ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
కామారెడ్డి జిల్లాకు ప్రాతినిధ్యం కల్పించిన సీఎం కేసీఆర్
కామారెడ్డి, జూన్ 30: తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ అధ్యక్షుడిగా జిల్లా కేంద్రానికి చెందిన ఎంకే ముజీబుద్దీన్ను నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ఉర్దూ అకాడమీ పాలకవర్గాన్ని తెలంగాణ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద్ నదీమ్ ప్రకటించారు. టీఆర్ఎస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న ఎంకే ముజీబుద్దీన్ను తెలంగాణ ఉర్దూ అకాడమీ అధ్యక్షుడిగా నియమించడంతో పాటు మరో నలుగురిని ఎక్స్ ఆఫిషియో సభ్యులుగా నియమించారు. ఎక్స్ ఆపీషియో సభ్యులుగా ప్రిన్సిపల్ సెక్రటకీ మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్, సెక్రటరీ ఫైనాన్స్ డిపార్ట్ మెంట్, కమిషనర్/డైరెక్టర్ మైనార్టీ వెల్ఫేర్, ఉర్దూ అకాడమీ డైరెక్టర్/సెక్రటరీలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. మూడేళ్లపాటు తెలంగాణ ఉర్దూ అకాడమీ పాలకవర్గం పని చేస్తుందని మైనార్టీ శాఖకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న ముజీబుద్దీన్కు నామినేటెడ్ పదవి రావడంతో కామారెడ్డి జిల్లాకు మరింత ప్రాధాన్యత పెంచింది.
పార్టీ కార్యక్రమాల్లో కీలక వ్యక్తిగా గుర్తింపు
ముజీబుద్దీన్కు వివాదరహితుడిగా పేరుంది. విద్యార్థి దశలోనే రాజకీయ ఓనమాలు నేర్చుకున్న ఆయన పార్టీ కోసం కష్టపడి పనిచేస్తారనే గుర్తింపు ఉంది. 2012 కామారెడ్డి నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో గంప గోవర్ధన్ కోసం తీవ్రంగా శ్రమించి ఆయన విజయానికి తోడ్పడంలో కీలకంగా పని చేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పాలుపంచుకున్నారు. అప్పటి నుంచి టీఆర్ఎస్ ముఖ్య నేతలతో సన్నిహిత సంబంధాల కారణంగా తెలంగాణలో మైనార్టీలో రాష్ట్రస్థాయి నేతగా ఎదిగారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మైనార్టీల్లో కీలక నేతగా గుర్తింపు పొందారు. పార్టీలో చేసిన సేవలకు, కార్యక్రమాల నిర్వహణలో కీలకంగా వ్యవహరించినందుకు 2017లో పార్టీ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడిగా పదవిని అప్పగించారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత పార్టీ కార్యక్రమాలు, సభలు, సమావేశాల నిర్వహణలో కీలకంగా పని చేయడంతో పార్టీ అధినేత కేసీఆర్ వద్ద గుర్తింపు పొందారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ముఖ్య అనుచరుడిగా పేరుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్యేలు, పార్టీ నేతలతో సత్సంబంధాలు కలిగి ఉన్నాయి.కామారెడ్డి ప్రాంతంలో అన్ని వర్గాలు, కులాలు, మతాలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండడం ప్లస్ పాయింట్ గా మారింది.