మోర్తాడ్/ నందిపేట్/ నవీపేట/ ముప్కాల్, డిసెంబర్ 3: మోర్తాడ్ మండల కేంద్రంలో ఓటరు నమోదు కేంద్రాలను శనివారం బాల్కొండ నియోజకవర్గ ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్, జడ్పీ సీఈవో గోవింద్ తనిఖీ చేశారు. గాండ్లపేట్ గ్రామంలో ఓటర్లతో మాట్లాడారు. ఓటు హక్కు వినియోగించుకుంటున్నారా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వడ్యాట్ జీపీని తనిఖీ చేశారు. ఆయన వెంట తహసీల్దార్ బావయ్య, ఎంపీడీవో శ్రీనివాస్రెడ్డి, ఎంపీవో శ్రీధర్, డిప్యూటీ తహసీల్దార్ సుజాత ఉన్నారు.
ఓటరుగా పేరు నమోదు చేసుకోవాలని ఆర్మూర్ ఆర్డీవో శ్రీనివాస్ అన్నారు. నందిపేట మండలంలోని ఆయా గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను శనివారం ఆయన పరిశీలించారు. ఈనెల 8వ తేదీ వరకు గడువు ఉందని వివరించారు. సోమవారం నుంచి గురువారం వరకు మూడు రోజుల పాటు బీఎల్వోలు ఇంటింటికీ తిరిగి సర్వే నిర్వహిస్తారని చెప్పారు.
నవీపేట మండలంలోని అనంతగిరి, మోకన్పల్లి తదితర గ్రామాల్లో శనివారం నిర్వహించిన ఓటరు నమోదు కేంద్రాలను తహసీల్దార్ వీర్సింగ్ పరిశీలించారు. 1-1-2023 వరకు 18 ఏండ్లు నిండే ప్రతి యువతీ యువకుడు ఓటరు నమోదు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు రోడ్డ సుధాకర్, రవీందర్రెడ్డి, కార్యదర్శులు పాపేశ్వర్రావు, సాయిలు తదితరులు పాల్గొన్నారు.
ముప్కాల్ మండలంలోని ఆయా గ్రామాల్లో ఓటరు నమోదు కేంద్రాలను తహసీల్దార్ విక్రమ్ పరిశీలించారు. గిర్దావర్ గంగారాం, పంచాయతీ సెక్రెటరీ విజయ్కుమార్, బీఎల్వోలు భాగ్యలక్ష్మి, అమీనా బేగం, అర్చన, కావ్య పాల్గొన్నారు.