దేశంలోనే ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఇటువంటి పథకాలు మరెక్కడా అమలు కావడం లేదని.. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఇలాంటి పథకాలు ఉంటే నిరూపించాలని అన్ని పార్టీలకు సవాల్ విసిరారు. నాగిరెడ్డిపేట మండలంలోని తాండూర్ గ్రామంలో బుధవారం ఏర్పాటు చేసిన కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని మాట్లాడారు. రాష్ర్టానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలపై కేంద్ర ప్రభుత్వం పగబట్టిందన్నారు.
కక్షపూరితంగా ఈడీ, ఐటీ దాడులు చేయిస్తున్నదని.. అయినా భయపడేది లేదని స్పష్టం చేశారు. బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా తిప్పికొడతామన్నారు. టీఆర్ఎస్(బీఆర్ఎస్)కు ఎల్లారెడ్డి నియోజకవర్గం కంచుకోట అని.. పార్టీ ఆవిర్భావం నుంచి వెన్నుదన్నుగా నిలిచిందన్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు అతి సమీపంలో ఉన్న పోచారం ప్రాజెక్టు, ఏడుపాయల దుర్గమ్మ, త్రిలింగేశ్వర ఆలయం కలిపి పర్యాటక ప్రదేశంగా ఏర్పాటు చేయడానికి అవసరమైన నిధులు మంజూరు చేస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ప్రకటించారు.
-ఎల్లారెడ్డి, నవంబర్ 23
ఎల్లారెడ్డి, నవంబర్ 23 : ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని, ఆ రకంగా ఆలోచించే ప్రాజెక్టులను అభివృద్ధి చేశారని, రాజకీయాలను మాత్రం ఆలోచించలేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు ఏ రాష్ట్రంలోనూ అమలు కావడం లేదని, బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఇలాంటి సంక్షేమ పథకాలు ఉంటే నిరూపించాలని సవాల్ విసిరారు. కేంద్రంలోని బీజేపీ ఈడీ, సీబీఐ, ఐటీ వంటి దర్యాప్తు సంస్థలను తమపై ఉసిగొల్పినా భయపడే ప్రసక్తే లేదని, నిలబడి కొట్లాడుతామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు.
కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని తాం డూర్ గ్రామంలో బుధవారం ఏర్పాటు చేసిన కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. తెలంగాణలో బీజేపీకి బ లం లేకపోవడం తో… రాంనామ్ జప్నా.. పరాయి లీడర్ అప్నా అనే రీతిలో వ్యవహరిస్తున్నదన్నారు. ప్రజల గుండెల్లో ఉంటేనే అధికారం వస్తుందని, నాయకులు, ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి అధికారంలోకి రావాలని అనుకోవడం వారి మూర్ఖత్వమన్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో మాత్రమే బీడీ కార్మికులకు రూ.2016 పింఛన్ ఇస్తున్నారని, కానీ ఆ రూ.2016 మోదీ ఇస్తున్నట్లు వాట్సాప్లో బీజేపీ ప్రచారం చేస్తున్నదని, అలాంటి దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని టీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో గిరిజనుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా పదిశాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నదని, తండాలను పంచాయతీలుగా మార్చిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదన్నారు. సేవాలాల్ జయంతిని అధికారికంగా నిర్వహిస్తూ జిల్లాకు రూ.10లక్షలు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు.
టీఆర్ఎస్ పార్టీ స్థాపించిన 2001 నుంచి ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలు అండగా ఉన్నారని, అప్పటి స్థానిక సంస్థల ఎన్నికల్లో నియోజకవర్గంలో నలుగురు జడ్పీటీసీలను గెలిపించిన ఘనత ప్రజలదని వివరించారు. 2004 నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులు ఎవరైనా నియోజకవర్గ ఓటర్లంతా కేసీఆర్ వెంటే ఉన్నారని, ఇప్పుడు కూడా ఉంటారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో రెండు లక్షల ఓటర్లుంటే.. అందులో నాల్గోవంతు సుమారు 50వేల మంది టీఆర్ఎస్ కార్యకర్తలేనని చెప్పారు.
