వానకాలం పంట పెట్టుబడి సాయం పంపిణీ ప్రారంభమైంది. ఎకరం లోపు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో ప్రభుత్వం సోమవారం డబ్బులు జమ చేసింది. నేడు రెండెకరాలలోపు వారికి రైతుబంధు సాయం అందించనున్నది. పంటల సాగులో నిమగ్నమైన వేళ.. సర్కారు సాయం అందడంతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతున్నది. సీజన్ ఆరంభంలో ఎరువులు, విత్తనాల కొనుగోలుకు డబ్బులు లేక అన్నదాతలు అప్పులు చేసేవారు. పంట కోసిన తర్వాత వడ్డీ వ్యాపారులు చెప్పిన ధరకే వారికి అమ్మేవారు. అధిక వడ్డీతో పాటు మద్దతు ధర దక్కక రైతులు తీవ్రంగా నష్టపోయే వారు. ఈ పరిస్థితిని గమనించిన సీఎం కేసీఆర్.. పంట పెట్టుబడికి ఇబ్బందులు కావొద్దని రైతుబంధు పథకానికి శ్రీకారం చుట్టారు. ఎరువులు, విత్తనాల కొనుగోలుకు ఆర్థిక సాయం చేస్తూ అప్పుల తిప్పల నుంచి రైతులకు విముక్తి కల్పించారు. ఎకరాకు ఐదు వేల చొప్పున రెండు సీజన్లలో కలిపి రూ.10 వేలు అందిస్తున్న ప్రభుత్వం.. ఇప్పటికే పది విడుతల్లో పెట్టుబడి సాయం పంపిణీ చేసింది. సోమవారం నుంచి 11వ విడుత ప్రారంభమైంది. తొలి రోజు ఉమ్మడి జిల్లాలోని 1.98 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.80 కోట్ల నిధులను జమ చేసింది. ఈ సీజన్కు సంబంధించి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో కలిపి 5.88 లక్షల మందికి పెట్టుబడి సాయం అందించనున్నది.
నిజామాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రైతుబంధు పథకం వచ్చిన తర్వాత కర్షకుల బతుకులు గాడిలో పడుతున్నాయి. గతంలో ప్రభుత్వాలకే పన్నులు రూపంలో రైతులు చెల్లించే పరిస్థితి ఉండేది. కానిప్పుడు సీఎంకేసీఆర్ చొరవతో పెట్టుబడి సాయం కింద నగదు నేరు గా రైతులకే అందిస్తున్నారు. భూమి విస్తీర్ణాన్ని అనుసరించి గుంట భూమి ఉన్న రైతు నుంచి మొదలుకొని పట్టాదారు పేరు మీద ఉన్న భూముల వివరాల మేరకు ఆర్థిక సాయం చేరుతున్నది. ఎకరానికి రూ.5వేలు చొప్పున పట్టాదారు బ్యాంక్ అకౌంట్లలో జమ అవుతున్నది. వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న రైతులను ఆదుకోవాలనే ఏకైక లక్ష్యంతో రూ.వేల కోట్లు వెచ్చించి రైతుబంధు పథకాన్ని రాష్ట్ర సర్కారు అమలు చేస్తుండడంతో సీఎం కేసీఆర్కు రైతన్నలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో మంగళవారం సన్న, చిన్నకారు రైతులకు 2023 వానకాలం రైతుబంధు నగదు జమ అయ్యింది. బ్యాంక్ అకౌంట్లో రైతుబంధు డబ్బులు జమ కావడంతోనే రైతుల మొబైల్ ఫోన్లకు టింగ్ టింగ్మంటూ మెసేజ్లు వచ్చాయి. పెట్టుబడి సాయం చేతికి రావడంతో అనేక చోట్ల కేసీఆర్ చిత్రపటానికి కర్షక లోకం క్షీరాభిషేకాలతో హోరెత్తించారు. కేసీఆర్ చేస్తున్న ఉపకారాన్ని గుర్తుకు చేసుకుంటూ జై కేసీఆర్… జై కిసాన్ అంటూ నినాదాలిస్తూ సంబురం వ్యక్తం చేశారు.
