గులాబీ వనమైన ఇందూరు గడ్డ.. అనంత జనవాహినితో పులకించి పోయింది. మహిళల దశాబ్దాల కలను సాకారం చేసిన కల్వకుంట్ల కవిత పోరాట పటిమకు ముచ్చటపడి నగరం నడిచొచ్చింది. ఎమ్మెల్సీకి ఎదురేగి ఘన స్వాగతం పలికింది. జై కేసీఆర్.. జై కవితక్క అంటూ దిక్కులు పిక్కటిల్లేలా గొంతెత్తి గర్జించింది. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందిన తర్వాత కవిత తొలిసారిగా నిజామాబాద్కు సోమవారం వచ్చిన సందర్భంగా నిర్వహించిన కృతజ్ఞతా ర్యాలీ అట్టహాసంగా సాగింది. ఐటీఐ కాలేజీ నుంచి పాత కలెక్టరేట్ వరకు సాగిన ర్యాలీకి జనం పోటెత్తారు. బీఆర్ఎస్ శ్రేణులు, మహిళలు ఎమ్మెల్సీకి ఘనంగా స్వాగతం పలికారు. ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తాతో కలిసి ప్రజలకు అభివాదం చేస్తూ కవిత ముందుకు కదిలారు. కలెక్టరేట్ గ్రౌండ్లో ప్రజలనుద్దేశించి మాట్లాడిన ఆమె.. బీజేపీ, కాంగ్రెస్లపై నిప్పులు చెరిగారు. మరోసారి బీఆర్ఎస్ సర్కారే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
– నిజామాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) / ఖలీల్వాడి
నిజామాబాద్ నగరం గులాబీమయమైంది. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం తర్వాత తొలిసారిగా సోమవారం నగరానికి వచ్చిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మహిళలు, భారత జాగృతి శ్రేణులు, బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. భారీ గజమాలతో సత్కరించడంతోపాటు అడుగడుగునా గులాబీ పూలవర్షంతో అభిమానాన్ని చాటుకున్నారు. తండోపతండాలుగా తరలివచ్చిన బీఆర్ఎస్ నాయకులతో రోడ్లన్నీ కిక్కిరిశాయి. ఐటీఐ కళాశాల నుంచి నిర్వహించిన ర్యాలీ పాత కలెక్టరేట్ మైదానం వరకు అట్టహాసంగా జరిగింది. ప్రజలకు అభివాదం చేస్తూ ఎమ్మెల్సీ కవితతోపాటు ఎమ్మెల్యే గణేశ్ గుప్తా, జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు, మేయర్ నీతూ కిరణ్, టీఎస్డబ్ల్యూఎఫ్సీ చైర్పర్సన్ ఆకుల లలిత ముందుకు కదిలారు. దారిపొడవునా ప్రజలంతా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులను ఆహ్వానించడంతోపాటు అభినందనలు తెలిపారు. శ్రేణులను ఉత్సాహపరుస్తూ జై కేసీఆర్… జై బీఆర్ఎస్ నినాదాలు చేస్తూ పాదయాత్రగా పాత కలెక్టరేట్ వరకు వేలాది మంది చేరుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన కృతజ్ఞతా ర్యాలీతో ప్రతిపక్ష పార్టీల్లో గుబులు మొదలైంది. ఎన్నికల ముందు నిర్వహించిన భారీ ప్రదర్శనతో బీఆర్ఎస్ మరోసారి తమ సత్తాను చాటినట్లు అయ్యింది.
తెలంగాణ గడ్డపై కాంగ్రెస్కు స్థానం లేదు..
అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో తప్పక బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెప్పారు. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఈ విషయంలో ఎవరికీ అనుమానం లేదన్నారు. తెలంగాణలో అధికారంలోకి వస్తామంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కవిత విస్మయం వ్యక్తంచేశారు. తెలంగాణకు అడుగడుగునా అన్యాయం చేసి, ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురిచేసిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో గెలుస్తామంటే ఏడ్వాలో, నవ్వాలో అర్థం కావడం లేదని కవిత అన్నారు. ఎన్నికల తర్వాత ఫలితాల రోజున రాహుల్ గాంధీని తెలంగాణకు ఆహ్వానిస్తున్నట్లుగా చెప్పారు. చేసిన అభివృద్ధే తమను తిరిగి అధికారంలో నిలబెడుతుందన్నారు. తెలంగాణ అభివృద్ధి ఏకంగా యావత్ దేశానికి రోల్ మోడల్గా నిలుస్తున్నదన్నారు. చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పొందిన ఘనత ముమ్మాటికీ బీఆర్ఎస్ పార్టీకే దక్కుతుందని కవిత చెప్పారు. ఈ విషయంపై బీఆర్ఎస్ పార్టీ ఆది నుంచి పోరాటం చేసిందన్నారు.
సీఎం కేసీఆర్ సైతం అనేకమార్లు కేంద్రంపై ఒత్తిడి తెచ్చారని గుర్తుచేశారు. ప్రపంచంలో మిగిలిన దేశాల సరసన తలెత్తుకొని భారత్ నిలబడిందంటే అందుకు బీఆర్ఎస్ పార్టీ కారణమని చెప్పారు. 2014, 2019లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ మహిళా బిల్లుపై ఊసెత్తలేదన్నారు. ఆ అంశాన్ని పూర్తిగా మర్చిపోయిన సందర్భంలో బీఆర్ఎస్ చేసిన పోరాటాల ఫలితంగానే పార్లమెంట్లో చట్టరూపం దాల్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వం మొద్దు నిద్రను లేపడానికి బీఆర్ఎస్ పార్టీ ఐక్యంగా ఉద్యమించిందని చెప్పారు. అందులో భాగంగానే మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్లో ఆమోదమైందన్నారు. ఈ బిల్లుకు కాంగ్రెస్ పార్టీ తప్పనిసరి పరిస్థితుల్లో మద్దతు ఇవ్వాల్సి వచ్చిందని వివరించారు. ఇప్పుడు ఓబీసీ కోటా కోసం కాంగ్రెస్ చేస్తున్న డిమాండ్ ఒక విడ్డూరకరమైనదిగా కవిత చెప్పారు. బీజేపీ కన్నా ముందు కాంగ్రెస్ పార్టీయే కేంద్రంలో అధికారం చలాయించి ఇప్పుడు ఓబీసీ కోటాపై మాట్లాడడాన్ని ప్రజలంతా గమనిస్తున్నారని చెప్పారు. వాళ్లు అధికారంలో లేనప్పుడు ఈ సోయి ఎటు పోయిందన్నారు. అధికారం కోల్పోతేనే కాంగ్రెస్ పార్టీకి బీసీలు గుర్తుకు వసారని చెప్పారు. సోనియా గాంధీ ఏకంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తన చిరకాల కల అంటూ చెప్పడాన్ని తనదైన శైలిలో కవిత కొట్టిపారేశారు. నేను ఒక్కటే అడుగుతున్నా. ప్రజల కోసం కల కనాలంటే అభివృద్ధిని కోరుకోవాలి. అలాంటి అభివృద్ధి గడిచిన కాలంలో తెలంగాణలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో సాధ్యమైందని చెప్పారు.