ఒక్కో కార్యకర్త ఒక్కో ఇంటికి వెళ్లి టీఆర్ఎస్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను వివరిస్తే సురేందర్ మళ్లీ భారీ మెజార్టీతో గెలుస్తారని చెప్పారు. సీఎం కేసీఆర్ ఆలోచన, మనస్సు ఎప్పుడూ తెలంగాణ ప్రజలతోనే నిండి ఉంటుందని, గ్రామంలోని బూత్ కమిటీలను క్రియాశీలకం చేసుకోవాలని గ్రామశాఖ అధ్యక్షులకు సూచించారు. సర్పంచులు, ఎంపీటీసీలు ప్రభుత్వ పనులు చేయాలని, అదే సమయంలో పార్టీ పనులను కూడా చేయాలన్నారు. పార్టీ అధికారంలో ఉంటేనే కార్యకర్తలకు పదవులు వస్తాయని, ఏ చిన్న ఆపదకైనా పార్టీ అండగా నిలబడుతుందని భరోసా ఇచ్చారు.
రాష్ట్రంలో దాదాపు 13వేల గ్రామ పంచాయతీలుంటే అందులో 95శాతం సర్పంచులు, ఎంపీటీసీలు టీఆర్ఎస్ కార్యకర్తలే ఉన్నారని తెలిపారు. ప్రజలతో నిలబడి పనిచేస్తే వారి ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుందని రుజువైందన్నారు. జడ్పీటీసీ మనోహర్ రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గుర్రాల సిద్ధ్దయ్య, సహకార సంఘాల చైర్మన్లు గంగారెడ్డి, నర్సింహులు, ఎల్లా రెడ్డి ఏఎంసీ మాజీ చైర్మన్ ప్రతాప్రెడ్డి, లింగంపేట ఎం పీపీ గరీబున్నీసా బేగం, జడ్పీటీసీ సభ్యురాలు శ్రీలత, ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ సత్యం పాల్గొన్నారు.
రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు అతి సమీపంలో ఉన్న పోచారం ప్రాజెక్టు, ఏడుపాయల దుర్గమ్మ, త్రిలింగేశ్వర ఆలయాలను కలిపి పర్యాటక ప్రదేశంగా ఏర్పాటు చేసేందుకు అవసరమైన నిధులు మంజూరు చేస్తామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. నాగిరెడ్డిపేట మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి అంబులెన్స్ మంజూరు చేస్తున్నామన్నారు. ఎంపీ బీబీపాటిల్,ఎమ్మెల్యే జాజాల సురేందర్, ప్రతాప్ రెడ్డి, నాయకులు సంతోష్ రెడ్డి, ఉషా గౌడ్, కుడుముల సత్యం, సత్యం రావు, శివాజీరావు, తానాజీరావు, ముకుంద్ రావు, కపిల్ రెడ్డి, జలంధర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, దశరథ్ నాయక్, శుభాకర్ రెడ్డి, సునీతా రెడ్డి పాల్గొన్నారు.
నాగిరెడ్డిపేట, నవంబర్ 23: ఎనిమిదేండ్లలో రాష్ర్టాన్ని అభివృద్ధిలో నెంబర్వన్గా సీఎం కేసీఆర్ తీర్చిదిద్దారని, ఓర్వలేకే బీజేపీ నాయకులు కేసీఆర్ కుటుంబంపై విమర్శలు చేస్తున్నారని ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. స్వరాష్ట్రంలోనే ఉద్యోగులు సొంత జిల్లాల్లో విధులు నిర్వర్తిస్తున్నారన్నారు. గిరిజన తండాలను పంచాయతీలుగా మార్చడంతో స్వపరిపాలన చేసుకునే అవకాశం కలిగిందన్నారు. గ్రామాలతో సమానంగా తండాలను అభివృద్ధి చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
ఎమ్మెల్యే జాజాల సురేందర్
రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం పని చేస్తున్నదని ఎంపీ బీబీపాటిల్ అన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలో లేనివిధంగా సంక్షేమ పథకాలను అమలు చేసి రాష్ర్టాన్ని అభివృద్ది పథంలో నడిపిస్తున్నదన్నారు. తెలంగాణ ప్రజలంతా ఆనందంగా ఉన్నారని అన్నారు. రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా తీర్చిద్దిడమే కేసీఆర్ లక్ష్యమన్నారు. రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్ సరఫరా తదితర పథకాలతో రైతులను ఆదుకుంటున్నట్లు తెలిపారు.
ఎంపీ బీబీపాటిల్