భీమ్గల్, మార్చి 29: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలుచేసే వరకు రైతుల పక్షాన పోరాడుతామని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. వరికి రూ.550 బోనస్ ఇచ్చి, క్వింటాలుకు రూ.2700 లకు ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.లేనిపక్షంలో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు. భీమ్గల్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం చేపట్టిన రైతుల పక్షాన పోరుబాట కార్యక్రమంలో ఆయన పాల్గొనగా.. కమ్మర్పల్లి, మోర్తాడ్, భీమ్గల్ మండలాలకు చెందిన వందలాది మంది రైతులు తరలివచ్చారు. ఈ సందర్భంగా వేముల మాట్లాడుతూ.. వరి కోతలు పూర్తయి కల్లాలకు చేరాయని, వెంటనే గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. చాలా మంది రైతులు ఇప్పటికే దళారులకు క్వింటాలుకు రూ.2,200 చొప్పున అమ్ముకున్నారని, వారికి కూడా రూ.500 బోనస్ ఇవ్వాలన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జిల్లాలో 490 ధాన్యం కొనుగోలు కేంద్రాలకు గాను బాల్కొండ నియోజకవర్గంలోనే వందకుపైగా ఏర్పాటు చేసినట్లు గుర్తుచేశారు.
కాంగ్రెస్ నాయకులు మండలాల్లో అర్రస్ పాడినట్లు ప్రభుత్వ కార్యాలయాలను పంచుకొని అక్రమ సంపాదనకు తెరలేపారని మండిపడ్డారు. మండల ఆఫీస్ ఒకరు, తహసీల్ ఆఫీస్ మరొకరు, ఇంకొకరు పోలీస్స్టేషన్ను పంచుకొని పైరవీలు చేసుకుంటున్నారే తప్ప ప్రజల సమస్యలను పట్టించుకోవడంలేదని విమర్శించారు. ఒకరిద్దరిని బెదిరించి లేక కొందరు తమ స్వార్థం కోసం పార్టీ మారితే బీఆర్ఎస్కు వచ్చిన నష్టం ఏమీలేదని స్పష్టం చేశారు. ఆణిముత్యాల్లాంటి కార్యకర్తలు తనతోపాటు కేసీఆర్ వెంటే ఉంటారని, వారెక్కడికి వెళ్లరని నొక్కి చెప్పారు.కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను మెడలు వంచైనా అమలుచేసేలా ప్రజలు, రైతుల పక్షానా పోరాడతున్నామని స్పష్టం చేశారు.
ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను సక్రమంగా అమలుచేయకుంటే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుదామని పిలుపునిచ్చారు. ఓట్లు వేయించుకున్నాక ఇచ్చిన హామీలను అట్టకెక్కిస్తారని అన్నారు. హామీలను అమలుచేసే వరకు గ్రామాల్లో కాంగ్రెస్ నాయకత్వాన్ని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఎక్కడికక్కడ నిలదీయాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కన్నె ప్రేమలతా సురేందర్, ఎంపీపీలు ఆర్మూర్ మహేశ్, శివలింగు శ్రీనివాస్, లొలపు గౌతమి, జడ్పీటీసీలు చౌట్పల్లి రవి, సుంకెట రవి, రాజా గౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు దొనకంటి నర్సయ్య, ఏలియా, దేవేందర్, మున్సిపల్ వైస్ చైర్మన్ భగత్, కౌన్సిలర్లు, మాజీ సర్పంచులు, నాయకులు, రైతులు పాల్గొన్నారు.
ఇండ్లకే సక్కగా కరెంటు ఇయ్యనోడు ఎవుసానికి కరెంటు ఇత్తడంటే ఎలా నమ్ముతాం. ఎన్నికల్లో మాయ మాటలు చెప్పి ఓట్లు అడుకున్నారు. ఇప్పుడు ఆల్ల రంగు బయటపడింది. రైతులను బాధ పెట్టిన ప్రభుత్వం, నాయకులు ఎప్పటికీ బాగు పడరు. మళ్లీ దళారుల వద్దకు పోయేటట్టు జేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం.
-ఆర్మూర్ రాజేశ్వర్, రైతు, చేంగల్, భీమ్గల్ మండలం
పంటల కొనడానికి కేంద్రాలను ప్రారంభించలేని రేవంత్ సర్కారు వట్టి మాటలు చెబుతూ మమ్మల్ని మోసం చేస్తున్నది. దళారుల చేతుల్లో మోసపోవడానికి ఉసిగొల్పుతున్నది. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్కు తగిన బుద్ధి చెబుతాం.
-పులి రాజేశ్వర్, రైతు, తిమ్మాపూర్, మోర్తాడ్ మండలం