తొలి రోజు రైతుబంధు సాయాన్ని గుంట భూమి నుంచి ఎకరం వరకు విస్తీర్ణంతో పట్టా పాస్పుస్తకాలు కలిగిన వారందరికీ వారి బ్యాంక్ అకౌంట్లలో నగదును ప్రభుత్వం జమ చేసింది. ఇలా రోజువారీగా తక్కువ విస్తీర్ణం నుంచి ఎక్కువ విస్తీర్ణం కలిగిన రైతులకు రైతుబంధును పంపిణీ చేస్తున్నారు. మొదటగా సన్న, చిన్న కారు రైతులకు ప్రాధాన్యతను ఇస్తూ పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో వానాకాలం 2023 సీజన్కు సంబంధించి 2లక్షల 82వేల 44 మందికి రూ.274.15కోట్లు మేర పెట్టుబడి సాయం అందించనున్నారు. ఇందులో భాగంగా సోమవారం నిజామాబాద్లో 93,502 మంది చిన్న కమతాలు కలిగిన రైతులకు రూ.27కోట్ల 15లక్షల 19వేల 845 జమ చేసినట్లు వ్యవసాయాధికారులు తెలిపారు. మొత్తం మంది రైతులకు రైతుబంధు జమ చకచకా జరిగిపోతుందని వారు పేర్కొన్నారు.
గ్రామాల్లో ఇప్పుడు ఎటు చూసినా రైతుల మోములో ఒకటే ఉత్సాహం కనిపిస్తోంది. ఏ ఇంట్లో విన్నా రైతుబంధు ముచ్చటే వినిపిస్తోంది. ఏ రైతును కదిలించినా పెట్టుబడి సాయంపైనే చర్చ జరుగుతోంది. ఊరు ఊరంతా కేసీఆర్ అందిస్తోన్న మరో విడత రైతుబంధు సాయంపైనే జోరుగా చర్చించుకుంటూ ఆపదలో ఆదుకుంటున్న కేసీఆర్ను కొనియాడుతున్నారు. ఇచ్చిన మాట ప్రకారం నిరంతరాయంగా సాగుకు పెట్టుబడిని అందిస్తూ అన్నదాతలకు సీఎం కేసీఆర్ అండగా నిలుస్తున్నారు. గతమంతా కన్నీళ్ల పర్యంతమైన సాగును సంబురంగా మారుస్తున్నారు. గుంట భూమి ఉన్న రైతు దగ్గరి నుంచి పట్టాదారు పాసుపుస్తకం ఉన్న ప్రతి ఒక్కరికీ హద్దుల్లేకుండా ఎకరాకు రూ.5వేలు చొప్పున రైతుబంధు నగదును జమ చేస్తున్నారు. అప్పులు, వడ్డీలు, ఉద్దెరల వంటి ఇబ్బందులకు శాశ్వతంగా దూరమై అన్నదాతలంతా తమ కాళ్లపై తాము నిలబడి వ్యవసాయ భూములను సాగు చేసుకుంటున్నారు. జూన్ 1 నుంచి వానాకాలం సీజన్ ప్రారంభమైనప్పటికీ వర్షాభావ పరిస్థితులు తలెత్తాయి. మూడు రోజులుగా కాసింత ఆశాజనకమైన పరిస్థితులు కనిపిస్తుండడంతో రైతులంతా హుషారుగా సాగుకు సిద్ధం అవుతున్నారు. ఇప్పుడిప్పుడే పుటం ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. వర్షాలు సైతం కురుస్తుండడంతో రైతులంతా పొలం పనుల్లో బిజీబిజీగా గడుపుతున్న వేళ సరైన సమయంలోనే రైతుబంధు డబ్బులు సైతం విడుదల కావడం విశేషం.
కామారెడ్డి, జూన్ 26 (నమస్తే తెలంగాణ) : కామారెడ్డి జిల్లాలో ఎకరం లోపు రైతులు 1.05లక్షల మంది ఉండగా వారి ఖాతాల్లో రూ.52.50 కోట్లను జమ చేశారు. ఆ తర్వాత రెండు ఎకరా లకు పైగా ఉన్న రైతులకు పెట్టుబడి సాయాన్ని వారి ఖాతాల్లో జమ చేయనున్నారు. యాసంగి సీజన్లో 2,79,384 మంది రైతుల ఖాతాల్లో 252.76 కోట్లు జమ చేయగా, ప్ర స్తుతం వానాకాలం సీజన్లో 3,05,994 మంది రైతుల ఖాతాల్లో రూ.280 కోట్ల పెట్టుబడి సాయాన్ని వేయనున్నారు. యాసంగితో పోల్చితే 20 వేల మంది కి పైగా రైతులు కొత్తగా పెట్టుబడి సాయాన్ని పొందనున్నారు. 2,480 మంది రైతులు చనిపోగా వారి ఖాతాలను నిలిపివేశారు.
జిల్లాలో ఐదేండ్లలో రైతుల ఖాతాల్లో పది సీజన్లకు గాను రూ.2,289 కోట్లను ప్రభుత్వం జమ చేసింది. 2018లో వానాకాలం సీజన్లో జిల్లాలోని 2,07,385 రైతుల ఖాతాల్లో రూ.177.38 కోట్లను జమ చేయగా, 2022 యాసంగిలో 2,79,384 మంది రైతుల ఖాతాల్లో 252.76 కోట్లు జమ చేయడం గమనార్హం. ఏటేటా రైతుల సంఖ్య పెరగడంతో పాటు పెట్టుబడి సహాయం పెరుగుతున్నది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకంతో వ్యవసాయ రంగం దినదినాభివృద్ధి చెందుతున్నది.
రైతు బంధు ద్వారా వానాకాలం సీజన్ కోసం ప్రభుత్వం పెట్టుబడి సాయాన్ని విడుదల చేసింది. సోమవారం జిల్లా వ్యాప్తంగా ఎకరం భూమి గల రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశారు. రైతులకు ఈ పెట్టుబడి సహాయం ఎంతో ఉపయోగపడుతున్నది. రైతులు ఈ డబ్బును సద్వినియోగం చేసుకొని పంటలను సాగు చేసుకోవాలి.
-అంజిరెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు, కామారెడ్డి జిల్లా
వానాకాలం సీజన్లో జిల్లాలోని 3.05 లక్షల రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయాన్ని వేయనున్నారు. సోమవారం నుంచి డబ్బులు వేసే ప్రక్రియ ప్రారంభమైంది. కొత్తగా వ్యవసాయ భూమిని కొన్నవారికి రైతు బంధు పథకం అమలు చేస్తున్నాం. రైతులు తమ పేర్లను మండల వ్యవసాయ అధికారులు, లేదా క్షేత్ర స్థాయి లో వ్యవసాయ విస్తీర్ణ అధికారులకు అందజేయాలి.
-వీరస్వామి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, కామారెడ్డి
బిచ్కుంద : ప్రతి సీజన్ మాదిరిగానే ఈ సారి వానాకాలం సీజన్కు సంబంధించిన రైతుబంధు డబ్బులు సమయానికి ఖాతాలో జమ అయ్యాయి. ఈ డబ్బులతో విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసుకుంటాను. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి పెట్టుబడి పైసల్ ఇస్తున్నది. ఇతర రాష్ర్టాల రైతులు మన రాష్ట్రంలో భూములు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.
-శంకర్, రైతు, మిషన్ కల్లాలి
ఎల్లారెడ్డి : మన ప్రభుత్వం అంటే గిట్లనే ఉంటది మరి. తెలంగాణ వచ్చినంకనే రైతులు ప్రభుత్వానికి కనిపిస్తున్నరు. అంతకు ముందు ఎవరూ పట్టించుకోలేదు. చిన్న రైతులకు రైతు బంధు పెద్ద సహాయం వంటిది. వానలు పడంగనే పంటల పెట్టుబడికి అవసరమైన విత్తనాలు, ఎరువులు కొనుక్కునేందుకు సర్కారు పైసలు ఇస్తున్నది. రైతు సల్లంగుంటేనే రాజ్యం సల్లంగ ఉంటది అనే మాట వాస్తవం. ఇప్పుడు అదే జరుగుతుంది. దేశంలో ఎక్కడా లేనిది ఇక్కడ జరుగుతున్నది అంటే అది కేవలం రైతుల గోస తెలిసిన ముఖ్యమంత్రి ఉండడమే దీనికి కారణం. ఆయన సల్లంగా ఉండాలే…మేము కష్టపడి బంగారు పంటలు పండించాలి.
-నర్సింలు, రైతు, ఎల్లారెడ్డి
పెద్దకొడప్గల్ : సీఎం కేసీఆర్ రైతులకు దేవుడు. రెండు పంటల సాగు కు ఎకరానికి రూ.10వేలు బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్నారు. నాకు ఎకరం పొలం ఉంది. ఈ రోజే నా బ్యాంకు ఖాతాలో రూ. 5 వేలు జమ అయ్యాయి. పెట్టుబడి కోసం అప్పులు చేయకుండా సాగు చేసుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్కు ఎప్పటికీ రుణపడి ఉంటాం.
