కామారెడ్డి, మార్చి 5: రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే బోధన్ హాస్టల్లో విద్యార్థి వెంకట్ హత్య జరిగిందని, మరో ఏడుగురు విద్యార్థులపై హత్యకేసు నమోదైందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తంచేశారు. హాస్టల్లో వార్డెన్, వాచ్మన్ లేకపోవడంతోనే ఈ ఘటన జరిగిందని, సీఎం రేవంత్ రెడ్డి అసమర్థత, పట్టింపులేని చర్యలతోనే ఈ ఘటన జరిగిందని అన్నారు. పొందుర్తి ఆవరణలోని ఓ ఫాంహౌస్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇప్పటి వరకు తెలంగాణలో ఐదుగురు విద్యార్థుల చావులు చూశానని అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో విద్యార్థుల చావులు చూశామంటే, మళ్లీ ఈ మూడు నెలల్లోనే చూస్తున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. కేసీఆర్పై ఏడ్వడం తప్ప సీఎం రేవంత్రెడ్డి తెలంగాణ సమాజానికి చేసింది ఏమీలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పటి వరకు విద్యాశాఖకు మంత్రి లేకపోవడం దురదృష్టకరమని అన్నారు. విద్యాశాఖను సీఎం తనవద్దే ఉంచుకున్నాడని, దీనిపై త్వరలో రివ్యూ నిర్వహించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో హాస్టళ్ల వద్ద పోలీసులను నియమించాలని జిల్లా కలెక్టర్ను కోరినట్లు తెలిపారు. మృతి చెందిన వి ద్యార్ధి తల్లికి పింఛన్, సోదరుడికి ఉద్యోగం, రూ.15లక్షల నష్టపరిహారం, ఒక డబుల్ బెడ్రూం ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్, బీజేపీలు ఒకటే అని అన్న రేవంత్ రెడ్డి మొన్నటి సభలో మోదీ పెద్దన్న అనడంతో నిజస్వరూపం బయటపడిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ మూమ్మాటికీ ఒక్కటేనని, ప్రాంతీ య పార్టీలు ఉండొద్దనేది రెండు పార్టీల లక్ష్యమని అన్నారు. రేవంత్రెడ్డి ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్న వ్యక్తి కాబట్టే మోదీని పెద్దన్న అన్నాడని పేర్కొన్నారు. తెలంగాణకు బడ్జెట్లో ఒక్క రూపాయి కేటాయించకపోయినా ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. సీఎంకు పబ్లిసిటీ మీద ఉన్న ధ్యాస ప్రజల సమస్యల మీద లేదని అన్నారు. భువనగిరిలో ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలు నిరసన తెలిపితే వారిని అరెస్టు చేస్తారా? మార్పు అంటే ఇదేనా అని ప్రశ్నించారు. కేసీఆర్ ఇచ్చిన నియామకాలను రేవంత్రెడ్డి ఇచ్చినట్లుగా గొప్పలు చెబుతున్నారని అన్నారు. నో ఎల్ఆర్ఎస్, నో కాంగ్రెస్ అనే నినాదాంతో రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు నిరసన కార్యక్రమాలు చేపడుతారని తెలిపారు. విలేకరుల సమావేశంలో ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నిట్టు వేణుగోపాల్ రావు, ఎంజీ వేణుగోపాల్ గౌడ్, జడ్పీ వైస్ చైర్మన్ పరికి ప్రేమ్ కుమార్, పట్టణ అధ్యక్షుడు జూకంటి ప్రభాకర్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కుంబాల రవి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.