కేసీఆర్తోనే మహిళా అభ్యుదయం
రాష్ట్రంలో కేసీఆర్ పరిపాలనలో మహిళా అభ్యుదయం సాధ్యమైందన్నారు. రాబోయే రోజుల్లో దేశమంతటా ఈ తీరుగా కార్యక్రమాలు విస్తరిస్తామని కవిత చెప్పారు.గతంలో మస్త్ మందిని చూసినాం.. వచ్చిండ్రు, పోయిండ్రు.. మనసు పెట్టి ఆలోచించే వారు ఎంత మంది ఉన్నారని కవిత అన్నారు. పింఛన్ తీసుకునే వారికి కేసీఆర్ కొడుకులా, కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు మేనమామలా, ఒంటరి మహిళలకు అన్నలా కేసీఆర్ ఆదుకుంటున్నారని చెప్పారు. మహిళా అభ్యుదయం అచ్చంగా తెలంగాణలోనే అమలవుతున్నదని, దేశంలో మరెక్కడా ఇలాంటి పాలన లేదన్నారు. అలాంటి ప్రభుత్వాన్ని తెలంగాణ ఆడబిడ్డలు కాపాడుకోవాలని కోరారు. మార్కెట్ కమిటీల్లో ఎన్నడూ మహిళలకు పదవులు లేవని కేసీఆర్ మాత్రం పదవులు కట్టబెట్టారని చెప్పారు. రైతుబంధు సమితుల్లోనూ పదవులు ఇచ్చినట్లుగా గుర్తుచేశారు. నిజామాబాద్లో మంజుల అనే గిరిజన మహిళను రైతుబంధు సమితి అధ్యక్షురాలిని చేసినట్లు చెప్పారు. ఎన్నడూ మహిళలకు దొరకని గౌరవం, ప్రాధాన్యత కేసీఆర్ ప్రభుత్వంలోనే దక్కిందన్నారు. నిజామాబాద్లో జాబ్మేళాలతో ఉద్యోగాలను భారీగా యువతకు కల్పించినట్లు చెప్పారు. ఐటీ హబ్ ద్వారా యువతకు ఉద్యోగాలు వచ్చాయన్నారు.
ధనంతోపాటు గుణమున్న నేత బిగాల
కల్యాణలక్ష్మి చెక్కు వస్తే చీర పట్టుకొని ఆడబిడ్డలకు కట్నం రూపంలో మీ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా ఇంటికే వచ్చి ఇస్తున్నారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ధనంతోపాటు గుణం ఉన్న నాయకుడు బిగాల అని కొనియాడారు. అభివృద్ధి ఒక్కటే సరిపోదు.. ఆత్మగౌరవం కూడా ఉండాలి అని బలంగా నమ్మే పార్టీ బీఆర్ఎస్ అని చెప్పారు. ప్రజలంటే ప్రేమ, అభిమానం ఉన్న నాయకులను కడుపులో పెట్టుకొని కాపాడుకోవాలని అందరినీ కోరారు. నిజామాబాద్ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్లను కోరి కోట్లాది రూపాయల నిధులు తీసుకొచ్చారని చెప్పారు. నగర అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని ప్రశంసించారు.
కవిత పోరాటంతోనే మహిళా బిల్లు
దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న మహిళా బిల్లు మొన్ననే పార్లమెంట్లో ఆమోదం పొందినట్లు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా అన్నారు. ఎమ్మెల్సీ కవితక్క చేసిన పోరాటం ఫలితంగానే ఢిల్లీ గద్దె మీద ఉన్న పాలకులు ఇక మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టక తప్పదని భావించారన్నారు. మహిళా లోకం తరఫున ఎమ్మెల్సీ కవితక్కకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. మహిళా బిల్లు ఆమోదం తర్వాత తొలిసారిగా జిల్లాకు వచ్చినందునే కృతజ్ఞతగా స్వాగత కార్యక్రమం నిర్వహించినట్లు పేర్కొన్నారు. ర్యాలీలో పాల్గొన్న ప్రతిఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. గత నెలలో నిజామాబాద్కు వచ్చిన మంత్రి కేటీఆర్ ఇచ్చిన మాట ప్రకారం నగరపాలక సంస్థ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాల కోసం రూ.60కోట్లు మంజూరు చేశారని, నిజామాబాద్ అభివృద్ధికి మరిన్ని నిధులు అందించిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితక్కకు నగర ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు.