ఎల్ఆర్ఎస్ను ఉచితంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నాయకులు, కార్యకర్తలు బుధవారం పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. బాల్కొండ మండల కేంద్రంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి, కామారెడ్డిలో మాజీ ఎమ్మెల్యే గంపగోవర్ధన్, నిజామాబాద్ నగరంలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ధర్నా నిర్వహించారు.
భూముల క్రమబద్ధీకరణను ఉచితంగా చేస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. హామీని మరిచి ఎల్ఆర్ఎస్ ద్వారా ప్రజలపై భారం మోపాలని చూస్తున్నదని నేతలు మండిపడ్డారు. ఎల్ఆర్ఎస్ను ఉచితంగా అమలుచేసే వరకు ప్రజల తరఫున ప్రభుత్వంపై పోరాడుతామని
నినదించారు.
బాల్కొండ, మార్చి 6: ఎల్ఆర్ఎస్ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కో ప్లాట్పై లక్ష రూపాయలు వసూలు చేసేందుకు సిద్ధమయ్యిందని, దీంతో 25లక్షల మందికి నష్టం జరుగుతుందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. ప్రజలపై భారం మోపకుండా ఎల్ఆర్ఎస్ను ఉచితంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. బాల్కొండ మండల కేంద్రంలో బుధవారం నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎల్ఆర్ఎస్ తీసుకొస్తే నానా యాగి చేసి, తాము అధికారంలోకి వస్తే ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ నేతలు.. ఇప్పుడు ప్రజలపై రూ.20వేల కోట్ల భారం వేసేందుకు సిద్ధమయ్యారన్నారు.
ఎల్ఆర్ఎస్ను ఉచితంగా వర్తింపజేసే వరకు పోరాటం ఆపేది లేదని స్పష్టంచేశారు. ఇచ్చిన హామీ మేరకు ఎల్ఆర్ఎస్ను ఉచితంగా అమలు చేయించకుంటే సీఎం రేవంత్రెడ్డితోపాటు మంత్రులు ఉత్తమ్, సీతక్క, కోమటిరెడ్డి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇన్ని రోజులు ఓపికతో భరించామని, ప్రభుత్వ తప్పులపై నేటి నుంచి వేట మొదలైందన్నారు. మూడు నెలలైనా రైతుబంధు పడలేదని, మహాలక్ష్మి ఊసేలేదని, చేయూత పింఛన్ మరిచిపోయారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అమలు చేసింది ఉచిత బస్సు ప్రయాణం ఒక్కటేనని, ఉచిత బస్సుతో ప్రజలు ఇబ్బందిపడుతున్నారని తెలిపారు.
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను వేధిస్తున్న అధికారులు, పోలీసులకు తాము అధికారంలోకి రాగానే బుద్ధి చెబుతామన్నారు. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదని, తమకూ టైం వస్తుందని, బీఆర్ఎస్ కార్యకర్తలను ఇబ్బంది పెట్టే ప్రతిఒక్కరి పేరు రాసి పెట్టుకుంటామన్నారు. అక్రమ కేసులు పెడితే తగిన మూల్యం తప్పదని హెచ్చరించారు. ధర్నా అనంతరం తహసీల్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి తహసీల్దార్కు వినతిపత్రం సమర్పించారు.