామంటూ అధికారులు సమాధానమిస్తున్నారు.
ప్రైవేట్ దవాఖానలపై ప్రత్యేక నిఘా ఉంచి, ఒక స్పెషల్ కమిటీని ఏర్పాటు చేశాం.ఆ కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటాం. అనుమతులు లేని దవాఖానపై ప్రత్యేక నిఘా ఉంచి, వైద్యశాఖ నిబంధనలు పాటించనివారిపై యాక్షన్ తీసుకుంటాం.