ఖలీల్వాడి, మార్చి 2: మోదీ ప్రభుత్వం అడ్డగోలుగా వంటగ్యాస్ ధరలను పెంచి సామాన్యుల నడ్డివిరుస్తోందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి విమర్శించారు. దరిద్రపు బీజేపీ పాలనతో మళ్లీ కట్టెల పొయ్యి వైపు వెళ్లాల్సిన పరిస్థితి దాపురించిందని, ఆడబిడ్డల ఉసురుపోసుకుంటున్న మోదీ సర్కాను సాగనంపాలని పిలుపునిచ్చారు.
కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్ ధరలను నిరసిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ధర్నాచౌక్ వద్ద గురువారం ధర్నా నిర్వహించగా..మంత్రి వేముల, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా, జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు, మేయర్ దండు నీతూ కిరణ్, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఆందోళనలో భాగంగా వంటా-వార్పు నిర్వహించారు. అనంతరం మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా మంత్రి వేముల మాట్లాడుతూ.. కేంద్రం పేదోళ్ల కడుపుకొట్టి పెద్దోళ్లకు దోచిపెడుతున్నదని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేస్తుంటే.. మోదీ ప్రభుత్వం అడ్డగోలుగా ధరలను పెంచుతూ ప్రతి ఇంటి నుంచి నెలకు రూ. నాలుగు వేలు దోచుకుంటుందన్నారు.
కేంద్ర మంత్రి ఎక్కడ?
2011లో కాంగ్రెస్ హయాంలో సిలిండర్పై రూ.50 పెంచితే అప్పటి బీజేపీ నాయకురాలు, ప్రస్తుత కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అరిచి గగ్గోలు పెట్టారని గుర్తుచేశారు. ఇప్పుడు ఎక్కడ దాక్కున్నారని, మోదీ ప్రభుత్వం 13 సార్లు (రూ.750) సిలిండర్ ధర పెంచిందని, దీనిపై ప్రజలకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. పెంచిన ధరలను తగ్గించాలని పేదింటి మహిళల తరఫున స్మృతి ఇరానీ కేంద్రాన్ని డిమాండ్ చేయాలని సూచించారు. సిలిండర్ ధర పెంపు పేద కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నా రు. రూ.35 వేల కోట్ల సబ్సిడీ ఇస్తే గ్యాస్ ధర రూ. 450లకే వస్తుందని తెలిపారు. కానీ మోదీ ప్రభుత్వం సబ్సిడీ ఎత్తివేసి పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడంతో నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని అన్నారు.
వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెడుతామంటూ దేశానికి అన్నం పెట్టే రైతన్నలను ఆగం చేస్తున్నారని ఆగ్ర హం వ్యక్తం చేశారు. రైతులు పండించిన పంటను కొనుగోలు చేయడంలేదని, మద్దతు ధర కూడా ఇవ్వడంలేదన్నారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలను తెలంగాణ సమాజం గమనిస్తుందని తెలిపారు. పెంచిన ధరలను తగ్గించకుంటే మహిళల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు.ప్రధాని మోదీ తన గుజరాత్ దోస్తులకు రూ.10 లక్షల కోట్ల బ్యాంకు రుణాలు మాఫీ చేశారని పేర్కొన్నారు. అదానీకి మాఫీ చేసిన డబ్బులను సబ్సిడీగా ఇచ్చినా దేశంలో సిలిండర్ 450 రూపాయలకే వస్తుందన్నారు.
ప్రశ్నిస్తే సీబీఐ, ఈడీ దాడులా!
మోదీ అవినీతిని ప్రశ్నిస్తున్న వారిపై సీబీఐ, ఈడీ దాడులు చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ ధైర్యంగా ప్రశ్నిస్తున్నందుకే బీఆర్ఎస్ నేతలను వేధింపులకు గురి చేస్తున్నారని అన్నారు. కేసీఆర్ కూతురు కవితను ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. నిజామాబాద్ అక్కాచెల్లెళ్లు బీజేపీకి బుద్ధి చెబుతారన్నారు. పేదలను అన్ని విధాలా వేధిస్తున్న బీజేపీని, ఆ పార్టీ నాయకులను ఎక్కడికక్కడ నిలదీయాలని పిలుపునిచ్చారు. నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా మాజీ అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, పార్టీ నగర అధ్యక్ష, కార్యదర్శలు సిర్పరాజు, ఎనుగందుల మురళి, సుజిత్ సింగ్ ఠాగూర్, సత్యప్రకాశ్, దండు శేఖర్, కార్పొరేటర్లు పాల్గొన్నారు.
పేదలపై భారం మోపింది..
నిత్యావసర వస్తువులు, పెట్రోలు, డీజిల్ ధరలతోపాటు వంట గ్యాస్ ధరలను పెంచి మోదీ ప్రభుత్వం సామాన్యుల నడ్డి విరిచింది. కాంగ్రెస్ పార్టీ హయాంలో సిలిండర్ ధర రూ. 50 పెంచినప్పుడు రోడ్డెక్కి ధర్నా చేసిన ప్రస్తుత కేంద్ర మంత్రి స్మృతి ఇరాని.. ఇప్పుడు రూ.750 పెంచినందుకు మహిళలు ఆందోళన చేస్తుంటే ఎక్కడ ఉన్నారు. ప్రభుత్వాలను కూల్చడంలో ఉన్న శ్రద్ధ ప్రజల సమస్యలను పరిష్కరించడంలో లేదు. ప్రశ్నించే గొంతులను సీబీఐ, ఈడీల పేరుతో వేధిస్తున్నారు.
– బిగాల గణేశ్గుప్తా,అర్బన్ ఎమ్మెల్యే
కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తున్న కేంద్రం
మోదీ ప్రభుత్వం ప్రజల కష్టాలను పట్టించుకోకుండా కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తున్నది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చాక వంట గ్యాస్ ధరను 13 సార్లు పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్నది. ఇప్పటివరకు రూ.750 పెంచి పేదలపై తీవ్ర ఆర్థిక భారం మోపింది.
– దాదన్నగారి విఠల్రావు, నిజామాబాద్ జడ్పీ చైర్మన్
కట్టెల పొయ్యి దిక్కయ్యేలా ఉంది
బీజేపీ ప్రభుత్వం నిరుపేదలకు కట్టెల పొయ్యి దిక్కయ్యేలా చేస్తున్నది. ప్రజలపై కక్ష గట్టినట్లు 13 సార్లు వంటగ్యాస్ ధరలను పెంచడం దారుణం. ఇలా అయితే సామాన్యులు బతకడం చాలా కష్టం. గ్యాస్ కొనాలంటేనే భయపడే రోజులు వచ్చాయి.
– నీతూ కిరణ్, నగర మేయర్