గైని శంకర్, కాస్లాబాద్, పెద్దకొడప్గల్
ఎకరం పొలానికి సంబంధించిన రైతుబంధు డబ్బులు రూ.5 వేలు ఖాతాలో జమ అయ్యాయి. సమయానికి పెట్టుబడి సహాయం అందడంతో అ ప్పులు చేయకుండా విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేస్తు న్నాం. గతంలో అప్పులు చేసి పెట్టుబడులు పెట్టుకునేవాళ్లం. ఇప్పడు రైతుబంధుతో రంది లేకుండా పోయింది. సర్కార్కు రుణపడి ఉంటాం.
-సాకలి సాయిలు, పెద్దకొడప్గల్
తొమ్మిదేండ్ల సీఎం కేసీఆర్ పాలనలో రైతులకు చేకూరిన లాభం అంతా ఇంతా కాదు. క్లిష్టమైన అనేక సమస్యలకు సీఎం తనదైన శైలిలో చెక్ పెట్టి రైతులకు లాభం చేస్తున్నారు. గతంలో వ్యవసాయ భూముల లెక్కలు తారుమారుగా ఉండేది. భూమి తన కబ్జాలో ఉన్నప్పటికీ రైతులకు ప్రభుత్వ సాయం అందేది కాదు. భూ రికార్డుల ప్రక్షాళన ద్వారా చిక్కుముడులతో కూడిన సమస్యలను తీర్చి రైతుకు భారీ ఊరటను అందించారు. భూముల కొనుగోలు, అమ్మకాల్లో రైతులకు ఎదురవుతున్న రిజిస్ట్రేషన్ తంతులో అవినీతికి చరమగీతం పాడారు. నూతన వ్యవస్థను ధరణి రూపంలో తీసుకు వచ్చారు. భూకబ్జాదారుల ప్రమేయం తగ్గించి అసలైన వ్యక్తులకే పట్టాలు దక్కే విధంగా, దొంగ రిజిస్ట్రేషన్లు బంద్ చేసేలా ధరణి సేవలను సీఎం కేసీఆర్ అందుబాటులోకి తెచ్చారు. పారదర్శకమైన ధరణి పోర్టల్ ఆధారంగానే రైతుబంధు డబ్బులు క్రమపద్ధతిలో అర్హులకు నేరుగా వారి అకౌంట్లోనే జమ అవుతుండడం విశేషం.
మాచారెడ్డి : పంట పెట్టుబడి కోసం ప్రభుత్వం నా బ్యాంక్ అకౌంట్లో సోమవారం డబ్బులు జమచేసింది. వెంటనే నా ఫోన్కు మెసేజ్ వచ్చింది. పంటపెట్టుబడి కోసం చేయి చాపకూడదని సర్కారు ఎంతో మేలు చేస్తున్నది. అడగకుండానే సమయానికి డబ్బులు ఇస్తున్న సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు.
-బట్ట రమేశ్,అక్కాపూర్,మాచారెడ్డి మండలం.
మాచారెడ్డి : పంట పెట్టుబడికి సమయానికి రైతుబంధు వస్తుంది. పెట్టుబడి కోసం అప్పులు చేసే రో జులు పోయినవి. సమయానికి రైతుబంధు డబ్బులు ఇస్తూ మమ్మల్ని అదుకుంటున్న సీఎం కేసీఆర్ కు రుణపడి ఉంటాం.
-పున్న నర్సింలు ,
అక్కాపూర్,మాచారెడ్డి మండలం.
సీఎం కేసీఆర్ చెప్పినట్టే వ్యవసాయానికి పెట్టుబడులు అందిస్తున్నా రు. ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి రైతులకు పెట్టుబడి సహాయం అందించలేదు. పెట్టుబడి సాయం అందడంతో అప్పులు లేకుండా నిమ్మలంగా వ్యవసాయం చేస్తున్నాం.
-నాగయ్య, కాస్లాబాద్
రెండు రోజుల నుంచి వానలు పడుతున్నాయి. దుక్కులు పొతం జేస్తున్నమోలేదో అప్పుడే రైతుబంధు పైసలు గూడా ఖాతాల జమ అయినట్లు మెసేజ్ వచ్చింది. నాకు 21 గుంటల భూమి ఉన్నది. రూ.2625 అచ్చినయ్. రైతులకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తేనే రాష్ట్రం క్షేమంగా ఉంటది. ఇలాంటి గవర్నమెంటు ఉంటేనే రైతులు ధైర్యంగా పంటల సాగు కోసం పనిజేస్తరు.
జక్కుల రమేశ్, రైతు, ఎల్లారెడ్డి