మోస్రా (చందూర్), ఫిబ్రవరి 25: బాన్సువాడ నియోజకర్గంలోని అన్ని కులాలు, వర్గాల వారికి బీఆర్ఎస్ హయాంలో కమ్యూనిటీ హాళ్లు, కల్యాణ మండపాలు నిర్మించి ఇచ్చామని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై దౌర్జన్యం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. మోస్రా మండల కేంద్రంలో నిర్మించిన మొటాడి రెడ్డి కల్యాణ మండపం ప్రారంభోత్సవానికి నిజామాబాద్ జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావుతో కలిసి ఆదివారం ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేశారు.
అనంతరం నిర్మాణంలో ఉన్న మండల కార్యాలయాల సముదాయాన్ని పోచారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు, కులాలు, మతాలకు సమ ప్రాధాన్యం ఇచ్చామన్నారు. మొత్తం 4వేల కమ్యూనిటీ హాళ్లు, 120 కల్యాణ మండపాలు మంజూరు చేశామని గుర్తుచేశారు. ప్రజల కోరిక మెరకు మోస్రాను కొత్త మండలంగా మార్చామని, రూ. 7.50 కోట్లతో ప్రధాన రహదారిపై సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుచేశామన్నారు.
అధికారం, పదవులు వస్తాయి.. పోతాయి అని, మనం చేసే మంచి పనే చిరస్థాయిగా నిలుస్తాయని అన్నారు. తన 20 ఏండ్ల రాజకీయ జీవితంలో ఎవరికీ అన్యాయం చేయలేదన్నారు. కొందరు నాయకులు స్వార్థం కోసం పార్టీలు మారడంపై ఎమ్మెల్యే స్పందించారు. ఎవరు పోయినా తనకు బాధలేదని, పొల్లు పోతే.. గట్టి మిగులుతుందన్నారు. తనకు అండగా నిలిచిన వారిని కడుపులో పెట్టుకొని కాపాడుకుంటానని స్పష్టం చేశారు. అధికార పార్టీ నాయకుల ప్రోత్బలంతో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై దౌర్జన్యం, హాని తలపెడితే ఊరుకునేదిలేదని హెచ్చరించారు.
న్యాయం జరిగేవరకు వదిలిపెట్టనన్నారు. బీఆర్ఎస్కు త్వరలోనే మంచి రోజులు వస్తాయన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ భాస్కర్రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు సురేందర్రెడ్డి, జడ్పీటీసీ గుత్ప విజయా భాస్కర్రెడ్డి, ఎంపీపీ పిట్ల ఉమా శ్రీరాములు, వైస్ ఎంపీపీ కత్తి శంకర్, మాజీ సర్పంచ్ సుమలతా రాంరెడ్డి, మాజీ సర్పంచులు నరేందర్, భూమయ్య, విమలాలింగయ్య, రెడ్డి సంఘ సభ్యులు పాల్గొన్నారు.